ETV Bharat / business

చైనా తీరు నచ్చట్లేదా.. 'రిమూవ్‌ చైనా యాప్స్'

author img

By

Published : Jun 2, 2020, 6:00 PM IST

ఇటీవలి కాలంలో భారత్​పై చైనా అనుసరిస్తున్న వైఖరి, కరోనా అక్కడే పుట్టిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన యాప్​లను వినియోగించొద్దన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు తగినట్టే చైనా యాప్​లను గుర్తించి.. తొలగించేందుకు రిమూవ్ చైనా యాప్స్​ పేరిట ప్లేస్టోర్​లోకి ఓ యాప్ వచ్చింది.

china apps
చైనా తీరు నచ్చట్లేదా.. 'రిమూవ్‌ చైనా యాప్స్'

చైనాకు చెందిన యాప్‌లను గుర్తించి, తొలగించేందుకు ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ పేరుతో ప్లేస్టోర్‌లో ఓ యాప్‌ ఉంది. ప్రస్తుతం ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో‌ టాప్‌ ఫ్రీ యాప్స్‌ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మే 17న ఈ యాప్‌ను ప్లేస్టోర్‌లోకి తీసుకురాగా, కేవలం రెండు వారాల్లోనే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 మిలియన్‌ డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతోంది.

కరోనా వైరస్‌ పుట్టడానికి చైనాయే కారణమంటూ అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న వివాదం కారణంగా చైనా యాప్‌ల వాడకాన్ని తగ్గించాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు ట్రెండ్‌ అవుతున్నాయి. అయితే, ఏ యాప్‌ ఏ దేశానికి చెందిందో చాలా మందికి తెలియదు. ఇలాంటి సమయంలోనే ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ ఒక్కసారిగా పాపులర్‌ అయింది. ఇక టిక్‌టాక్‌కు పోటీగా మిత్రోన్‌ అనే యాప్‌ కూడా ఇప్పుడు ప్లేస్టోర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

అసలు ఏంటీ రిమూవ్ చైనా యాప్స్‌

జైపూర్‌కు చెందిన వన్‌ టచ్ యాప్‌ ల్యాబ్స్ అనే సంస్థ వినూత్నంగా ఆలోచించి ‘రిమూవ్ చైనా యాప్స్’ అనే కొత్త యాప్‌ను తయారు చేసింది. ఏ యాప్‌ ఏ దేశానికి చెందినది అన్న దానిపై స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అవగాహన కల్పించడం కోసమే డెవలపర్లు ఈ యాప్‌ను తయారు చేశారట. ప్రస్తుతం భారత్‌పై చైనా వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఆ దేశం తయారు చేసిన యాప్స్‌ను వాడొద్దని ప్రచారం మొదలవడం.. ఆ యాప్స్‌ను గుర్తించేలా ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ ఉన్న కారణంగా పలువురు ట్రెండ్‌ చేసిన నేపథ్యంలో ఇది కాస్తా వైరల్‌ అయింది.

విశేష ఆదరణ..

ఇప్పటికే 50లక్షల డౌన్‌లోడ్‌లు దాటగా, 4.9 రేటింగ్‌తో ఈయాప్ విశేష ఆదరణ సొంతం చేసుకుంది. కేవలం భారత్‌లోనే కాదు, ఆస్ట్రేలియాలోనూ ఈ యాప్‌కు పాపులారిటీ వచ్చింది. ప్లే స్టోర్‌ లేదా, థర్డ్‌ పార్టీ యాప్‌ స్టోర్స్‌ నుంచి వినియోగదారులు ఇన్‌స్టాల్‌ చేసుకున్న యాప్స్‌ను మాత్రమే ఇది గుర్తిస్తుంది. చైనా ఫోన్‌తో పాటు వచ్చి ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌ను గుర్తించలేదు.

'అవసరమైన యాప్​నే ఇన్‌స్టాల్‌ చేయండి'

అవసరం ఉన్న యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందిగా స్మార్ట్​ఫోన్ వినియోగదారులను టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునే సమయంలో అవసరమైన పర్మిషన్‌లు మాత్రమే ఇవ్వాలని అంటున్నారు. ఒకవేళ ఏదైనా యాప్‌ మీ ఫోన్ బ్యాగ్రౌండ్‌లో రన్‌ అవుతున్నట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని డిసేబుల్‌ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. మొబైల్‌లో ఉన్న యాప్స్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం, యాంటి వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లను వినియోగించడం ద్వారా సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్ గ్రౌండ్​​ రిపోర్ట్​: 'కాలాపానీ'పై రగడ ఏల?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.