ETV Bharat / business

జూమ్​ యాప్​కు దీటుగా ఫేస్​బుక్ 'మెసెంజర్​ రూమ్స్​​'

author img

By

Published : Apr 26, 2020, 4:36 PM IST

వీడియో కాన్ఫరెన్స్​ కోసం ఫేస్​బుక్ సరికొత్త ఆవిష్కరణను అందుబాటులోకి తెచ్చింది. మెసెంజర్ రూమ్స్ పేరుతో 50 మంది ఒకే సారి వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనేలా దీన్ని రూపొందించింది. జూమ్ యాప్​కు పోటీగా ఫేస్​బుక్ ఈ ఫీచర్​ను రూపొందించినట్లు తెలుస్తోంది.

Messenger Room
జూమ్​ యాప్​కు దీటుగా ఫేస్​బుక్ సరికొత్త పీచర్​

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా చాలా దేశాలు లాక్​డౌన్​లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్​లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. లాక్​డౌన్​ ముందు పెద్దగా పరిచయం లేని 'జూమ్' వంటి యాప్​లు ఇప్పుడు ట్రెండింగ్​లో కొనసాగుతున్నాయి. అయితే జూమ్ యాప్​పై ఇటీవల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం కూడా అధికారిక అవసరాలకు 'జూమ్' యాప్​ను వినియోగించొద్దని సూచించింది.

ఇదే అదునుగా.. డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని జూమ్​ యాప్​కు పోటీగా వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం మెసెంజర్​ రూమ్స్ ఫీచర్​ను ఆవిష్కరించింది సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్. ఇందులో ఒకే సారి 50 మంది వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనే వీలుందని తెలిపింది. జూమ్ యాప్​లో ఈ పరిమితి 100 మందికి ఉండటం గమనార్హం.

మెసెంజర్ రూమ్స్​ సదుపాయాలు..

జూమ్ యాప్​లో ఉన్నట్లుగానే మెసెంజర్​ రూమ్స్​లో సరికొత్త ఫీచర్లు ఉంటాయని ఫేస్​బుక్ తెలిపింది. 14 రకాల కెమెరా ఫిల్టర్లు ఉంటాయని పేర్కొంది. అమెరికాలో రానున్న వారాల్లో మెసెంజర్​ రూమ్స్​ను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం మెసెంజర్​, వాట్సాప్​ల ద్వారా రోజుకు 700 మిలియన్ల మంది కాల్స్ చేసుకుంటున్నట్లు పేర్కొంది.

ఖాతాలేకున్నా...

ఖాతా లేని వారూ మెసెంజర్​ రూమ్స్​ కాన్ఫరెన్స్​లో పాల్గొనేందుకు వీలు కల్పించున్నట్లు తెలిపింది ఫేస్​బుక్. ఇందుకోసం కాన్ఫరెన్స్ లింక్​ను గ్రూపులు, పేజీల్లో షేర్​ చేసి ఇతరులను కాన్ఫరెన్స్​లోకి ఆహ్వానించే వీలుందని వెల్లడించింది. హోస్ట్​కు కాల్​ను నియంత్రించే అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఫేస్​బుక్​లో ఖాతా ఉన్నవారెవరైనా వీడియో కాల్​ను క్రియేట్ చేసే వీలుందని తెలిపింది.

ఇదీ చూడండి:కరోనా తర్వాతా 'వర్క్ ఫ్రమ్​ హోమ్'​ కొనసాగింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.