ETV Bharat / business

ఏబీఎస్ పెట్టుబడులతో పెరిగిన డేటా ఉద్యోగాలు..

author img

By

Published : Nov 7, 2020, 7:12 AM IST

data jobs increase in hyderabad with amazon web services investments
ఏబీఎస్ పెట్టుబడులతో పెరిగిన డేటా ఉద్యోగాలు..

స్థానిక ఐటీ రంగంలో ‘డేటా’ జోరు పెరిగింది. డేటా కేంద్రాలను పెద్దఎత్తున ఆకర్షించే సానుకూలత కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న అనేక రకాలైన అనుకూలతలకు తోడు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(ఏడబ్ల్యూఎస్‌) 2.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో డేటా కేంద్రాల క్లస్టర్‌ను ఏర్పాటు చేయటానికి ముందుకు రావటంతో ఈ విభాగానికి చెందిన ఇతర కంపెనీలు సైతం హైదరాబాద్‌ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో పెద్ద ఎత్తున ‘డేటా’ ఉద్యోగాలు లభిస్తాయని ఇక్కడి ప్రభుత్వ, ఐటీ పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న డేటా కేంద్రాలకు దాదాపు 32 మెగావాట్ల సామర్థ్యం ఉంది. ఇది సమీప భవిష్యత్తులో అనూహ్యంగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘డేటా లోకలైజేషన్‌’ విధానాన్ని ఆవిష్కరించిన విషయం విదితమే. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ ‘డేటా సెంటర్‌ విధానం- 2020’ని సిద్ధం చేస్తోంది. ఈ విధానం ముసాయిదా ప్రతిని చర్చకు పెట్టింది. త్వరలో ఈ విధానం చట్టరూపం దాల్చే అవకాశం ఉంది. మరోపక్క డేటా అవసరాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, ఐఓటీ, 5జీ వంటి నూతన టెక్నాలజీలు విస్తరిస్తున్న నేపథ్యంలో డేటా నిల్వ అవసరాలు పెరగటమే కానీ తగ్గే అవకాశాలు లేవు. స్థానికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూల విధానాలు అనుసరిస్తోంది. దీంతో డేటా కేంద్రాల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతర కంపెనీలు సైతం భవిష్యత్తులో ఇక్కడ తమ డేటా కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో డేటా కేంద్రాల సామర్థ్యం 130 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషణ. దీనివల్ల అనలటిక్స్‌, డేటా మైనింగ్‌, డేటా సెంటర్ల నిర్వహణ విభాగాల్లో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో గిరాకీ..

ఇటీవల పలు సంస్థలు తమ వ్యయాలను తగ్గించుకోవటంలో భాగంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల వైపు మొగ్గుచూపుతున్నాయి. డేటా కేంద్రాలకు గిరాకీ పెరగటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. మార్కెట్‌ పరిశోధనా సేవల సంస్థ అయిన ఐడీసీ, మనదేశంలో పబ్లిక్‌ క్లౌడ్‌ సేవల మార్కెట్‌ 2024 నాటికి 7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. దీని బట్టి డేటా కేంద్రాలకు సమీప భవిష్యత్తులో ఎంతో డిమాండ్‌ లభిస్తుందని, ఈ విభాగంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలుంటాయని స్పష్టమవుతోంది.

ఎందుకు అనుకూలం..

ఏ సంస్థ అయినా తన సమాచారాన్ని ఒక చోట మాత్రమే కాకుండా, రెండు- మూడు ప్రదేశాల్లో నిల్వ చేయటం తప్పనిసరి. ఎందుకంటే... సాంకేతిక ఇబ్బందుల ఫలితంగా లేక ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ... ఇంకేదైనా సమస్య వల్ల ఒక చోట నిల్వచేసిన సమాచారాన్ని కోల్పోయే పరిస్థితి రావచ్చు. దానివల్ల జరిగే నష్టం అపారం. అంత సమాచారాన్ని మళ్లీ సేకరించటం ఎంతో కష్టం. అందుకే ఒక చోట మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో కూడా అదే సమాచారాన్ని దాచుకోవలసిన అవసరం ఉంటుంది. దాన్నే ‘బ్యాకప్‌’ అంటారు. ‘బ్యాకప్‌’ కోసం సమాచారాన్ని నిల్వ చేయటానికి హైదరాబాద్‌ అనుకూలమైన ప్రదేశమని దశాబ్దకాలం క్రితం గుర్తించి కొన్ని సంస్థలు ఇక్కడ తమ సొంత డేటా కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ), మరికొన్ని సంస్థలు దీనికి ఉదాహరణ. దేశానికి మధ్య భాగంలో యుద్ధభయం తక్కువగా, ప్రకృతి వైపరీత్యాల ముప్పు అంతగా లేని హైదరాబాద్‌ నగరంలో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయటం, అక్కడ సమాచారాన్ని నిల్వ చేయటం భద్రమని గుర్తించిన ఫలితమే ఇది. దీని వల్ల ముంబయి, దిల్లీ, బెంగుళూరు... తదితర నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు ప్రత్యామ్నాయ ప్రదేశంగా హైదరాబాద్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

విస్తరణ దిశగా..

కొన్ని ప్రపంచ స్థాయి సంస్థలను పరిగణనలోకి తీసుకొని మన దేశంలో ఏడబ్ల్యూఎస్‌ తన డేటా కేంద్రాలను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు ఏడబ్ల్యూఎస్‌ వినియోగదార్లుగా ఉన్న విషయం గమనార్హం. హంగామా, రెడిఫ్‌, ఓలా, హాట్‌స్టార్‌, షాపర్స్‌స్టాప్‌, పేటీఎం, పెప్పర్‌ఫ్రై... తదితర సంస్థలు ఏడబ్ల్యూఎస్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇంకా ఎడిల్‌వైజ్‌, ఓయో, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు ఏడబ్ల్యూఎస్‌ సేవలను వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: క్యూ3లో స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ 17 శాతం వృద్ధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.