ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్.. జూన్ త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. నికర ఆదాయంలో 41.8శాతం వృద్ధిని నమోదు చేసి... 512 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.3,801.7 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర ఆదాయం 361 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నేఫథ్యంలో... తాము ఈ ఏడాది లక్ష మందికిపైగా కొత్త ఉద్యోగులను తీసుకుంటామని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతమున్న ఉద్యోగులపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ఈ నియామకం చేపట్టనున్నట్లు చెప్పింది.
"రెండో త్రైమాసికంలో మేము మంచి ఫలితాలు నమోదు చేశాం. పెట్టుబడి లక్ష్యాలకు తగ్గట్లుగా... ఆధునిక వ్యాపారాలను నిర్మించేందుకు మా సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ విభాగాలకు విస్తరించాలనుకుంటున్నాం. దీని ద్వారా ఓ బలమైన సంస్థగా కాగ్నిజెంట్ రూపొందుతుందని ఆశిస్తున్నాం."
-బ్రెయిన్ హంఫ్రైస్, కాగ్నిజెంట్ సీఈఓ
2021లో తమ ఆదాయం... 18.4-18.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నామని కాగ్నిజెంట్ తెలిపింది. క్లయింట్ల డిమాండ్లకు తగ్గట్టు సేవలందించేందుకు.. కాగ్నిజెంట్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
"ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు వారికి పరిహారాలు ప్రకటించడం, జాబ్ రొటేషన్స్, నైపుణ్యాలు నేర్పడం, పదోన్నతులు కల్పించడం వంటివి చేయాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా దాదాపు 1,00,000 మంది కొత్తవారిని 2021లో ఉద్యోగాల్లోకి తీసుకోవాలనుకుంటున్నాం. మరో లక్ష మంది అసోసియేట్లకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం."
-బ్రెయిన్ హంఫ్రైస్, కాగ్నిజెంట్ సీఈఓ
ఇవేగాకుండా... 2021లో 30,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను ఈ సంస్థ ఉద్యోగంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022లో ఈ కొత్త ఉద్యోగుల సంఖ్యను 45,000లకు పెంచనున్నట్లు చెప్పింది.
ఇదీ చూడండి: బంగారం దేశీయంగా భళా- అంతర్జాతీయంగా డీలా
ఇదీ చూడండి: వీటన్నింటికీ పన్ను మినహాయింపు ఉంటుంది!