ETV Bharat / business

చమురు ధరలు తగ్గినా మనకు మంట తప్పదా!

author img

By

Published : Apr 22, 2020, 7:00 AM IST

crude oil
ముడి చమురు

అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా క్షీణించిన నేపథ్యంలో మన మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే. ఇక్కడ పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గుతాయా.. లేదా అనే. ఎందుకంటే పెట్రోలు, డీజిల్‌ ధరలు సామాన్యుడి నుంచి కార్పొరేట్‌ల వరకు అందరిపైనా ప్రభావం చూపుతాయి. అమెరికా మార్కెట్లో చమురు ధరలు భారీ స్థాయిలో క్షీణించి సోమవారం -37.63 డాలర్లకు చేరింది. అయితే భారత్​లో ధరలు తగ్గకపోవచ్చని నిపుణుల అంచనా. కరోనా కారణంగా మన దగ్గర కూడా గిరాకీ లేక నిల్వలు అలాగే ఉండిపోవడం వల్ల అమెరికా చమురును కొనేందుకు వీలు లేకుండా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. అయితే అంతకు మించిన లెక్కలు, చిక్కులు మరెన్నో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లో చమురు ధర క్షీణించినా.. మన దగ్గర పెట్రో ధరలు తగ్గకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంతో గిరాకీ భారీగా తగ్గింది. లాక్‌డౌన్‌లు, షట్‌డౌన్‌ల కారణంగా ఉన్న నిల్వలు అయిపోకపోవడం వల్ల.. అదనపు చమురును దాచుకోలేక.. దాచుకోవడానికియ్యే ఖర్చుతో పోలిస్తే ఎదురు డబ్బులిచ్చి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇందుకు ఒక విధంగా కొవిడ్‌-19తో అమెరికా, రష్యా, ఒపెక్‌ దేశాల మధ్య చమురు యుద్ధం కూడా ఒక కారణం.

ఇక మన విషయానికొస్తే..మనం ఎక్కువగా ఒపెక్‌ బ్లాక్‌లోని బ్రెంట్‌ చమురును దిగుమతి చేసుకుంటాం. అది నార్వేకు దగ్గరలోని నార్త్‌ సీ నుంచి వస్తుంది. డబ్ల్యూటీఐ చమురుతో పోలిస్తే బ్రెంట్‌ ధరలు చాలా స్థిరంగా ఉంటాయి. ఇక భారత చమురు ధరలను ఒమన్‌, దుబాయ్‌, బ్రెంట్‌ చమురుల సగటుతో లెక్కిస్తారు. బ్రెంట్‌ ధర ప్రస్తుతం 20 డాలర్లుగా ఉండగా.. ఈ మూడింటి సగటు ధర 20.56 డాలర్లు(ఏప్రిల్‌ 17)గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఇంధనాల ధరలను బట్టే భారత్‌లో పెట్రోలు, డీజిల్‌ల రిటైల్‌ ధరను లెక్కగడతారు. ఇవి తగ్గినపుడే భారత్‌లో పెట్రోలు బంకుల్లో ధరలు కాస్త కిందకు దిగివచ్చు. అది కూడా మాట వరసకే. ఎందుకంటే ముడి చమురు ధరలు తగ్గినా.. పన్ను బాగా ఎక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు అనుకున్నంతగా ఇక్కడి పెట్రోలు, డీజిల్‌ రేట్లు తగ్గవు. తగ్గడం లేదు కూడా.

మన దగ్గర లెక్క ఇదీ..

చమురు మార్కెట్లో అంటే.. మనం అనుకున్న మూడు మార్కెట్లలో ధరలు తగ్గినా.. ఆ ప్రయోజనాన్ని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కమ్మేస్తున్నాయి. అదెలాగో చూద్దాం.. ప్రస్తుతం పెట్రోలు అసలు ధర(ప్రాథమిక ధర) లీటరుకు రూ.27.96 మాత్రమే. డీజిల్‌ లీటరు ప్రాథమిక ధర రూ.31.49 మాత్రమే(దిల్లీలో మార్చి 16, 2020 నాటికి). అయితే బంకుల్లో ధర వరుసగా రూ.69.59; రూ.62.29 చొప్పున కట్టాల్సి వస్తోంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలవడం వల్ల ఆ స్థాయికి ధరలు వెళ్లాయన్నమాట.

పన్నులు ఇలా: పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర పన్నులు(ఎక్సైజ్‌సుంకం) వరుసగా లీటరుకు రూ.22.98; రూ.18.83గా ఉన్నాయి. ఇక దిల్లీలో వ్యాట్‌ లీటరుకు వరుసగా రూ.14.79; రూ.9.19గా కట్టాల్సి వస్తోంది. అంటే పెట్రోలు మీద 54 శాతం మేర పన్ను; డీజిల్‌ మీద 45 శాతం మేర పన్ను కడుతున్నామన్నమాట. ఇది దిల్లీ సంగతి మాత్రమే. మహారాష్ట్ర, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడి రాష్ట్రాల్లో పన్నులు అధికం. అందుకే జనవరి 2020 నుంచి ఇప్పటిదాకా పెట్రోలు, డీజిల్‌ ప్రాథమిక ధరలు రూ.7-8 వరకు తగ్గినా.. అధిక పన్నుల కారణంగా రిటైల్‌ ధరలు ఆ స్థాయిలో కిందకు దిగిరాలేదు. మార్చి 14 నుంచి అమల్లోకి వచ్చేలా పెట్రోలు, డీజిల్‌పై రూ.3 చొప్పున కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని సైతం పెంచిన విషయం ఇక్కడ గుర్తించుకోదగ్గ అంశం.

కంపెనీలకు ఎంత లాభం

వినియోగదార్లకు ప్రయోజనాలను బదిలీ చేయట్లేదు కాబట్టి లాభం కంపెనీలకే. ఒక వేళ ఏప్రిల్‌ వరకు కంపెనీలు ధరలను తగ్గించకపోతే మాత్రం లీటరుకు రూ.11.63 మేర నికర మార్కెటింగ్‌ మార్జిన్‌ లభిస్తుందని ఒక బ్రోకరేజీ అంచనా వేస్తోంది. ఏప్రిల్‌ 1 వరకు రోజువారీ 15 పైసల నుంచి 30 పైసల వరకు తగ్గింపు ఉన్నా.. మార్జిన్‌ రూ.8-10 వరకైనా ఉంటుంది. ఈ అధిక మార్జిన్‌ కూడా వినియోగదార్ల జేబు నుంచి డబ్బులు ఎగిరి పోయేలా చేస్తోంది. అయితే కొవిడ్‌ తర్వాత ముఖ్యంగా లాక్‌డౌన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా బంకుల్లో విక్రయాలు 60 శాతం దాకా తగ్గాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రస్తుతం నష్టాల బాట పట్టాయి.

నాణేనికి రెండో వైపూ ఉంటుంది. అలాగే తక్కువ స్థాయి ధరలు స్వల్పకాలానికి మంచిదే కానీ.. దీర్ఘకాలంలో చమురు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. తయారీదార్ల వద్ద తవ్వకం, ఉత్పత్తికి అదనపు నిధులేమీ ఉండవు. అపుడు ఉత్పత్తి తగ్గుతుంది. కంపెనీలు మళ్లీ నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఎదురవుతుంది.

మే నెలలో తగ్గవచ్చు!

ప్రస్తుత పరిస్థితులను లెక్కవేస్తే మార్చి నుంచి ముడి చమురు ధరలు బాగా తగ్గాయి. ఒక వేళ పెట్రో ధరలు తగ్గితే మే నెల నుంచి మాత్రమే తగ్గవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ముడి చమురు ధరలు 2002లో ఉండేవి. బారెల్‌ ధర 26 డాలర్ల వరకూ ఉండేది. ఆ సమయంలో పెట్రోలు ధర రూ.29 మాత్రమే. అలాగే డీజిల్‌ లీటరు ధర రూ.18 మాత్రమే. ఒక వేళ పెరిగిన వ్యయాలను దృష్టిలో ఉంచుకున్నా.. సహేతుక సుంకం పెంపునూ పరిగణనలోకి తీసుకున్నా.. పెట్రోలు, డీజిల్‌ ధరలు ప్రస్తుతం కంటే తక్కువగానే ఉండాలి. అయితే ద్రవ్యలోటు లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం అందుకు ముందుకు రాకపోవచ్చు.

తగ్గిన ధరల నుంచి ప్రయోజనం ఎంత?

భారత్‌, చైనాల జనాభానే 280 కోట్లకు పైగా ఉంది. ఇంత జనాభా, పరిశ్రమలు అన్నీ లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిరాకీ బాగా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నిల్వలు బాగా పెరిగిపోయి 1.8 బిలియన్‌ బారెళ్లకు చేరుకున్నాయి. చారిత్రాత్మక గరిష్ఠ స్థాయి ఇది. అయితే ఇక్కడ కీలక ప్రశ్న ఏమిటంటే.. ఉత్పత్తిని ఎలా నిల్వ చేయాలన్నదే. భారత్‌ వరకు చూస్తే ఈ ధరలు తగ్గడం ఒక అవకాశమే. ఈ సమయంలో చమురును కొనుక్కుంటే ధరలు పెరిగినపుడు ప్రయోజనాన్ని పొందొచ్చు.

కానీ అందరిలాగే మన దగ్గరి రిఫైనరీలూ పూర్తి నిల్వలతో నిండి ఉన్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం, మంగళూరు, పాడూరుల్లో కలిపి మన నిల్వ సామర్థ్యం 5.3 మిలియన్‌ టన్నులుగా ఉంది. ఇది 9.5 రోజుల నికర దిగుమతులకు మాత్రమే ఉపయోగపడుతుంది. నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. అది ఆలస్యం అవుతూనే వస్తూ ఉంది. 6.5 మిలియన్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో చండిఖోల్‌, పాడూర్‌లలో నిర్మాణాలకు అనుమతులు కూడా ఉన్నాయి. అయితే పెట్రోలు గిరాకీ 61%; డీజిల్‌ గిరాకీ 74%; ఏటీఎఫ్‌ గిరాకీ 94% మేర తగ్గిన నేపథ్యంలో ప్రస్తుత నిల్వలు అయిపోవడానికి సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయడం మంచిది.

గల్ఫ్‌ దేశాల్లో భారతీయులపై...

భారత్‌ ఏటా 1.4 బిలియన్‌ బారెళ్లను దిగుమతి చేసుకుంటుంది. గత అయిదేళ్లుగా చమురు ధరలు తగ్గుతూ వస్తుండడంతో ఆ ప్రయోజనం పొందుతూ వచ్చింది. బారెల్‌ ధర 110 డాలర్ల నుంచి గతేడాది 50-60 డాలర్లకు చేరడంతో ఆ మిగిలిన నిధులతో సంక్షేమ పథకాలను వినియోగించింది. ఇపుడు అదనంగా మరో 30 డాలర్లు తగ్గడమూ మంచి విషయమే. అయితే ఇలా ధరలు బాగా తగ్గితే చమురు అధికంగా ఎగుమతి చేసే గల్ఫ్‌ దేశాలు ఇబ్బందుల పాలవుతాయి. ఇది ఆయా దేశాల్లో పనిచే 80 లక్షల మంది భారత కార్మికులపై ప్రభావం పడుతుంది. ఈ కార్మికులు భారత్‌కు పంపే నిధులు కూడా ఎక్కువే. గల్ఫ్‌ దేశాల నుంచి ఈ విధంగా నగదును పొందే దేశాల్లో భారత్‌దే అగ్రస్థానం.

నిల్వలు పెంచుకుంటాం: ట్రంప్‌

ప్రస్తుత తగ్గిన ధరల నేపథ్యంలో వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం పేర్కొన్నారు. అదనంగా 75 మిలియన్‌ బారెళ్లను కొని నిల్వలను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్‌ ఆ నిధులకు ఆమోదం తెలిపితేనే కొంటామని స్పష్టం చేశారు. లేదంటే ఉన్న నిల్వ సామర్థ్యాన్ని థర్డ్‌ పార్టీలకు అద్దెకు ఇస్తామని వివరించారు. అధికారిక పరిమితి 713.5 మిలియన్‌ బారెళ్లు కాగా.. ప్రస్తుతం అందులో 635 మిలియన్‌ బారెళ్ల చమురు నిల్వ ఉంది. మొత్తం సామర్థ్యం 727 మిలియన్‌ బారెళ్లు కావడంతో మిగతా సామర్థ్యాన్ని అద్దెకు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.

మంగళవారమూ దిగువకే

లండన్‌: సోమవారం -37.63 డాలర్లకు చేరిన అమెరికా చమురు సూచీ ద వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌(డబ్ల్యూటీఐ).. మంగళవారం కోలుకుంది. -7.4 డాలర్లకు చేరుకుంది. ఇక బ్రెంట్‌ చమురు కూడా మంగళవారం ఒక దశలో 16% దాకా నష్టపోయి 19.92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.