ETV Bharat / business

నిషేధంతో టిక్​టాక్​ సంస్థకు రోజుకు ఎంత నష్టం?

author img

By

Published : Jun 30, 2020, 10:23 AM IST

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకోవడానికి మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక చర్యకు ఉపక్రమించింది. చైనా ఆర్థిక మూలాలకు హెచ్చరికలు పంపే నిర్ణయాన్ని తీసుకుంది. బహుళ ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన చైనా మొబైల్‌ యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యాప్​లపై నిషేధం ఎప్పుడు అమలు కానుంది? బ్యాన్​ కారణంగా టిక్​టాక్ సంస్థకు​ రోజుకు ఎంత నష్టం? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

tiktok lose in oneday
ఒక్కరోజు బ్యాన్​ చేస్తే టిక్​టాక్​ సంస్థకు నష్టమెంత..?

చైనా.. భారత్‌లోకి సరిహద్దుల్లోంచే కాదు.. డిజిటల్‌ మార్గంలోనూ చొరబడాలని చూస్తోంది. అందుకే చైనాకు డిజిటల్‌గా చెక్‌ పెట్టే పని చేసింది భారత్‌. దేశ రక్షణకు, భద్రతకు ముప్పుగా పరిణమించిన చైనాకు చెందిన 59 యాప్​లను నిషేధిస్తున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించింది.

నిషేధంతో ఏంటి ఉపయోగం?

సరిహద్దుల్లో చైనా దూకుడుకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే చైనా వస్తువులను నిషేధించాల్సిందేనని పలు వర్గాల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే వస్తువులను నిషేధించడం కన్నా యాప్‌లను నిషేధిస్తేనే భారత ఆర్థిక వ్యవస్థకు మేలు అని కొంతమంది నిపుణులు చెబుతూ వస్తున్నారు. వస్తువులను నిషేధిస్తే మన ఎగుమతులపైనా ప్రభావం పడుతుంది. యాప్‌లను నిషేధిస్తే సమాచార తస్కరణ ఆగిపోవడమే కాక చైనా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం ఉంటుంది.

చైనాకు ఎలా నష్టం?

భారత్‌లో ప్రధానంగా నాలుగు రకాల చైనా యాప్‌లు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. ఎకానమిక్‌ యాప్‌లు, వ్యానిటీ యాప్‌లు, న్యూసెన్స్‌ యాప్‌లు, చైనా గురించి ఊదరగొట్టే యాప్‌లు- ఈ నాలుగు రకాల్లో కనీసం మూడు రకాలను నిషేధించాలని కొంత మంది నిపుణులు కొన్నాళ్లుగా చెబుతున్నారు. బైదూ లాంటి యాప్‌లు.. చైనాకు డిజిటల్‌ సిల్క్‌ రూట్‌ లాంటివి. భారత మార్కెట్‌లో వాటిపై ఎలాంటి ప్రభావం పడినా ఆ కంపెనీల విలువపై భారీ ప్రభావం కనిపిస్తుంది.

టిక్‌టాక్‌ యాప్‌నే తీసుకుంటే దాదాపు 30 శాతం వినియోగదారులు భారత్‌ నుంచే ఉన్నారు. పదిశాతం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. ఈ ఆదాయమంతా టిక్‌టాక్‌ కోల్పోక తప్పదు. అది అంతిమంగా చైనా ఆర్థిక వ్యవస్థకు ఎంతోకొంత నష్టం కలిగిస్తుంది. భారత్‌ అనుసరించిన ఈ మార్గాన్ని మరికొన్ని దేశాలు కూడా అనుసరించే అవకాశం ఉంది. దీంతో చైనాకు మరింత నష్టం కలగక తప్పదు.

నిషేధం ఎలా అమలవుతుంది?

ఈ యాప్‌లను యాక్సెస్‌ చేసే అవకాశాన్ని నిలిపేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశిస్తూ సూచనలు వెలువడతాయి. ఇంటర్నెట్‌ అవసరం లేని క్యామ్‌స్కానర్‌ లాంటి యాప్‌లు ఇప్పటికే డౌన్‌లోడ్‌ అయి ఉంటే పని చేసే అవకాశం ఉంది. అయితే కొత్తగా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే డౌన్‌లోడ్‌ అయి ఉన్నా.. ఇంటర్నెట్‌ అవసరమయ్యే టిక్‌టాక్‌, యూసీ న్యూస్‌ వంటి యాప్‌లు పని చేయవు.

ఒక్కరోజు బ్యాన్​తో నష్టమెంత...?

అశ్లీల వీడియో కంటెంట్​ను ప్రోత్సహిస్తోందని గతేడాది ఏప్రిల్​లో టిక్​టాక్​పై నిషేధం విధించింది మద్రాస్​ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్​. అయితే అటువంటి కంటెంట్​ను అడ్డుకునేలా చర్యలు తీసుకుంటామని పేరెంట్​ సంస్థ బైట్​డాన్స్​ పేర్కొనడం వల్ల దానిపై బ్యాన్​ ఎత్తివేసింది మద్రాస్​ హైకోర్టు. ఆ అఫిడవిట్​లో రోజుకు రూ.3.5 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల యూజర్లతో టిక్​టాక్​ ఉండగా.. భారత్​లోనే సుమారు 46 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పటికే యూఎస్, యూకే, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో ఈ యాప్​పై పూర్తిగా నిషేధం ఉంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.