ETV Bharat / business

టర్మ్ పాలసీల ప్రీమియం పెరిగే అవకాశాలు.. ఎంత శాతమంటే?

author img

By

Published : Nov 20, 2021, 5:42 AM IST

కొవిడ్-19 వల్ల చాలామంది టర్మ్‌ పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. టర్మ్ పాలసీల ప్రీమియం పెరిగే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 40 శాతం వరకు బీమా సంస్థలు పెంచనున్నట్లు సమాచారం.

TERM POLICY
టర్మ్ బీమా ప్రీమియం

కొవిడ్‌-19 రెండో దశ మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు. ఎన్నో కుటుంబాలు ఆర్జించే కుటుంబ పెద్దను కోల్పోవడమే కాక ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. ఈ నేపథ్యంలో చాలామంది కుటుంబానికి ఆర్థిక ధీమా కల్పించే లక్ష్యంతో టర్మ్‌ పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ బీమా పాలసీల ప్రీమియాన్ని 15-25 శాతం పెంచిన బీమా సంస్థలు, మరోసారి 25-40శాతం పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి.

గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో వచ్చిన బీమా క్లెయింలకన్నా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో క్లెయింలు అధికంగా వచ్చాయి. నివేదికల ప్రకారం కొవిడ్‌ కారణంగా మరణించిన వారి కుటుంబీకులకు అక్టోబరు నెలాఖరు వరకు రూ.12,948 కోట్ల మేరకు బీమా పరిహారం చెల్లించారు.

ఫలితంగా భారతీయ బీమా సంస్థలకు రీ ఇన్సూరెన్స్‌ అందించే 'మునిచ్‌ రీ' తన ప్రీమియాన్ని ఒక్కసారిగా పెంచింది. రీఇన్సూరెన్స్‌ అండర్‌రైటింగ్‌ నిబంధనలు మరింత కఠినం అయ్యాయి. ఈ ప్రభావం దేశీయ బీమా సంస్థలపై పడటంతో, అవి ప్రీమియం పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా సంస్థలను బట్టి, ఈ భారం 15-40 శాతం వరకూ ఉంటుందని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. టర్మ్‌ పాలసీలనూ, ప్రీమియాలను మరోసారి సమీక్షించుకోవాల్సిందిగా బీమా సంస్థలకు రీ ఇన్యూరెన్స్‌ సంస్థలు సూచించాయి.

తప్పనిసరి పరిస్థితుల్లో..

రీ ఇన్సూరెన్స్‌ సంస్థ ప్రీమియం పెంపునకు సంబంధించిన సమాచారం ఇప్పటికే బీమా కంపెనీలకు అందించింది. దీంతో దేశీయ బీమా సంస్థలు టర్మ్‌ ప్రీమియం పెంపుపై ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొన్ని బీమా సంస్థలు ప్రీమియం పెంపు కోసం ఐఆర్‌డీఏఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పాలసీలకూ ఈ పెంపు వర్తింపచేయాలని బీమా సంస్థలు భావిస్తున్నాయి.

రీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం 40 శాతం పెరిగితే.. ఆ ప్రభావం పాలసీదారులపై 30 శాతంపైగానే ఉంటుందని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీదారుడి వయసు, ఆరోగ్యం, ఇతర అంశాల ఆధారంగా ఇది మరింత భారంగానూ మారొచ్చు.

నష్టాలు పెరగడంతో..

గత ఏడాది మార్చిలో బీమా సంస్థలు 20-25 శాతం వరకూ టర్మ్‌ ప్రీమియాన్ని పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా క్లెయింలు నాలుగైదు రెట్లు పెరిగి, నష్టాలు ఏర్పడటమే ఇందుకు కారణమంటున్నాయి. దీని ఫలితం పాలసీదారులపై భారం తప్పదని సంస్థలు అంటున్నాయి.

చిన్న కంపెనీలకు ఇబ్బందే.

పెద్ద బీమా సంస్థలు రీ ఇన్సూరెన్స్‌ సంస్థతో బేరాలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. క్లెయింలు పెరిగినా వాటికి అంతగా నష్టాలు రాలేదు. చిన్న సంస్థలకు అంత శక్తి ఉండదనే చెప్పొచ్చు. వీటి నుంచి పాలసీలు తీసుకోవాలనుకునే వారికి ప్రీమియం భారం తప్పకపోవచ్చు. ఇది ఆయా సంస్థల వృద్ధికీ సవాలుగానే మారుతుంది. ఇప్పుడిప్పుడే టర్మ్‌ పాలసీలకు గిరాకీ పెరుగుతోంది. ఇప్పుడు ప్రీమియం మరింత పెరిగితే.. కొత్తగా పాలసీలు తీసుకునే వారు వీటికి దూరమయ్యే ఆస్కారం లేకపోలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.