Tariff Hike: ఛార్జీల పెంపుతో టెల్కోలకు ఎంత లాభం?

author img

By

Published : Dec 5, 2021, 5:19 AM IST

tariff hike
ఛార్జీల పెంపు ()

Tariff Hike: టెలికాం సంస్థలు ఇటీవల ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఛార్జీలను పెంచాయి. అయితే ఈ ఛార్జీల పెంపు వల్ల జియో, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థలు ఏటా సుమారు రూ.7500 కోట్ల చొప్పున నగదు ప్రవాహాన్ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tariff Hike: టెలికాం కంపెనీలు ఇటీవల ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఛార్జీలను పెంచాయి. ఈ ధరల పెంపుతో అవి ఏ మేరకు ప్రయోజనం పొందనున్నాయి? నగదు ఇబ్బందుల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియా ఎంత మేరకు గట్టెక్కుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా గోల్డ్‌మాన్‌ శాక్స్‌, జెఫరీస్‌, క్రెడిట్‌ సూయిజ్‌ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు తమ అంచనాలను పంచుకున్నాయి.

తాజా ధరల పెంపుతో ఎయిర్‌టెల్‌, జియోల సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) వరుసగా రూ.25; రూ.20 మేర పెరుగుతుందని అంచనా. ఇవి రూ.153; రూ.144 స్థాయిల నుంచి 2022 కల్లా ఈ మేర ప్రయోజనం పొందుతాయి. వొడాఫోన్‌ ఐడియా మాత్రం కేవలం రూ.5 పెంచుకుని తన ఆర్పును రూ.114కు చేర్చుకోవచ్చు. దీంతో తన డేటా నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి; ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్లను 4జీలోకి మార్చుకోవడానికి ఈ నగదు ఉపయోగపడకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే మూలధనాన్ని పెంచుకునే సామర్థ్యం మెరుగవుతుందని భావిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో స్పెక్ట్రమ్‌యేతర రుణ బకాయిలను తీర్చడానికి 6 నెలల్లో 700-800 మిలియన్‌ డాలర్లను ఈ కంపెనీ సమీకరించాల్సి ఉంటుందని అంచనా.

ఏటా రూ.7500 కోట్లు

వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ల వినియోగదార్ల వృద్ధిలో ఎక్కువ మార్పు ఉండకపోవచ్చు. జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు తాజా చార్జీల పెంపు వల్ల ఏటా 1 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.7500 కోట్లు) చొప్పున నగదు ప్రవాహాన్ని పొందే అవకాశం ఉంది. దీని వల్ల భారతీ, జియోల నిర్వహణ ఆదాయంలో 2021-24 మధ్య 38%, 32% మేర సమ్మిళిత వృద్ధి నమోదు కావొచ్చు. 2023-24 కల్లా జియో ఆర్పు రూ.172కు చేరొచ్చని మరికొంత మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జియోఫోన్‌తో బలోపేతం..

జియోఫోన్‌ టారిఫ్‌లు పెద్దగా మారకపోవడం వల్ల జియో వినియోగదార్ల సంఖ్య మరింత బలోపేతం కావొచ్చు. అయితే ఫీచర్‌ ఫోన్‌ నుంచి జియోఫోన్‌కు మారే వినియోగదార్లు రుణ మార్గాన్ని ఎంచుకునే పక్షంలో 24 నెలల సమయంలో 2.6-4.4 రెట్ల మేర ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తోంది. ఇది వారికి ఇబ్బందిగా మారొచ్చు. రాబోయే నెలల్లో ఫోన్‌ ధర తగ్గిస్తే మినహా 10.5 కోట్ల మంది చౌక స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లకే జియోఫోన్‌ మార్కెట్‌ పరిమితం కావొచ్చని అంచనా. జియోఫోన్‌ను తగ్గించడం సహా కొత్త రుణ వాయిదా పథకాలను కంపెనీ ప్రకటిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: Jio Recharge Cashback Offers: ఆ రీఛార్జ్​లపై 20% జియో క్యాష్​బ్యాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.