పన్ను చెల్లింపుదారుల కోసం ఓ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ ఇవాళ ప్రకటించింది. డిసెంబర్ 18న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 38వ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులు, వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులు, జీఎస్టీ స్టేక్ హోల్డర్స్లతో... జోనల్, రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ (జీఆర్సీ)ని కౌన్సిల్ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ కాలపరిమితి రెండేళ్లు. ఇందులోని సభ్యుల పదవి కాలమూ రెండేళ్లే. ఈ కమిటీ ప్రతి త్రైమాసికంలో ఓ సారి కచ్చితంగా లేదా అవసరమనుకుంటే... అంతకన్నా ఎక్కువసార్లు సమావేశమవుతుంది.
సభ్యుల భర్తీ..
ప్యానెల్ ఎవరైనా సభ్యుడు సహేతుక కారణం లేకుండా వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే.. ఆ స్థానంలో మరో కొత్త సభ్యుడ్ని నియమించవచ్చు. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్/ సెంట్రల్ టాక్స్ చీఫ్ కమిషనర్/ రాష్ట్ర కమిషనర్/ రాష్ట్ర పన్ను కమిషనర్లతో సంప్రదించి ఈ కొత్త సభ్యుడిని నియమిస్తారు.
పరిష్కారమిలా..
పన్ను చెల్లింపుదారులకు ఎదురయ్యే విధాన పరమైన ఇబ్బందులు, జీఎస్టీ, ఐటీ సంబంధిత సమస్యలకు సంబంధించిన నిర్ధిష్ట, సాధారణ ఫిర్యాదులను ఈ యంత్రాంగం పరిష్కరిస్తుంది. సమస్యల పరిష్కారం సకాలంలో జరిగేలా చూడడం కమిటీ బాధ్యతే. అందుకే జవాబుదారీతనం కోసం జీఎస్టీఎన్ ఓ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఫిర్యాదులు, వాటి పరిష్కారాలకు సంధించిన స్కాన్ కాపీలు కూడా అందుబాటులో ఉంచుతుంది. వీటిని స్టేక్హోల్డర్లు అందరూ వీక్షించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: ఆస్తుల ధ్వంసం మీ హక్కా?: 'పౌర' నిరసనకారులకు మోదీ ప్రశ్న