ETV Bharat / business

'తీర్పు వచ్చినా.. నీరవ్​ రావడం కొంచెం కష్టం'

author img

By

Published : Feb 26, 2021, 5:13 AM IST

నీరవ్​ మోదీని విచారణ నిమిత్తం భారత్​కు అప్పగించాలని లండన్​ కోర్టు ఇచ్చిన తీర్పు సానుకూల పరిణామమని సీబీఐ మాజీ డైరెక్టర్​ ఏపీ సింగ్​ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వచ్చేందుకు చాలా సమయమే పడుతుందని తెలిపారు. ఆయన 'ఈటీవీ భారత్'తో మాట్లాడుతూ నీరవ్​.. బ్రిటన్​లో హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు.

Govt
'తీర్పు వచ్చినా.. నీరవ్​ రావడం కొంచెం కష్టం'

బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో వజ్రాల వ్యాపారి, 49 ఏళ్ల నీరవ్​ దీపక్​ మోదీ(ఎన్​డీఎం)కి లండన్​ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్​కు పంపిచకూడదంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని గురువారం నైరుతి లండన్​లోని వెస్ట్​ మినిస్టర్​ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.

"పంజాబ్​ నేషనల్ బ్యాంకును మోసగించడానికి కుట్ర పన్నారన్న వ్యవహారంలో ఎన్​డీఎంకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నట్లు నమ్ముతున్నాం. ఆయన భారత్​కు వెళ్లి అక్కడి కోర్టులకు సమాధానం చెప్పాల్సి ఉంది."

- జడ్జి శామ్యూల్​ గూజీ, వెస్ట్​ మినిస్టర్​ మేజిస్ట్రేట్ కోర్టు

మోసం, నగదు అక్రమ చలామణీ జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని జడ్జి తెలిపారు. జైలులో ఉండటం వల్ల ఆయన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ, భారత్​కు పంపించడానికి ఇది అడ్డంకి కాబోదని పేర్కొన్నారు. ఆయనను ముంబయి అక్బర్​ రోడ్​లోని సెంట్రల్ జైలులో ఉన్న 12వ నెంబర్ బ్యారెజ్​కు పంపిస్తే ఆరోగ్యం కుదుటపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందులో రాజకీయ జోక్యం ఉందంటూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కేండేయ కట్జూ చేసిన వ్యాఖ్యాలను తిరస్కరించారు. ఈ తీర్పు కాపీని హోం మంత్రి ప్రీతి పటేల్​కు పంపించనున్నారు.

'భారత్​- బ్రిటన్ అపరాధుల అప్పగింత' ఒప్పందం ప్రకారం రెండు నెలల్లో మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.

బ్రిటన్​తో సంప్రదింపులు జరుపుతాం..

నీరవ్​ను రప్పించే వ్యవహారంపై బ్రిటన్​తో సంప్రదింపులు జరుపుతామని దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ తెలిపారు. ఇది మిగిలిన ఎగవేతదారులకు హెచ్చరికలాంటిదని సీబీఐ పేర్కొంది.

చాలా సమయం పడుతుంది..

లండన్​ కోర్టు తీర్పు సానుకూల పరిణామమని సీబీఐ మాజీ డైరెక్టర్​ ఏపీ సింగ్​ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వచ్చేందుకు చాలా సమయమే పడుతుందని తెలిపారు. ఆయన 'ఈటీవీ భారత్'తో మాట్లాడుతూ నీరవ్​.. బ్రిటన్​లో హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. మద్యం వ్యాపారి​ విజయ్​ మాల్యాను కూడా భారత్​కు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించినా వివిధ నిబంధనల కారణంగా ఇంతవరకు సాధ్యం కాలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.