ETV Bharat / business

గుడ్లు, చికెన్‌తో కరోనా వ్యాపించదు..అవన్నీ అపోహాలే!

author img

By

Published : Mar 22, 2020, 7:26 AM IST

కరోనా కారణంగా కోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. కోడి మాంసం, గుడ్ల ద్వారా కరోనా వ్యాప్తిచెందుతుందని వదంతులతో ఈ సంక్షోభం తలెత్తింది. ఫలితంగా ఎంతో మంది పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. అయితే కోడి మాంసం, గుడ్ల ద్వారా కరోనా సోకదని.. అవన్నీ అపోహలేనని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి ప్రభుత్వాలే పరిశ్రమను కాపాడాలని అంటున్నారు.

Coronavirus does not spread through chicken
కోడి మాంసంతో కరోనా రాదు

కోడి మాంసం, గుడ్లు తింటే కరోనా వైరస్‌ వ్యాధి సోకుతుందనే వదంతులు కోళ్ల పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టివేశాయి. ప్రజలు కోడి మాంసం, గుడ్లు ముట్టుకోవటానికి వెనకాడటం వల్ల అమ్మకాలు అధఃపాతాళానికి పడిపోయి, పౌల్ట్రీ రైతులు కనీవినీ ఎరుగని నష్టాల పాలవుతున్నారు. కోళ్లను, గుడ్లను అమ్ముకోలేక ఉచితంగా పంపిణీ చేస్తున్న వైనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. కొన్ని ప్రదేశాల్లో అయితే గోతులు తీసి పాతిపెడుతున్న ఉదంతాలు కూడా ఉంటున్నాయి. ఓ పక్క చైనాతో పాటు, యూఎస్‌, ఐరోపా దేశాల్లో కోడి మాంసం, గుడ్డు వినియోగం పెరుగుతుండగా, మనదేశంలో మాత్రం దీనికి భిన్నంగా వీటిని తినటానికి ప్రజలు వెనుకంజ వేస్తున్నారని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. 'కరోనా వైరస్‌ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది, అంతేగానీ కోడి మాంసం- గుడ్డు తింటే రాదు, కానీ ఈ విషయంలో జరిగిన అసత్య ప్రచారం ప్రజలపై ప్రభావం చూపుతోంది' అని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. వదంతులను ప్రజలు నమ్మవద్దని, కోడిమాంసం, గుడ్డు తినటం ద్వారా సమృద్ధిగా ‘ప్రొటీన్లు’ ఉన్న పోషకాహారాన్ని తీసుకున్నట్లు అవుతుందని గుర్తించాలని సూచిస్తున్నాయి.

రికార్డు స్థాయిలో తగ్గిన ధరలు..

రెండు నెలల క్రితం వరకూ కిలో కోడి మాంసం (స్కిన్‌లెస్‌) రిటైల్‌ ధర రూ.180 వరకూ ఉండగా, ఇప్పుడు అది రూ.80- 90కి పడిపోయింది. అదేవిధంగా గుడ్డు ధర రూ.4.25 నుంచి రూ.2 కు పడిపోయింది. కిలో కోడి ఫారం గేట్‌ ధర రూ.85 నుంచి రూ.33కు తగ్గిపోయింది. కిలో కోడి పెంపకం ఖర్చే రూ.80 వరకూ ఉంటుంది. గుడ్డు ఉత్పత్తికి రూ.3.50 ఖర్చవుతుంది. దీనికి తోడు వినియోగం మూడొంతులు క్షీణించింది. తత్ఫలితంగా పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు భారీగా నష్టాలు కూడబెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు రెండు నెలల నుంచి ఈ పరిస్థితి ఉంది. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోంది. ఉన్న కోళ్లు అమ్ముడు కాని పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు కొత్తగా కోడి పిల్లలు తెచ్చి పెంచటం కూడా నిలిచిపోతోంది. పౌల్ట్రీ పరిశ్రమ నుంచి డిమాండ్‌ క్షీణించటం కారణంగా కోళ్ల దాణాలో వినియోగించే మొక్కజొన్న, సోయా ధరలు కూడా పతనం అవుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ మొక్కజొన్న ఒక టన్నుకు రూ.20,000 ధర పలకగా ఇప్పుడు అది రూ.12,000 కు పడిపోయింది. అదేవిధంగా సోయా ధర రూ.45,000 నుంచి రూ.32,000 కు క్షీణించింది. దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. వీరందరి ఉపాధికి ముప్పు కనిపిస్తోంది.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో గత కొద్ది రోజులుగా కోడి మాంసం, గుడ్డు వినియోగం భారీగా పెరిగాయి. అదే క్రమంలో ధరలు కూడా పెరుగుతున్నాయి. చైనాలో కోడి మాంసం ధర రెట్టింపు అయినట్లు, బ్రెజిల్‌, సింగపూర్‌ దేశాల్లోనూ ధరలు పెరుగుతున్నట్లు స్థానిక పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ మనదేశంలో దీనికి భిన్నంగా వినియోగం, ధరలు పతనం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి పరిశ్రమను ఆదుకోవాలని సంబంధిత వర్గాలు కోరుతున్నాయి. అదే సమయంలో ప్రజలు కూడా భయం వీడి కోడి మాంసం, గుడ్డు తినటానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

ప్రజలు భయపడాల్సిన పనిలేదు

కోడి మాంసం, గుడ్లు తినటానికి ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. కోడి మాంసం, గుడ్లు తినటం వల్ల కరోనా వైరస్‌ వ్యాధి వచ్చే అవకాశమే లేదు. నేను ఏడేళ్లు వెటర్నరీ డాక్టర్‌గా పనిచేశా. 54 ఏళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమలో ఉన్నా. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవంతో చెబుతున్నా... కోడి మాంసం, గుడ్లు తినటం వల్ల కరోనా వైరస్‌ వ్యాధి వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ప్రజలు దీన్ని విశ్వసించవద్దు. తల్లి పాల తర్వాత అత్యంత అధికంగా పోషక పదార్ధాలు ఉండేది గుడ్డులోనే. కోడి మాంసం, గుడ్డు ద్వారా తప్పిస్తే... ప్రజలకు చౌకగా ‘ప్రొటీన్లు’ లభించే మార్గం మరొకటి లేదు. రష్యా, చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో ఎటువంటి ఆందోళన లేకుండా ఆయా దేశాల ప్రజలు కోడి మాంసం, గుడ్డు తింటున్నారు. అందువల్ల మనం భయపడాల్సిన పనిలేదు. వినియోగం తగ్గిపోయిన ఫలితంగా పౌల్ట్రీ పరిశ్రమ ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుపోయింది. రైతుల నుంచి పౌల్ట్రీ వ్యాపారులు, పంపిణీదార్లు, రిటైల్‌ వర్తకుల వరకూ లక్షలాది మంది ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమకు ఇంత నష్టం గతంలో ఎన్నడూ ఎదురు కాలేదు. అంతేగాక కోళ్ల దాణాలో అధికంగా వినియోగించే మొక్కజొన్న, సోయా, వేరుశనగ చెక్క ధరలు కూడా క్షీణించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

- డాక్టర్‌ సుందర నాయుడు, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు

sundara naidu
డాక్టర్‌ సుందర నాయుడు, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు

ఇది కష్టకాలం.. ప్రభుత్వాలు ఆదుకోవాలి..

కరోనా వైరస్‌ భయంతో కోడి మాంసం, గుడ్డు వినియోగం క్షీణించి పౌల్ట్రీ పరిశ్రమ కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలి. పౌల్ట్రీ యూనిట్లకు ఉన్న రుణాలను పునర్‌వ్యవస్థీకరించి, రుణ వాయిదాల వసూలుపై ‘మారటోరియం’ అమలు చేయాలి. నిర్వహణ నిధులు (వర్కింగ్‌ కేపిటల్‌) కూడా సమకూర్చాలి. గతంలో ‘బర్డ్‌ఫ్లూ’ వచ్చినప్పుడు ప్రభుత్వాలు అండగా నిలిచాయి. అప్పుడు పరిశ్రమ పరిమాణం రూ.20వేల కోట్లు, కానీ ఇప్పుడు పరిశ్రమ రూ.1.20 లక్షల కోట్లకు చేరింది, దీనిపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం అండగా నిలవాలి. ప్రభుత్వాన్ని ఉచితంగా ఇవ్వాలని ఏం అడగడం లేదు. ప్రస్తుత కష్టకాలంలో చేయూత నివ్వాలని మాత్రమే కోరుతున్నాము. కేవలం భయంతోనే ప్రజలు కోడి మాంసం, గుడ్లు తినటం లేదు. ప్రజల్లో అనవసరంగా అనుమానాలు రేకెత్తించారు. కోడి మాసం, గుడ్డు తింటే కరోనా వైరస్‌ వ్యాధి రాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు, ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) కూడా ఇదే చెప్పింది. పౌల్ట్రీ పరిశ్రమ కుంగిపోతే మళ్లీ కోడి మాంసం, గుడ్డు వినియోగం పెరిగినప్పుడు తగినంతగా సరఫరాలు ఉండక ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అటువంటి పరిస్థితి కూడా మంచిది కాదు.

- సురేశ్‌ రాయుడు చిట్టూరి, అంతర్జాతీయ గుడ్ల కమిషన్‌ ఛైర్మన్‌

suresh raidu
సురేశ్‌ రాయుడు చిట్టూరి, అంతర్జాతీయ గుడ్ల కమిషన్‌ ఛైర్మన్‌

ఇదీ చూడండి:యువత మేలుకో.. పొదుపు మార్గం ఎంచుకో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.