ETV Bharat / business

కార్ల కంపెనీలకు చిప్​ల కొరత- పండగ సీజన్ గడిచేదెలా?

author img

By

Published : Sep 5, 2021, 6:49 AM IST

దసరా, దీపావళి పండగలకు కార్ల అమ్మకాలు జోరందుకుంటాయి. అయితే.. కార్ల తయారీ కంపెనీలు మాత్రం వీలైనన్ని కార్లను సరఫరా చేస్తాయా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. దీనికి కారణం కార్ల చిప్‌ల కొరత. దీనితో ఉత్పత్తి-అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్‌ సొంతంగా చిప్‌లు అభివృద్ధి చేస్తోంది.

auto industry
auto industry

రాబోయేది పండగల సీజన్‌. అమ్మకాలు పెరుగుతాయనే భావనతో వ్యాపార సంస్థలు ఎంతో సంతోషంగా ఉంటాయి. కానీ ఈసారి దేశీయ వాహన కంపెనీలకు అటువంటి సంతోషమే లేదు. కార్లకు గిరాకీ అధికంగా ఉన్నా, సరఫరా చేయలేకపోవడమే ఇందుకు కారణం. దీనికి ప్రధాన కారణం చిప్‌ల కొరతే. నాలుగైదు నెలలుగా వేధిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం లభించకపోగా, రోజురోజుకూ పెద్దదవుతోంది. ఫలితంగా దేశీయ వాహన కంపెనీలు ఉత్పత్తి తగ్గించాల్సి వస్తోంది. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఉత్పత్తిలో కోత పెడుతున్నట్లు వెల్లడించాయి. అందువల్ల ఈ నెలలో కార్ల ఉత్పత్తి బాగా తగ్గిపోనుంది.

ఆగస్టు అమ్మకాలపై ప్రభావం..

  • ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత వల్ల ఆగస్టులో వాహన అమ్మకాలపై ప్రభావం పడిందని, పరిష్కారం కనుగొనే యత్నాల్లో ఉన్నట్లు మారుతీ సుజుకీ స్పష్టం చేసింది.
  • సెమీకండక్టర్ల సమస్య తీవ్రంగా ఉందని మహీంద్రా అండ్‌ మహీంద్రా పేర్కొంది. ఈ సంస్థ ఆగస్టు కార్ల అమ్మకాల్లో 17 శాతం వృద్ధి నమోదు చేసింది. థార్‌, ఎక్స్‌యూవీ 300, బొలేరో నియో మోడళ్లకు అధిక గిరాకీ కనిపించింది. చిప్‌ల కొరత వల్ల సెప్టెంబరులో ఆటోమోటివ్‌ డివిజన్‌ ప్లాంట్లలో 7 రోజుల పాటు ఉత్పత్తి నిలిపి వేస్తామని, కార్ల ఉత్పత్తి 25 శాతం తగ్గే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలోని జహీరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని చకన్‌, నాసిక్‌, కండివలి, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ ప్లాంట్లు ఉన్నాయి.
  • చిప్‌ సెట్లను ఓఈఎం వెండర్ల నుంచి కాకుండా బహిరంగ విపణిలో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని టాటా మోటార్స్‌ వర్గాలు వివరిస్తున్నాయి.
  • ఫోర్డ్‌, ఎంజీ మోటార్‌, రెనో, నిస్సాన్‌.. వంటి కార్ల కంపెనీలూ ఇప్పటికే తమ ఉత్పత్తి తగ్గించాయి.
  • సెమీకండక్టర్ల ఉత్పత్తి అధికంగా ఉన్న తూర్పు ఆసియా దేశాల్లో కొవిడ్‌ ప్రభావంతో లాక్‌డౌన్లు విధించడం వల్ల, చిప్‌లకు కొరత ఇంకా అధికమైనట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది చివరికి లేదా 2022 ప్రారంభంలో ఈ సమస్య కొంతమేరకు పరిష్కారం కాగలదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ముందస్తు బుకింగ్‌లు..

ఒక పక్క కంపెనీలు కార్ల ఉత్పత్తిని తగ్గిస్తుంటే, ఆయా కంపెనీల డీలర్లు మాత్రం పండగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్దఎత్తున ఆర్డర్లు పెడుతున్నట్లు తెలిసింది. సాధారణంగా వినియోగదార్లు దసరా, దీపావళి పండగల సమయంలో కొత్త కార్లు డెలివరీ తీసుకోడానికి ఇష్టపడతారు. అధికంగా అమ్మకాలు నమోదయ్యేది కూడా ఈ సీజన్లోనే. అందువల్ల ముందుగానే ఆర్డర్లు పెడుతున్నామని స్థానిక ఆటోమొబైల్‌ డీలర్‌ ఒకరు వివరించారు. కంపెనీలు ఏమేరకు కార్లు సరఫరా చేయగలుగుతాయనే విషయం స్పష్టం కావడం లేదన్నారు. కొన్ని మోడళ్లకు ప్రస్తుతం మూడు నుంచి ఆరు నెలల 'వెయిటింగ్‌' ఉంటోంది. పండగల సీజన్‌ డిమాండ్‌ వల్ల 'వెయిటింగ్‌' ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

సొంతంగా చిప్‌ల అభివృద్ధి..

చిప్‌ల కొరతతో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోందనో లేక తన కార్లలోని ప్రత్యేకతలకు అనువైన చిప్‌లు అవసరమని భావించిందో కానీ.. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ సొంతంగా చిప్‌లు అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆవిష్కరించనున్న సరికొత్త మోడల్‌ కారు- 'లోనిక్‌ 6' లో ఈ చిప్‌లు వినియోగించనున్నట్లు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా అగ్రశ్రేణి-10 వాహన కంపెనీల్లో ఒకటైన ఈ సంస్థ, సిలికాన్‌ కార్బైడ్‌ టెక్నాలజీ ఆధారిత 'పవర్‌ చిప్‌'ను అభివృద్ధి చేస్తోంది. హ్యుందాయ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, దానికి అనుబంధంగా ఉన్న హ్యుందాయ్‌ మొబిస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఈ 'పవర్‌ చిప్‌' డిజైన్‌లో పాలుపంచుకుంటున్నాయి. చిప్‌లు ఉత్పత్తి చేసే సంస్థ అయిన మాగ్నచిప్‌ సెమీకండక్టర్‌ కార్పొరేషన్‌ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయింది. భవిష్యత్తులో చిప్‌ల కోసం హ్యుందాయ్‌ వివిధ దేశాలకు చెందిన తయారీదార్లపై ఆధారపడటం తగ్గుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.