ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బుధవారం రోజు కాస్త సద్దుమణిగాయి. మళ్లీ బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురుశాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వంతెనపై నుంచి మోయతుమ్మెద వాగు ప్రవాహం తగ్గగా… వాహనాల రాకపోకలు కొద్దిగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల క్రితం కొట్టుకెళ్ళినా లారీ వాగులో కనిపించింది. లారీ డ్రైవర్ ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు.
తిరిగి బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలకు మళ్లీ బస్వాపూర్ వంతెనపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల… సిద్దిపేట హన్మకొండకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఓ వైపు హుస్నాబాద్ పట్టణంలో రోజుకు పది నుంచి పదిహేను కరోనా కేసులు నమోదవుతుంటే… మరో వైపు హుస్నాబాద్ కొత్తచెరువు మత్తడి వద్ద జాలర్లు ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా గుంపులు గుంపులుగా చేపలు పడుతున్నారు.
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి పోస్తుండడంతో హుస్నాబాద్ గౌరవెల్లి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అటువైపుగా వెళ్లేవారు భయం భయంతో ఒకరి ఒకరు చేతులు పట్టుకొని మత్తడిని దాటుతున్నారు. భారీ వర్షాలకు హుస్నాబాద్ లోని రహదారులన్నీ దెబ్బతిన్నాయి. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ లో వర్షం దాటికి రెండు ఇళ్లు కూలిపోయాయి. గ్రామ శివారులో ఉన్న 20 ఎకరాల పంట పొలాల్లోకి వరద నీరు చేరుకొని ఇసుక మేట వేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.