ఎటు చూసినా చక్కని పల్లెటూరి వాతావరణం... భారీ ఎత్తులో కొలువుదీరిన కొండపల్లి బొమ్మలు... ప్రాంగణమంతా ఆహ్లాదభరిత వాతావరణంతో కళకళలాడుతోంది... నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన మినీ శిల్పారామం. కొండాపూర్లో భారీ శిల్పారామానికి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా... హెచ్ఎండీఏతో కలిసి ప్రభుత్వం ఉప్పల్లో మినీ శిల్పారామాన్ని సిద్ధంచేస్తోంది. 7.5 ఎకరాల్లో విస్తరించిన మినీ శిల్పారామం పూర్తిగా పల్లెటూరి వాతావరణంతో ఆకట్టుకుంటోంది. ఇక తొలిదశ పనుల్లో భాగంగా మొత్తం ఇప్పుడు 50 స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశం ఉంది. ఇక ఎటుచూసినా... పరుచుకున్న చక్కని పచ్చదనం.... భారీ వేదిక... పెద్దఎత్తున ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్... చిన్నారుల ఆట స్థలం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తొలిదశ పనులు పూర్తి...
మినీ శిల్పారామం ఏర్పాటు కోసం తొలిదశలో భాగంగా సుమారు రూ.5 కోట్లతో ఇప్పటి వరకు వివిధ రకాల పనులు పూర్తి చేశారు. త్వరలో మరో 5కోట్ల వ్యయంతో మలి దశ పనులు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఫంక్షన్హాల్.... గ్రామ, క్రాఫ్ట్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. తొలిదశ పనులు పూర్తయినందున ఈ నెల 22 సాయంత్రం 5 గంటలకు మినీ శిల్పారామాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు...
అందం, ఆనందం, హస్త కళాకృతుల కొనుగోలుకు చక్కని ప్రాంతంగా నిలుస్తున్న శిల్పారామం ఇకపై ఉప్పల్ పరిసర ప్రాంత వాసులకు అందుబాటులోకి రానుంది. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 8గంటల వరకు... వారాంతాలు, సెలవు దినాల్లో ఉదయం 11గంటల నుంచి రాత్రి 8.30 వరకు తెరిచి ఉండనుంది. శని, ఆదివారాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి.
ఇవీ చూడండి: వైభవంగా... కాళేశ్వర గంగ ఉప్పొంగంగా...!