ETV Bharat / briefs

'మీరు వ్యవసాయం చేస్తే... నాలా చావాల్సిందే...'

author img

By

Published : Jun 11, 2020, 8:49 PM IST

Updated : Jun 13, 2020, 10:11 AM IST

"ఏదో ఒక పని చేసుకుని బతకండి.. పొలాన్ని మాత్రం.. నమ్ముకోకండి.. దాన్ని నమ్ముకుంటే నాకు పట్టిన గతే మీకూ పడుతుంది. బయటకు పోయి.. దొరికిన పని చేసుకుని కడుపు నింపుకోండి. వ్యవసాయం వైపు అస్సలు వెళ్లొద్దు." ఇవన్నీ.. ఓ అన్నదాత.. తన చివరి క్షణాల్లో తన కొడుకులకు చెప్పిన మాటలు. పొలాన్ని నమ్మి అప్పుల పాలు అవ్వొద్దు అంటూ.. హితబోధ చేసిన ఆయన మాటలు.. గుండెలకు గుచ్చుకునేలా ఉన్నాయి.

'మీరు వ్యవసాయం చేస్తే... నాలా చావాల్సిందే...'
'మీరు వ్యవసాయం చేస్తే... నాలా చావాల్సిందే...'

'మీరు వ్యవసాయం చేస్తే... నాలా చావాల్సిందే...'

ఒకప్పుడు వ్యవసాయం చేస్తే.. పండగే.. మరి.. ఇప్పుడో? చావే పరిస్థితి. మట్టి వాసనకు మురిసిపోయే జీవితాలు.. బలవంతపు చావుతో అదే మట్టిలో కలిసిపోతున్నాయి. పంటపొలాల్లో వచ్చే.. స్వచ్ఛమైన గాలిలోనే.. అన్నదాతల ఉసురు కలిసిపోతోంది. ఒకప్పడు నా ప్రాణం పోయేంతవరకూ వ్యవసాయం చేసుకుని బ్రతుకుతానన్న రైతు.. వ్యవసాయం చేస్తే.. ప్రాణం పోతుంది అనే స్థితికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్దినాయునిపల్లికి చెందిన శింగనరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనే రైతు ఊపిరి.. గాలిలో కలిసిపోయింది. కానీ ఆయన రాసిన లేఖ.. అన్నంపెట్టే రైతన్నల జీవితం ఇలా ఉంటుందా.. అని కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తోంది.

'అయ్యా శింగారెడ్డి సత్యనారాయణరెడ్డి అను నేను. వ్యవసాయం చేయడానికి చాలామంది దగ్గర అప్పులు తీసుకున్నాను. నాకు 9 ఎకరాలు పొలము ఉన్నది. నేను ఈ అప్పులు మెుత్తం పొలము పెట్టుబడులకు తెచ్చుకున్నవి. కానీ పాడు సంవత్సరం నాకు పొలము మీద ఒక్క రూపాయి గూడా రాలేదు. కనీసం నేను పెట్టిన పెట్టుబడులు గూడా రాలేదు. నేను పొలములో 16 బోర్లు వేయించినా.. కానీ ఒక్క దాంట్లో కూడా నీళ్లు పడలేదు. వర్షాలు లేవు. ఈ విధముగా చేసిన అప్పులే అవి. నేను తిరుగుబోతును కాదు.. తిండి పోతును కాదు... తాగుబోతును కాదు. నేను ఎవరికీ ఏ అన్యాయం చేసిన వాడిని కాను. కానీ నాకు ఆ దేవుడు ఎందుకో ఈ శిక్షవేసినాడు. నా బార్య, నా తల్లి కష్ట జీవులు వారికి కష్టం చేయడం తప్ప ఏమీ తెలియదు. వారికి నేను అన్యాయం చేస్తున్నందుకు బాధగా ఉన్నది. కానీ తప్పటం లేదు. నా కొడుకులకు చెప్పేది.. ఏమనగా ఈ అప్పులోళ్లకు ఏదో ఒకటి అమ్మి అప్పులు ఇయ్యండి. కానీ మీరు మాత్రం పొలం మీద ఆధార పడకుండా బయటకు పోయి ఏదో ఒక పని చూసుకోని బతకండి. పొలమును నమ్ముకుంటే నా పరిస్థితి మీకు తప్పదు. మా కుటుంబ సభ్యులకు అందరికీ అప్పులు ఉన్నవి అని తెలుసు కానీ ఎవరికీ ఎంత ఇయ్యాలో ఎంత అప్పు ఉన్నదో తెలియదు. ఈ అప్పు ఎలా ఇయ్యాలో అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ నాకు ఏ దారి అగుపడలేదు. కనుక ఈ దారినే ఎన్నుకున్నాను. ఇంకానేను కుటుంబ భారాన్ని మోయలేక, అప్పుల వారికి సమాధానం చెప్పలేక ఎంతో మనోవేదన అనుభవిస్తున్నాను. కనుక నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నేను పొలం అమ్మి అప్పులు తీర్చేవాడిని.. కానీ నేను ఇంతకుముందు 1995 సంవత్సరం 6 ఎకరాలు అమ్మినాను. మళ్లీ నేను అమ్మాలంటే నాకు ఇష్టపడటం లేదు. రెండు సార్లు పొలాన్ని అమ్మి జనంలోకి తిరగాలంటే నాకు ఇష్ట పడటం లేదు. నాకు కూడా బతకాలి, జనంలో తిరగాలి అని ఉన్నది. కానీ నాకు దేవుడు అదృష్టం ఇయ్యలేదు. నా కొడుకులకు కొండారెడ్డికి, సుబ్బారెడ్డికి చెప్పేది ఏమనగా మీరు మమ్మిని, అవ్వను బాగా చూసుకోండి. వాళ్లకు కష్టం చేయ్యటం తప్ప ఇంకేమీ తెలియదు. మీరు ఏదో ఒక పని చూచుకొని బతకండి. మిమ్మిల్ని అందరినీ ఇడిసిపెట్టి పొతున్నందుకు నాకు కూడా బాధగానే ఉన్నది.. కానీ తప్పటం లేదు.' నా సావుకి నేనే కారణం

ఇట్లు

శింగారెడ్డి సత్యనారాయణ రెడ్డి

ఇదీ చదవండి..

అప్పుల భారం... తీసింది ప్రాణం

Last Updated :Jun 13, 2020, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.