యువతిపై నలుగురితో లైంగికదాడి చేయించి.. ఘాతుకాన్ని వీడియో తీసింది..!

author img

By

Published : May 29, 2022, 4:08 PM IST

Updated : May 29, 2022, 10:32 PM IST

Four attempted rape on a young woman in gacchibowli

16:03 May 29

భర్తతో స్నేహంగా ఉంటోందని యువకులతో లైంగిక దాడి..

Rape Attempt On Civils Aspirant: ఒక చెట్టు వాడిపోకుండా ఉండాలంటే కావాల్సింది నీళ్లు.. అదే దంపతుల మధ్య విరిసిన ప్రేమ వాడిపోకుండా కలకాలం ఉండాలంటే.. కావాల్సింది నమ్మకం. అది గనకపోయి.. ఆ స్థానంలో అనుమానం అనే చీడ మొదలైందా.. సంసార వృక్షాన్ని మొత్తం నిర్వీర్యం చేసి నేలకూలుస్తుంది. అనుమానమే పెనుభూతమై.. ఎన్నో సంసారాలను కూల్చేసింది... నేరాలకు ఉసిగొల్పి మరెన్నో కుటుంబాలను రోడ్డునపడేసింది. అలా.. ఎన్నో దారుణాలు ఇంకెన్నో విషాదాలను ఒకేసారి మిగిల్చిన ఆ పెనుభూతం.. ఈసారి మరో ఘోరం చేయించింది. హైదరాబాద్​ గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘాతుకం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆనందంగా సాగిపోతున్న భార్యాభర్తల జీవితంలో.. అనుమానమనే భూకంపం వచ్చినప్పుడు.. ఒక్కోసారి తీరని నష్టం వాటిల్లొచ్చు.. కొన్నిసార్లు చిన్నచిన్న ప్రకంపనలతోనే ముగిసిపోవచ్చు. అయితే.. చిన్నగా మొదలైన అనుమానం.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం మనిషిని రాక్షసుడిగా మార్చుతుంది. ఆ సమయంలో తాను పడే క్షోభ.. క్రూరంగా మారి ఘోరాలు చేయిస్తుందనటానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.

కొండాపూర్ శ్రీరామ్​నగర్​లో గాయత్రి, శ్రీకాంత్ దంపతులు నివసిస్తున్నారు. శ్రీకాంత్.. సివిల్స్​కు ప్రిపేర్​ అవుతూ..​ లా-ఎక్సలెన్స్ ఇన్​స్టిట్యూట్​లో ఆన్​లైన్​ క్లాసులకు హాజరవుతున్నారు. అదే కాలనీలో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన 25 ఏళ్ల యువతి కూడా నివాసముంటూ.. సివిల్స్​కి ప్రిపేర్ అవుతోంది. ఆమె కూడా అదే ఇన్​స్టిట్యూట్​లో శిక్షణ తీసుకుంటోంది. ఒకే కాలనీలో ఉండటం.. శ్రీకాంత్​ కూడా సివిల్స్​కు ప్రిపేర్​ అవుతుండటం.. ఇద్దరు ఒకే ఇన్​స్టిట్యూట్​లో కోచింగ్​ తీసుకోవటం వల్ల.. సాధారణంగానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. గాయత్రికి కూడా సదరు యువతిని శ్రీకాంత్​ పరిచయం చేశాడు. గతేడాది అక్టోబర్​లో గాయత్రికి అనారోగ్యంగా ఉండటంతో యువతిని తన ఇంటికి పిలిచింది. ఇద్దరికి మధ్య పరిచయం పెరగడంతో.. వాళ్లింట్లోనే ఉండమని గాయత్రి కోరింది. అందుకు ఒప్పుకున్న యువతి.. ఫిబ్రవరి వరకూ గాయత్రి ఇంట్లోనే ఉండి సివిల్స్ ప్రిపేరైంది. ఇంత వరకు అంతా బాగానే నడించింది. అయితే.. అసలు కథ మాత్రం అప్పుడే మొదలైంది.

మొలకెత్తిన అనుమానం: భర్త శ్రీకాంత్‌, యువతి ప్రవర్తనపై గాయత్రి మనసులో అనుమానం మొలకెత్తింది. తన భర్త ఇంకో అమ్మాయితో చనువుగా ఉండటం చూసి గాయత్రి తట్టుకోలేకపోయింది. తనకే సొంతమనుకున్న భర్త.. మరో యువతికి ఆకర్షితుడవుతున్నాడన్న ఆలోచన తనను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. రోజురోజుకు పెరిగిపోతున్న అనుమానం.. మనసను క్షోభకు గురిచేసింది. ఈ సమస్యకు ఎలాగైన పరిష్కారం చెప్పాలనుకుంది. ప్రేమతో చెప్పి చూసినా.. బాధ్యతగా మందలించినా.. భయంతో బెదిరించినా.. భర్త ప్రేమ దూరమవుతుందనుకుందో ఏమో.. ఆ అమ్మాయి వైపు నుంచి నరుక్కురావాలని నిశ్చయించుకుంది. ఏప్రిల్ 22న యువతిపై గాయత్రి గచ్చిబౌలి పీఎస్​లో ఫిర్యాదు చేసింది. అక్కడితో ఆగకుండా.. క్రూరంగా ఆలోచించి ఓ ఘోరమైన పథకాన్ని పన్నింది.

యువతిపై దాడి: అనూహ్యంగా ఈ నెల 26న యువతితో పాటు కుటుంబసభ్యులను గాయత్రి తన ఇంటికి పిలిచింది. కేసు విత్​డ్రా చేసుకుంటానని చెప్పడంతో.. గాయత్రి మనసులో ఉన్న ప్లాన్​ తెలియక.. యువతితో సహా కుటుంబసభ్యులు నమ్మి ఇంటికి వెళ్లారు. చెప్పినట్లుగానే కేసు విత్​డ్రా చేసుకున్న గాయత్రి.. యువతి కుటుంబసభ్యులను ఇంటి బయటే ఉండాలని సూచించింది. యువతిని మాత్రం లోపలికి తీసుకెళ్లింది. ముందుగా వేసిన పథకం ప్రకారం.. తనకు పరిచయం ఉన్న ఐదుగురు యువకులను అప్పటికే ఇంట్లో ఉంచింది. అమ్మాయి లోపలికి రాగానే.. పృథ్వి, విష్ణువర్దన్​, మనోజ్​, మస్తాన్​, ముజాహిద్​, మౌలాలి కలిసి ఆమె చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకున్నారు. నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హింసించారు. అందులో ఓ యువకుడు బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రైవేట్ భాగాల్లో పదునైన ఆయుధాలతో గాయపరిచాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న గాయత్రి.. ఘాతుకం మొత్తాన్ని తన సెల్​ఫోన్​లో చిత్రీకరించింది. బాధితురాలు రోధించటంతో.. ఐదుగురు వ్యక్తులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియో మొత్తాన్ని సోషల్​మీడియాలో పెడతానని బాధితురాలిని గాయత్రి బెదిరించింది. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న బాధితురాలిని కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికిత్స పొందుతూనే బాధితురాలు జరిగిందంతా పోలీసులకు వివరించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. గాయత్రితో పాటు నలుగురు యువకులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

తల్లి సంచలన ఆరోపణలు..: ఇదిలా ఉంటే.. నిందితురాలి తల్లే వాళ్లపై పలు సంచలన ఆరోపణలు చేసింది. నెల్లూరుకు చెందిన రత్నాకర్ రాజు ఎయిర్ ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి. రిటైర్ అయిన తర్వాత భార్య కృష్ణవేణితో కలిసి 2002 నుంచి కొండపూర్​లో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమర్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహంకాగా.. వారూ హైదరాబాద్​లోనే ఉంటున్నారు. చిన్న కుమార్తె గాయత్రి ప్రేమ వివాహం చేసుకుంది. అతనితో విభేదాలు రావటంతో.. గాయత్రి 2014 నుంచి శ్రీకాంత్ అనే వ్యక్తితో ఉంటోంది. అతన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే అనారోగ్యం కారణంగా 2015లో గాయత్రి తండ్రి రత్నాకర్ రాజు చనిపోయారు. అప్పటి నుంచి తన ఆస్తి మీద శ్రీకాంత్ ప్రోద్బలంతో గాయత్రి కన్ను వేసిందని.. తనని తన కుమారుడిని ఇంటి నుంచి వెల్లగొట్టారని గాయత్రి తల్లి కృష్ణవేణి వాపోయింది. ఇల్లు తన పేరు మీద ఉంటే... శ్రీకాంత్​తో కలిసి గాయత్రి తనపై దౌర్జన్యానికి దిగిందని.. పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదని కృష్ణవేణి ఆరోపించారు. జరిగిన ఘటనకు శ్రీకాంతే మూల కారణమని చెబుతున్నారు. గాయత్రి ఎందుకు ఇలా చేస్తోందో తెలియడంలేదని.. ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా.. తన పెద్ద కుమార్తెపై వాళ్లిద్దరు దాడి చేశారని వివరించారు.

ఇవీ చూడండి:

Last Updated :May 29, 2022, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.