ETV Bharat / state

EC new rule: ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదు: సీఈసీ

author img

By

Published : Oct 21, 2021, 5:42 PM IST

Updated : Oct 21, 2021, 7:19 PM IST

cec-key-directives
cec-key-directives

17:39 October 21

ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదు: సీఈసీ

ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం పొరుగున ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉపఎన్నికతో నేరుగా సంబంధం ఉన్న ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని కేంద్రఎన్నికల సంఘం స్పష్టం చేసింది (CEC key directives on by-election code). ఈ మేరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది.

పొరుగున ఉన్న జిల్లాల్లో కూడా నిబంధనలు

 ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గాల సమీపంలో ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం (central election commission) పేర్కొంది. ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం, జిల్లాకు పొరుగున ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. అటు ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల విషయంలో ఎంసీసీ, కొవిడ్ నిబంధనలు వర్తిస్తాయని కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  

వాటికి ఆటంకం కలగకూడదనే...

కేవలం అభివృద్ధి, పాలనాపరమైన కార్యకలాపాలకు ఆటంకం కలగరాదన్న ఉద్దేశంతోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (election code of conduct) జిల్లా మొత్తం కాకుండా నియోజవర్గానికి మాత్రమే పరిమితం చేస్తూ గతంలో ఆదేశాలు జారీ చేసినట్లు ఈసీ వివరించింది. అయితే నియోజకవర్గం వెలుపల అదే జిల్లాలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగడం ఈ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడింది. ఎన్నికలతో సంబంధం ఉండే కార్యకలాపాలకు ఉపఎన్నిక జరిగే జిల్లాలో ఎంసీసీ, కొవిడ్ నిబంధనలు వర్తిస్తాయని... ఖర్చు పర్యవేక్షణ కూడా అమల్లో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించింది.  

మొదట్లో సీఈసీ ఏమి చెప్పిందంటే..

కరోనా మహమ్మారి బారిన పడకుండా కేంద్ర ఎన్నికల సంఘం (Huzurabad CEC Rules) సరికొత్త నియమాలను రూపొందించింది. పశ్చిమ బంగా, తమిళనాడు ఎన్నికల సందర్భంగా జరిగిన లోపాలను సవరిస్తూ కొత్త నిబంధనలు రూపొందించింది. వాటిని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (Huzurabad CEC Rules) అమలు చేయాలని సూచించింది. అయితే ఎన్నికల కమిషన్ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆంక్షలను తుంగలో తొక్కేందుకు వీలుగా సమావేశాలను నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది. భారీగా జనం గుమికూడదనే ఉద్దేశంతో కొత్త నియమాలను రూపొందించగా.. వాటిని అమలు చేసి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు ఆ నిబంధనల నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రత్యక్షంగా చేసి చూపెడుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా నియోజక వర్గ సరిహద్దులోని కూతవేటు దూరంలో పెంచికలపేటలో సభలు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.

నియోజకవర్గానికి నియమావళి పరిమితంతో కొత్త ఎత్తులు..

హుజూరాబాద్ ఉప ఎన్నికల (Huzurabad By Election) నియమావళిపై కమిషన్ స్పష్టత ఇవ్వగా పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్‌ క్యాంపెయినర్ల సభకు కూడా 1,000 మందికి మించకూడదని ఆంక్షలు విధించింది. దీనితో రాజకీయ పార్టీలు ఒకరకంగా ఉక్కిరిబిక్కిరి అయ్యాయని చెప్పొచ్చు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉండటంతో కేవలం నియోజకవర్గంలోనే కాకుండా ఇరుగుపొరుగు సెగ్మెంట్లు వేదికగా మార్చుకునే వెసులుబాటు లభించినట్టయింది. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. మొదట్లోనే ఎన్నికల కమిషన్ కోడ్ జిల్లా వ్యాప్తంగా ఉంటుందని ప్రకటించినప్పటికీ... ఆ తరువాత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం వరకే అమల్లో ఉంటాయని ప్రకటించడం పార్టీకి వరంగా మారిందనే చెప్పాలి.

కరోనా ప్రోటోకాల్‌తో పాటు నియమావళి..

ఎన్నికల నిబంధనలు (CEC Rules), కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన నిబంధనలు కూడా విధిగా అమలు చేయాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా... 1,000 మంది మించరాదన్న నిబంధనతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు వంటి వాటిని నిషేధించింది. కేవలం సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. ఆయా సమావేశాలకు హాజరయ్యే వారి వివరాలను రిజిస్టర్ చేయాలని కూడా ఆదేశించింది. కఠినమైన ఈ నిబంధనలను అమలు చేయడం రాజకీయ పార్టీలకు దాదాపు అసాధ్యమైందనే చెప్పాలి.  

సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించిన పార్టీలు..

హుజూరాబాద్‌ నియోజకవర్గం(Huzurabad CEC Rules)లో నియమావళి కఠినంగా అమలు చేయడమే కాకుండా ఇప్పటికే అధికార పార్టీ నాయకునితో ఫంక్షన్ హాల్ యజమానితో పాటు భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌పై కేసు నమోదైయింది. ఈ క్రమంలో కేసులు నమోదు కాకుండా విస్తృత ప్రచారం కోసం పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో తప్ప పక్క నియోజకవర్గాల్లో నియమావళి ఇబ్బందులు ఉండవు అనే నిర్ణయానికి వచ్చిన నాయకులు ప్లాన్‌ బీ అమలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కాకుండా పొరుగు జిల్లాల సరిహద్దుల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఈ సమావేశాలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

పెంచికల్ పేట ఎంపిక..

హనుమకొండ జిల్లా పెంచికల్‌ పేట హుజూరాబాద్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రచారానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం గమనార్హం. నూతనంగా ఆవిర్భవించిన హనుమకొండ జిల్లాలో ఈ గ్రామం చేరగా హుస్నాబాద్ నియోజవకర్గంలో ఉండడం వీరికి కలిసి వస్తోంది. అంతే కాకుండా కరీంనగర్, వరంగల్ హైవేపైనే ఈ గ్రామం ఉండటం.. పైగా విశాల స్థలం ఉండటం, జన సమీకరణకు ఇబ్బందులు లేకుండా పోయింది. ఇప్పుడు ఈసీ నిర్ణయంతో ఈ ప్రాంతంలో సమావేశాలకు చెక్ పడతాయని తెలుస్తోంది.

ఇదీ చూడండి: హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టులో పిల్‌

Last Updated :Oct 21, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.