ETV Bharat / bharat

బర్త్​డే పార్టీలో హత్య.. 9ఏళ్ల బాలికపై వృద్ధుల రేప్.. మహిళను రైల్లో నుంచి తోసేసి..

author img

By

Published : Sep 2, 2022, 4:34 PM IST

Updated : Sep 2, 2022, 7:57 PM IST

పిలవని పార్టీకి వచ్చిన కొంతమంది వ్యక్తులు.. గొడవకు దిగి ఒకరిని హత్య చేశారు. భవనం నుంచి తోసేసి ఓ వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. మరోవైపు మహారాష్ట్రలో తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళను వేధింపులకు గురిచేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు.. ఆమెను బయటకు తోసేశాడు. హరియాణాలో ఈ దారుణం జరిగింది.

woman-thrown-out-of-moving-train
woman-thrown-out-of-moving-train

స్నేహితుడికి బర్త్​డే పార్టీకి వచ్చిన కొందరు అపరిచితులు 24 ఏళ్ల వ్యక్తిని భవనం పైనుంచి తోసేశారు. ఛత్తీస్​గఢ్​లోని జాంజ్​గిర్ చంపా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతుడిని కమలేశ్వర్ దేవాంగన్​గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. హత్య నేరం కింద వీరిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 31 అర్ధరాత్రి శ్రీకృష్ణ తులసీ ధర్మశాల వద్ద బిన్ని దేవాంగన్ అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నాడు.

అయితే పార్టీ జరుగుతుండగా కిరణ్ సారథి, మనీశ్ సారథి అనే ఇద్దరు లోనికి వచ్చారు. పార్టీలో ఉన్నవారెవరికీ వీరి గురించి తెలియదు. ఆహ్వానం లేకున్నా వీరు లోపలికి వచ్చి డ్యాన్స్​ చేయడం ప్రారంభించారు. దీంతో కమ్లేశ్వర్​ సహా మరికొందరు వారిని అడ్డుకొని ప్రశ్నించారు. దీంతో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. పార్టీలోకి చొరబడ్డ ఇద్దరు వ్యక్తులు వెంటనే తమ ఆరుగురు స్నేహితులను ఘటనాస్థలికి పిలిపించుకున్నారు. ఎనిమిది మంది కలిసి కమ్లేశ్వర్, అతడి స్నేహితులను కొట్టారు. కమ్లేశ్వర్ ఇంటి మేడపైకి పారిపోగా.. నిందితులు అతడిని పట్టుకొని పైనుంచి తోసేశారు. బాధితుడు కమ్లేశ్​ను వెంటనే బిలాస్​పుర్​లోని ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయారు.

బాలికపై రెండేళ్లుగా రేప్
మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై దుండగులు అత్యాచారం చేశారు. ముగ్గురు వ్యక్తులు కలిసి బాలికపై రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 62, 65 ఏళ్ల వయసున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

రైల్లో నుంచి తోసేసి.. తానూ దూకి..
లైంగిక వేధింపులను అడ్డుకుందని ఓ మహిళను రైల్లో నుంచి తోసేశారు దుండగులు. హరియాణాలోని ఫతేబాద్​లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను మన్​దీప్ కౌర్​గా గుర్తించారు. మృతురాలి స్వస్థలం తోహానాలోని తూర్​నగర్​ అని పోలీసులు తెలిపారు. అందిన సమాచారం ప్రకారం.. మన్​దీప్ కౌర్ అనే మహిళ రోహ్​తక్​లోని ఖారెంటి గ్రామం నుంచి తోహానాకు వెళ్తోంది. తన తొమ్మిదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకొని రైల్లో ప్రయాణిస్తోంది. అయితే, తన తల్లిని ఓ యువకుడు వేధింపులకు గురిచేశాడని మృతురాలి కుమారుడు తెలిపాడు.

అతడిని మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఘర్షణ తలెత్తింది. దీంతో నిందితుడు మహిళను రైల్లో నుంచి బయటకు తోసేశాడు. మన్​దీప్ కౌర్​ రాక కోసం తోహానా స్టేషన్​లో ఎదురుచూస్తున్న ఆమె భర్తకు.. కుమారుడు రైలు కోచ్​లో ఏడుస్తూ కనిపించాడు. జరిగిన విషయాన్ని కుమారుడు తన తండ్రికి వివరించాడు. దీంతో బాలుడి తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రాత్రంతా వెతికినా మన్​దీప్ కౌర్ జాడ తెలియలేదు. శుక్రవారం ఉదయం మళ్లీ వెతకగా.. తోహానా రైల్వే స్టేషన్​కు 2కిమీ దూరంలో పొదల్లో పడిపోయి ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. వేధింపులకు పాల్పడిన వ్యక్తి సైతం రైలు నుంచి దూకేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడికి అగ్రోహా మెడికల్ కళాశాలలో చికిత్స కొనసాగుతోంది.

Last Updated :Sep 2, 2022, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.