ప్లాస్టిక్​ డ్రమ్ములో మహిళ శవం.. రైల్వే స్టేషన్​లో ప్రత్యక్షం.. రెండు నెలల్లో రెండోసారి

author img

By

Published : Mar 14, 2023, 10:51 AM IST

woman deadbody found in plastic drum in bangalore railway station
బెంగళూరు రైల్వే స్టేషన్​లో ప్లాస్టిక్​ డ్రమ్ములో మహిళ మృతదేహం ()

కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్లాస్టిక్​ డ్రమ్ములో మహిళ మృతదేహం కలకలం రేపింది. ఓ మహిళ మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు నీలం రంగు డ్రమ్ములో పెట్టి.. ఓ రైల్వే స్టేషన్​లో వదిలి వెళ్లారు.

కర్ణాటక బెంగళూరులోని ఓ రైల్వే స్టేషన్​లో ప్లాస్టిక్​ డ్రమ్ములో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు ఆ మహిళ మృతదేహాన్ని నీలం రంగు ప్లాస్టిక్​ డ్రమ్ములో పెట్టి బయ్యప్పనహల్లి రోడ్డులోని ఎస్​ఎమ్​వీటీ రైల్వే స్టేషన్​లో వదిలి వెళ్లారు. వారు డ్రమ్మును తీసుకొస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బయ్యప్పనహల్లి రోడ్డులోని ఎస్​ఎమ్​వీటీ రైల్వే స్టేషన్​ ప్రధాన గేటు వద్ద ఆటో దిగారు. వాహనంలో నుంచి నీలం రంగు డ్రమ్మును తీసి స్టేషన్​ ప్రధాన ద్వారం దగ్గర వదిలి వెళ్లినట్లుగా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్​ అయింది. ఈ దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళకు వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

రైల్వే స్టేషన్​లో వదిలి వెళ్లిన డ్రమ్ములో నుంచి దుర్వాసన రావడం వల్ల ప్రయాణీకులు.. పోలీసులకు సమాచారం అందించారు. 'సంఘటనా స్థలి నుంచి సోమవారం రాత్రి 7:30 నిమిషాలకు మాకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. అనంతరం డెడ్​బాడీని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితులను గుర్తించేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాం. విచారణ కొనసాగుతోంది' అని రైల్వే ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు.

రెండు నెలల వ్యవధిలో రెండోది..
రెండు నెలల క్రితం కూడా అచ్చం ఈ తరహా ఘటనే వెలుగు చూసింది. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని యశ్వంత్​పూర్​ రైల్వే స్టేషన్​లోని ఒకటో నెంబర్​ ప్లాట్​ఫామ్​పై ఇలాగే మృతదేహంతో కూడిన డ్రమ్ము బయటపడింది. అది మరవకముందే రెండు నెలల వ్యవధిలోనే మళ్లీ అలాంటి సంఘటనే జరిగిన నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

యశ్వంత్​పూర్ ఘటనలో.. మహిళను చంపి నీలి రంగు డ్రమ్ములో కుక్కారు కొందరు దుండగులు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించిన స్టేషన్​ శుభ్రం చేసే రైల్వే సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్రమ్ములో మృతదేహంపై బట్టలు కప్పి ఉన్నాయని.. చనిపోయిన మహిళకు వయసు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతురాలికి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల క్రితమే మహిళను చంపి ప్లాస్టిక్​ కవర్​లో చుట్టిన తర్వాత శవాన్ని డ్రమ్ములో కుక్కి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.