ETV Bharat / bharat

గుజరాత్ పీఠం భాజపాదే.. రెండో స్థానంలో ఆప్​.. ఆసక్తికరంగా ప్రీ-పోల్ సర్వే

author img

By

Published : Nov 5, 2022, 8:17 PM IST

Gujarat elections 2022
గుజరాత్ ఎన్నికలు

Gujarat elections 2022: గుజరాత్‌లో శాసనసభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభంతో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. మోదీ ఇలాకాలో మరోసారి కాషాయ జెండా ఎగరేయాలని భారతీయ జనతా పార్టీ.. ఉవ్విళూరుతోంది. దాదాపు రెండున్నర దశాబ్దాల కమలం పార్టీ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్‌, ఆప్‌ వ్యూహరచన చేస్తున్నాయి. అయితే గుజరాత్‌లో త్రిముఖ పోరులో మరోసారి భాజపానే గెలుస్తుందని ఏబీపీ సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. అయితే తమకు ఇప్పటికే 30 శాతం ఓటు బ్యాంక్‌ ఉందని.. దానిని మరింత పెంచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేశారు.

Gujarat elections 2022 : గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలన్నీ వ్యూహ రచనలు ప్రారంభించాయి. గుజరాత్‌లో 1995 నుంచి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. వరుస పరాజయాలకు గుజరాత్‌లో ముగింపు పలకాలని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. పంజాబ్ వ్యూహాన్ని అనుసరించి మోదీ ఇలాకాలో జెండా పాతాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ పట్టుదలగా ఉంది.

గుజరాత్‌ శాసనసభ ఎన్నికలపై ఏబీపీ సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. గుజరాత్‌లో మరోసారి భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వస్తుందని ఈ సర్వే వెల్లడించింది. రెండో స్థానంలో ఆప్‌.. మూడో స్థానంలో కాంగ్రెస్‌ నిలుస్తాయని తెలిపింది. 22,807 మందితో జరిపిన ప్రీ-పోల్ సర్వేలో.. అధికార భాజపాకు 56 శాతం, ఆప్‌కు 20 శాతం, కాంగ్రెస్‌కు 17 శాతం ఓట్లు రానున్నట్లు ఏబీపీ సీ ఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లు.. భారీగా ఆప్‌ వైపు మళ్లే అవకాశం ఉందని కూడా తెలిపింది. గుజరాతీలపై ఆప్‌ చాలా ప్రభావం చూపనుందని కూడా సీ ఓటర్‌ సర్వే పేర్కొంది.

ఏబీపీ సీ ఓటర్ ప్రీ పోల్‌ సర్వేపై ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. తమకు ఇప్పటికే 30 శాతం ఓటు బ్యాంక్‌ ఉందని.. దీనిని మరింత పెంచుకుని గుజరాత్‌ అధికార పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఐదు కంటే తక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని విమర్శించారు. గుజరాత్​లో ఆప్​ గెలుపు తథ్యమని కేజ్రీవాల్ తెలిపారు.

సాధారణంగా భాజపా-కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోరు జరిగే గుజరాత్‌లో ఆప్‌ ప్రభావం చూపనుండడం ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇప్పటికే టీవీ యాంకర్‌గా పనిచేసిన ఇసుదాన్‌ గఢ్వీని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసిన ఆప్‌ ప్రచారంలోనూ దూసుకుపోతుంది. గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. డిసెంబర్ 1న తొలి దశ, డిసెంబర్ 5న రెండో దశ జరగనుండగా.. అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీ చదవండి: 'రూ.500 కోట్ల పార్టీ ఫండ్ కోసం కేజ్రీవాల్ ఒత్తిడి'.. మరో బాంబు పేల్చిన సుకేశ్

పాముతో వీరోచితంగా పోరాడి యజమానులను కాపాడిన శునకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.