ETV Bharat / bharat

ప్రియాంక ఎంట్రీతో యూపీ ఎన్నికల్లో నష్టం ఎవరికి ?

author img

By

Published : Jan 20, 2022, 2:48 PM IST

ప్రియాంక రాక.. ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్​లో కొత్త జోష్​ నింపింది. ఆమె వచ్చాక పార్టీ బలం కూడా పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య ద్విముఖపోరు నెలకొన్న తరుణంతో.. కాంగ్రెస్​ బలపడటం ఎవరికి లాభం? హస్తం పార్టీ కేడర్​ విశ్వాసాన్ని ప్రియాంక ఎలా చూరగొన్నారు? యూపీ ఎన్నికల్లో ప్రియాంక ఫ్యాక్టర్‌పై విశ్లేషకులు ఏం అంటున్నారు?

UP elections
యూపీలో కాంగ్రెస్​ పెరిగిన బలం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉనికి కోల్పోయే దశలో ఉన్న కాంగ్రెస్​ పార్టీకి వెన్నుదన్నై నిలిచారు ప్రియాంక గాంధీ. ఏడాది నుంచే యూపీ రాజకీయాలపై దృష్టి సారించిన ఆమె.. కాంగ్రెస్​లో జవసత్వాలు నింపేందుకు శక్తియుక్తులు కూడగట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్‌ బాధ్యతలను పూర్తిగా భుజాలపై వేసుకొని మోస్తున్నారు. దాదాపు ఏడాది క్రితం నుంచే ఆపరేషన్‌ యూపీ ప్రారంభించిన ప్రియాంక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

UP elections
కాంగ్రెస్​ పార్టీ శ్రేణులతో ప్రియాంక

కేడర్​లో భరోసా..

1952 మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 90వ దశకం వరకు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న యూపీలో ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిన పార్టీ ఉనికిని కాపాడేందుకు ప్రియాంక గాంధీ రంగంలో దిగారు. 2017 శాసనసభ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాలతో నిస్తేజం అవహించిన కాంగ్రెస్‌ కేడర్‌లో నేనున్నాంటూ భరోసా కల్పించారు.

UP elections
హత్యకు గురైన దళిత యువకుడి తల్లిని ఓదారుస్తున్న ప్రియాంక గాంధీ
UP elections
లఖింపుర్​ బాధితులను రాహుల్​తో​ కలిసి ఓదారుస్తున్న ప్రియాంక

బాధితుల పక్షాన పోరాటం..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌, హథ్రాస్‌ హత్యాచారం ఘటనల్లో బాధితుల పక్షాన పోరాటం చేశారు. ఇటీవల జరిగిన లఖీంపూర్‌ఖేరీ హత్యాకాండపై ఇంకాస్త దూకుడుగానే వ్యవహరించిన ప్రియాంక.. ఘటన జరిగిన కొన్ని గంటలవ్యవధిలో రాత్రికిరాత్రే యూపీలో ప్రత్యక్షమయ్యారు. బాధిత కుటుంబాలకు కలిసేందుకు వెళ్తుండగా తనను అడ్డుకున్న పోలీసులను ఇదెక్కడి న్యాయమంటూ నిలదీశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని గదిలో నిర్బంధిస్తే.. ఆ గదిని చీపురుతో ఊడుస్తూ గాంధీగిరి చేశారు. ప్రత్యర్థులు విమర్శలు చేసినా.. వారికి హుందాగానే బదులిచ్చారు.

UP elections
ఆశ వర్కర్​ను పరామర్శిస్తూ..

జనం మధ్యలోనే..

కొంతకాలంగా ప్రియాంక జనం మధ్యలోనే ఉన్నప్పటికీ యూపీ ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంత అనే విషయాన్ని రాజకీయ పరిశీలకులు అంచనా వేయలేకపోతున్నారు. నిజానికి ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్‌ బలపడి ముక్కోణపుపోటీ ఏర్పడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. తమకు లబ్ధి చేకూర్చుతుందని కమలనాథులు భావించారు. కానీ ప్రియాంక, మాయావతి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పెద్దగా చీలే అవకాశం లేదని, సమాజ్‌వాదీ పార్టీతో పోటీ తప్పడం లేదని కాషాయం నేతలు అంటున్నారు.

UP elections
2019లో దళితుల ఊచకోతలో బాధితులను పరామర్శిస్తున్న ప్రియాంక

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యూపీలో కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు ప్రియాంక. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు.

UP elections
పూజలో పాల్గొన్న ప్రియాంక

ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు నుంచే యూపీ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించిన ఆమె క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చారు. అధికార భాజపా, ప్రతిపక్ష ఎస్పీలకు భిన్నంగా ప్రియాంకాగాంధీ పావులు కదుపుతున్నారు.

ప్రియాంక ప్రచారంలో కీలకాంశాలు..

  • ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు నుంచే మహిళలకు 40శాతం సీట్లు సహా పలు హామీలు
  • మై లడ్కీ హూ.. లడ్‌ సక్తాహూ అంటూ విస్తృతంగా ప్రచారం
  • జిల్లాల పర్యటన సందర్భంగా ఆలయాలను సందర్శిస్తూ హిందుత్వకార్డుతో కమలనాథులకు సవాల్‌ విసరడం
  • పోలీసుల దూకుడును ఎండగట్టడం సహా పెరిగిన ధరలపై పోరాటం ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం
  • ప్రియాంక ప్రసంగాలు, వ్యాఖ్యలు సోదరుడు రాహుల్‌ కంటే భిన్నంగా ఉండటం
  • ఎక్కడా సంయమనం, హుందాతనం కోల్పోకుండా మాట్లాడడం
  • వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ ప్రత్యర్థులు కూడా ప్రశంసించేలా ప్రియాంక వ్యవహారం

నానమ్మ ప్రతిరూపం..

UP elections
ఊడ్చుతున్న ప్రియాంక గాంధీ

నానమ్మ ప్రతిరూపం, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలతో ప్రియాంక సభలకు పెద్దసంఖ్యలో జనం వస్తున్నా.... క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని, ఓటు బ్యాంకు పెరుగుతుందని చెప్పలేమనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఓట్ల శాతం మాత్రం కచ్చితంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. యూపీలో ఇప్పుడు మాయావతి స్థానాన్ని భర్తీ చేయటంతోపాటు పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను బలమైనశక్తిగా ప్రియాంక మార్చవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భాజపా ఓట్లను ప్రియాంక కనీసం 10 నుంచి 20 శాతం మేర చీల్చగలిగితే ఆ పార్టీని బలహీనపరచగలరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి 2014లోనే ప్రియాంకగాంధీ రాజకీయ అరంగేట్రంచేసి ఉంటే కాంగ్రెస్‌ పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. భాజపాకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచేదంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో కాంగ్రెస్‌ రెండంకెల సీట్లకు చేరినా ఎక్కువేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.