ETV Bharat / bharat

వీల్​ఛైర్​లో 24 గంటల్లోనే 200కిమీ.. 'గిన్నిస్​ రికార్డ్'​పై పారాఅథ్లెట్ కన్ను

author img

By

Published : Jan 16, 2022, 1:08 PM IST

Wheelchair marathon: 24 గంటల్లో 200 కిలోమీటర్లు కారులోనో, బస్సులోనో ప్రయాణిస్తేనే ఎంతో అలసిపోతాం. అలాంటిది.. ఒడిశాలోని భువనేశ్వర్​కు చెందిన ఓ దివ్యాంగుడు వీల్​ఛైర్​లో ఈ దూరాన్ని 24 గంటల్లోనే పూర్తి చేసి గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

Wheelchair marathon
పారాఅథ్లెట్ కమలాకాంత్​ నాయక్​

Wheelchair marathon: వెన్నెముక దెబ్బతిని నడవలేని పరిస్థితి. వీల్​ ఛైర్​కే పరిమితం. అలాంటి వ్యక్తి ఇప్పుడు గిన్నిస్​ రికార్డుపై కన్నేశారు. అదేలా అంటారా.. వీల్​ఛైర్​లో 24 గంటల్లోనే 200 కిలోమీటర్లు చుట్టేసి రికార్డుల్లోకి ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనే.. ఒడిశాకు చెందిన పారాఅథ్లెట్​ కమలాకాంత్​ నాయక్​.

Wheelchair marathon
మారథాన్​ ప్రారంభిస్తున్న కమలాకాంత్​

భువనేశ్వర్​లోని మాస్టర్​ క్యాంటీన్​ స్క్వేర్​ నుంచి రాజ్​మహల్​ స్క్వేర్​​ సైకిల్​ ట్రాక్​ పాయింట్​ వరకు 200 కిలోమీటర్లు ఉంటుంది. వీల్​ఛైర్​పై ఈ ట్రాక్​పై ఆదివారం మారథాన్​ ప్రారంభించారు కమలాకాంత్​ నాయక్​. ఆయనకు ఒడిశా వీల్​ఛైర్​ బాస్కెట్​బాల్​ అసోసియేషన్​తో పాటు బెట్టర్​లైఫ్​ ఫౌండేషన్​ బృందం మద్దతుగా నిలిచారు.

ఈ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకుని గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కటమే లక్ష్యంగా మారథాన్​ చేపట్టినట్లు తెలిపారు కమలాకాంత్​ నాయక్​.

Wheelchair marathon
కమలాకాంత్​ నాయక్​

" వెన్నముక దెబ్బతిన్న తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో కుంగిపోయాను. కానీ, నా కుటుంబం, కోచ్​, డాక్టర్లు నాకు మద్దతుగా నిలిచారు. నేను త్వరగా కోలుకునేలా చేశారు. నా సోదరి, ఒలాత్పుర్​లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ రిహబిలిటేషన్​, ట్రైనింగ్​, రీసర్చ్ కేంద్రం​ డాక్టర్​ పీపీ మొహంతి, దుర్గాబాయి, ఎస్​.వైద్యనాథన్​, కోచ్​.. నాలో ధైర్యం నింపారు. పారా అథ్లెట్​లో పాల్గొనేందుకు దోహదపడ్డారు. మంచం పైనుంచి లేచే పరిస్థితి లేనప్పుడు నాకు అండగా నిలిచారు. వారి వల్లే ఈరోజు మారథాన్​ చేపడుతున్నా. 200 కిలోమీటర్ల మారథాన్​ చేపట్టేందుకు ఇదే సరైన సమయం. ఇతర మనుషులతో మనం వేరుకాదు, అందరిలాగే అన్ని పనులు చేయొచ్చనేది దివ్యాంగులకు నేను ఇచ్చే సందేశం."

- కమలాకాంత్​ నాయక్​, పారాఅథ్లెట్​

ఒడిశా ప్రభుత్వ సామాజిక భద్రత, దివ్యాంగుల సాధికారత విభాగం (ఎస్​ఎస్​ఈపీడీ) ఆధ్వర్యంలో కలింగ మైదానంలో చేపట్టిన ఎబిలిటి మారథాన్​లో తొలిసారి పాల్గొన్నారు కమలాకాంత్​. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న వివిధ మారథాన్లలో పాల్గొంటున్నారు. 15 గంటల్లోనే 139.57 కిలోమీటర్లు వీల్​ఛైర్​లోనే అల్ట్రా మారథాన్​ పూర్తిచేసిన ఏకైక భారతీయుడిగా గుర్తింపు పొందారు. అలాగే.. అర్ధమారథాన్​(21 కిలోమీటర్లు)లో 16 సార్లు, మారథాన్​(42 కిలోమీటర్లు)లో 13 సార్లు పాల్గొన్నారు. ప్రస్తుతం కమలాకాంత్​.. ఒడిశా వీల్​ఛైర్​ బాస్కెట్​ బాల్​ టీం సారథిగా వ్యవహరిస్తున్నారు. 2020లో వీల్​ఛైర్​పై 4200 కిలోమీటర్లు పూర్తిచేసి రికార్డు సాధించారు.

Wheelchair marathon
వీల్​ఛైర్​లో 200 కిలోమీటర్ల మారథాన్​
Wheelchair marathon
సైకిల్​ ట్రాక్​పై వీల్​ఛైర్​ మారథాన్​

ఇదీ చూడండి:

42 కిలోమీటర్లు నడిచిన దివ్యాంగుడు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.