ETV Bharat / bharat

తల్లిపై కోపం.. పిల్లాడికి శాపం! ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన వాచ్​మన్​

author img

By

Published : Jan 10, 2023, 8:52 PM IST

బాలుడి తల్లిపై ఉన్న కోపంతో ఓ వాచ్​మన్​ దారుణానికి పాల్పడ్డాడు. బాలుడి గొంతు నులిమి స్విమ్మింగ్​ పూల్​లో పడేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు, 15 రోజుల వయసున్న నవజాత శిశువును అక్రమ రవాణా చేస్తున్న దంపతులను పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన గుజరాత్​లో వెలుగుచూసింది.

boy murdered maharashtra
బాలుడు హత్య

మహారాష్ట్ర ఠాణెలో ఘోరం జరిగింది. ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. అనంతరం హత్య చేశాడు ఓ వాచ్​మన్​. బాలుడి తల్లిపై ఉన్న కోపంతోనే వాచ్​మన్​ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నితిన్​ కాంబ్లేని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏడేళ్ల ప్రణవ్ భోంస్లే కల్యాణ్​లోని ఓ పాఠశాలలో చదువుతున్నాడు. ప్రణవ్​.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో నిందితుడు నితిన్ కాంబ్లే అతడిని కిడ్నాప్ చేశాడు. స్కూల్ టైం పూర్తైన తర్వాత కూడా బాలుడి ఎంతకి ఇంటికి రాకపోవడం వల్ల అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్​లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని నితిన్ కాంబ్లేగా గుర్తించారు.

"హౌసింగ్ కాంప్లెక్స్​లోని స్విమ్మింగ్​ పూల్​లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించాం. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం. వాచ్​మన్​కు చిన్నారి తల్లికి అంతకుముందు నుంచే గొడవలు ఉన్నాయి. అందుకే చిన్నారిని కిడ్నాప్ చేసి గొంతునులిమి స్విమ్మింగ్​పూల్​లో పడేసి హత్య చేశాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించాం."

--పోలీసులు

నవజాత శిశువు అక్రమ రవాణా..
15 రోజుల వయసున్న నవజాత శిశువును అక్రమ రవాణా చేస్తున్న దంపతులను అహ్మదాబాద్ క్రైమ్​ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను బిపిన్ సిర్సాత్​, మోనికా సిర్సాత్​గా పోలీసులు గుర్తించారు. గుజరాత్​.. అహ్మదాబాద్​లోని రన్​సన్​ రైల్వే క్రాసింగ్​లో జరిగిందీ ఘటన.

"నిందితులు.. హిమ్మత్​నగర్​కు చెందిన రేష్​భాయ్​ రాథోడ్ అనే మహిళ నుంచి శిశువును రూ.2.1 లక్షలకు కొనుగోలు చేశారు. వీరు హైదరాబాద్‌లోని ఉమ అనే మహిళకు ఈ పసికందును రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నిందితులు నవజాత శిశువుల అక్రమ రవాణా సమయంలో కోడ్ లాంగ్వేజ్​ను మాట్లాడారు. బాలికలకు చాక్లెట్‌.. మగపిల్లలకు లాలీపాప్‌ అని కోడింగ్ పెట్టారు. గుజరాత్‌ నుంచి మహారాష్ట్రకు అక్కడి నుంచి తెలంగాణకు చిన్నారుల అక్రమ రవాణా చాలా కాలంగా జరుగుతోంది. నిందితులు.. మహారాష్ట్రలో ఎన్జీఓను నడుపుతున్నారు. అయితే వీరు శిశువులను అక్రమ రవాణా చేసేందుకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు."

--అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్​ పోలీసులు

వైద్య నిపుణురాలిపై..
ఓ వైద్య నిపుణురాలిని ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు వెంబడించారు. ఈ ఘటనలో నీలేశ్​ లక్ష్మణ్ సింగ్, రాహుల్ గున్వంత్​రావ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్లు పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

'నిందితులు నన్ను వెంబడించి ఫొటోలు తీసి వేరే వాళ్లకు పంపిస్తున్నారు. నా భద్రతపై ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించా. నిందితులిద్దరూ పోలీసు దుస్తుల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా నా వెంటే వస్తున్నారు. ఆఖరికి రెస్టారెంట్​లోనూ నన్ను వెంబడించారు.' అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.