ETV Bharat / bharat

కూలీల ఉద్విగ్న క్షణాలు- బయటకు రాగానే 'భారత్​ మాతా కీ జై' అంటూ నినాదాలు, కార్మికులకు మోదీ ఫోన్​ కాల్​

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 9:19 AM IST

Updated : Nov 29, 2023, 10:33 AM IST

Uttarakhand Tunnel Rescue Operation : ఉత్తరాఖండ్​లో సొరంగంలో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం పట్ల కూలీల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కూలీలు సొరంగం నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడంతా ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకుంటూ, 'హరహర మహాదేవ్‌'.. 'భారత్‌ మాతాకీ జై' అని నినాదాలు చేశారు. మరోవైపు.. ప్రధాని మోదీ.. కూలీలతో ఫోన్లో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు.

Uttarakhand Tunnel Rescue Operation
Uttarakhand Tunnel Rescue Operation

Uttarakhand Tunnel Rescue Operation : 17రోజుల తర్వాత సొరంగం నుంచి బయటపడిన కార్మికుల ధైర్యం గొప్పదని ప్రధాని మోదీ ప్రశంసించారు. దేవుని ఆశీస్సులు, బాధితుల కుటుంబసభ్యులు చేసుకున్న పుణ్యం వల్లే.. వారంతా క్షేమంగా సొరంగం నుంచి బయటపడ్డారని అన్నారు. ఉత్తరకాశీలోని సొరంగం నుంచి బయటపడిన బాధితులతో ప్రధాని మోదీ ఫోన్​లో మాట్లాడారు. ఎన్నోకష్టాల తర్వాత కార్మికులంతా సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తాము సురక్షితంగా బయటపడటానికి కారణమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, సీఎం పుష్కర్ సింగ్ ధామీకి బాధిత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

"ఎంతోకష్టం తర్వాత కూడా మీరు బయటపడ్డారు. నాకైతే చాలా సంతోషకరమైన విషయం. మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఏదైనా ఘోరం జరిగి ఉంటే మనసును అదుపు చేసుకోవటం చాలా కష్టమయ్యేది. కేదార్‌నాథ్‌ బాబా, బద్రీనాథ్‌ భగవాన్‌ ఆశీస్సులతో మీరంతా బయటపడ్డారు. 16, 17రోజులు తక్కువ సమయం కాదు. మీరంతా చాలా ధైర్యంతో ఉన్నారు. ఒకరు ఇంకొకరికి ధైర్యం చెప్పటం అన్నింటి కంటే పెద్దమాట. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో రైలు డబ్బాల్లోనూ కలిసి ప్రయాణిస్తుంటే కూడా ఒక్కోసారి భయమేస్తుంది. అయినప్పటికీ మీరంతా ఎంతో ధైర్యంతో ఉన్నారు. నేను నిరంతరం సమాచారం తెలుసుకునేవాణ్ని. సీఎంతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడేవాణ్ని. పీఎంవో అధికారులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. సమాచారం తెలిసినప్పటికీ మనసులో ఆందోళన మాత్రం అలాగే ఉండేది. ఎంతమంది అయితే బయటపడ్డారో అందరికీ.. వారి కుటుంబ సభ్యుల పుణ్యం కూడా పనిచేసింది."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

అంతకుముందు అలుపెరగకుండా తమ కోసం పనిచేసిన యంత్రాంగాన్ని, అధికారుల్ని, క్షేమ సమాచారం కోసం కళ్లుకాయలు కాసేలా నిరీక్షిస్తున్న కుటుంబసభ్యుల్ని చూసి వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఘటనాస్థలిలో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ, కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌, ఇతర ఉన్నతాధికారులు కూలీలకు పూలమాలలు వేసి, భుజం తట్టి క్షేమ సమాచారాన్ని ఆరా తీసినప్పుడు కొందరు కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. వారికి పాదాభివందనం చేసి చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞత చాటుకున్నారు.

కూలీలు బయటకు వస్తున్నప్పుడు అక్కడంతా ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకుంటూ, 'హరహర మహాదేవ్‌'.. 'భారత్‌ మాతాకీ జై' అని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ వల్లనే ఈ విజయం సాధ్యమైందని మరికొందరు నినదించారు. సొరంగం బయట ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడి వద్ద స్థానికులు పూజలు చేశారు.

సొరంగం నుంచి కూలీలు బయటకి రాగానే కూలీలను ఆస్పత్రికి తరలించారు అధికారులు. రోజుల తరబడి సొరంగంలోనే ఉన్న కూలీల ఆరోగ్య పరిస్థితిని 2-3 రోజులపాటు క్షుణ్నంగా పరిశీలించి, వారు అన్నివిధాలా బాగున్నారని తేలిన తర్వాతే స్వస్థలాలకు పంపించనున్నారు. ఎవరి పరిస్థితీ ప్రమాదకరంగా లేదని సీఎం ధామీ ధ్రువీకరించారు. అందరిలో అత్యంత చిన్న వయసు వ్యక్తిని మొదటగా బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు.

56 ఏళ్ల వయసులో పట్టువదలని విక్రమార్కుడు- 23ప్రయత్నాల తర్వాత సెక్యూరిటీ గార్డ్ డబుల్ పీజీ

పిల్లల కోసం బొమ్మల లైబ్రరీ- యాప్​లో ఆర్డర్ చేస్తే​ ఉచితంగా హోమ్​ డెలివరీ!

Last Updated :Nov 29, 2023, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.