ETV Bharat / bharat

UP polls 2022: యూపీ సమరంలో మానసిక యుద్ధం

author img

By

Published : Jan 29, 2022, 9:39 PM IST

Uttar Pradesh assembly election: ఎన్నికలంటే ప్రచారాలు, వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు మాత్రమే కాదు.. ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఆరోపణలను పార్టీలు ప్రచారవ్యూహంగా మార్చుకుంటున్నాయి. యూపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ పశ్చిమ యూపీలో ప్రత్యర్థి వర్గానికి బలమున్నప్రాంతాల్లో ఇదే వ్యూహంతో సాగుతోంది. ఎస్పీ-ఆర్​ఎల్​డీ పొత్తు ఫలితాల వరకే ఉంటుందని, ఒకవేళ ఎస్పీ అధికారంలోకి వస్తే జయంత్‌ను అఖిలేశ్​ పక్కన పెడతారని కమలం పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యూపీలో భాజపా మైండ్‌ గేమ్‌పై ప్రత్యేక కథనం.

uttar-pradesh-assembly-election
అమిత్​ షా, అఖిలేశ్​ యాదవ్​, జయంత్​ ఛౌదరి

Uttar Pradesh assembly election: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని భాజపా ఒకవైపు, అయిదేళ్లక్రితం చేజారిన గద్దెను మళ్లీ సొంతం చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ మరోవైపు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బహుజన సమాజ్‌ పార్టీ, కాంగ్రెస్‌ పోటీలో ఉన్నా ప్రధానపోరు భాజపా, ఎస్పీ మధ్యే సాగుతోంది. ఈక్రమంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగిన పశ్చిమ యూపీలో అన్నదాతల ఆగ్రహాన్ని అధిగమించేందుకు ఆ ప్రాంతంలో గట్టి పట్టున్న రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పొత్తుకు భాజపా యత్నించిందని సమాచారం. అయితే ఆర్‌.ఎల్‌.డి మాత్రం ఎస్పీతో పొత్తుకే మొగ్గు చూపింది. యూపీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.

మానసిక యుద్ధ వ్యూహంతో..

ఆర్‌.ఎల్‌.డి అధినేత జయంత్‌ చౌదరి పశ్చిమ యూపీలో గట్టి ప్రాబల్యం ఉన్న జాట్‌ సామాజికవర్గానికి చెందిన నేత. యూపీలో ఏ పార్టీ గెలవాలన్నా జాట్‌ ఓట్లు చాలా కీలకం. సాగుచట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో జాట్‌ వర్గానికి చెందిన రైతులే ఎక్కువగా పాల్గొన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన ఆర్‌.ఎల్‌.డితో సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోవటంతో.. తమకు ఏ నష్టం జరగకుండా మానసిక యుద్ధం అనే వ్యూహానికి భాజపా తెరతీసింది. ఎస్పీ, ఆర్‌.ఎల్‌.డి కూటమి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా పాచికలు విసురుతోంది. ఒకవేళ యూపీ శాసనసభ ఎన్నికల్లో ఈ కూటమి గెలిస్తే ఆర్‌.ఎల్‌.డిని ఎస్పీ తమ కూటమి నుంచి బయటకు పంపిస్తుందని భాజపా ప్రచారం మొదలుపెట్టింది. దీనిద్వారా ఆ వర్గం ఓటర్లలో అనుమాన బీజాలు నాటి అయోమయం సృష్టించడమే భాజపా వ్యూహమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమిత్​ షా ఆరోపణలు..

పశ్చిమ యూపీలోని ముజఫర్‌ నగర్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌, ఆర్‌.ఎల్‌.డి అధినేత జయంత్‌ చౌదరి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించగా, శనివారం హోంమంత్రి అమిత్‌ షా భాజపా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎస్పీ, ఆర్‌.ఎల్‌.డి కలిసే ఉందని మీడియా సమావేశంలో అఖిలేశ్‌ పదేపదే స్పష్టం చేయగా, దీనిని అమిత్‌ షా ఎద్దేవా చేశారు. ఒకవేళ ఎస్పీ అధికారంలోకి వస్తే.. జయంత్‌ చౌదరిని పక్కకునెట్టి జైళ్లో ఉన్న ఆజంఖాన్‌ను అఖిలేష్‌ అక్కున చేర్చుకుంటారని అమిత్ షా ఆరోపించారు.

" శుక్రవారం నేను అఖిలేశ్‌ యాదవ్‌, జయంత్‌ చౌదరి మీడియా సమావేశాన్ని చూశాను. అఖిలేశ్‌ చాలా చక్కగా మాట్లాడారు. తాము కలిసే ఉన్నామని అఖిలేశ్‌ అన్నారు. కానివారు ఎప్పటివరకు కలిసి ఉంటారో నేను చెప్పనా? ఓట్ల లెక్కింపు రోజువరకు మాత్రమే కలిసి ఉంటారు. ఒక వేళ ఎస్పీ కూటమి అధికారంలోకి వస్తే జయంత్‌ చౌదరిని బయటకు పంపుతారు. ఆజంఖాన్‌ అధికార పీఠంపైకి వస్తారు. ఆజంఖాన్‌ ఇప్పటికైతే జైలులో ఉన్నారు. ఎస్పీ కూటమితో మనం జయంత్‌ చౌదరిని చూడలేం. ఈ విధంగా అఖిలేశ్‌ యాదవ్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోలేమా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో టిక్కెట్లను పంచుకున్నప్పుడే మనకు అర్థం అయ్యింది."

- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి

అయితే అమిత్‌ షా వ్యాఖ్యలను జయంత్‌ చౌదరి ఖండించారు. ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకే భాజపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ, ఆర్‌.ఎల్‌.డి కలిసే ఉంటాయని జయంత్‌ చౌదరీ స్పష్టం చేశారు.

" భాజపా వారు నా నిజాయితీని, ఆలోచనను అర్ధం చేసుకోవడం లేదు. నేను ప్రలోభాలకు లొంగిపోతాను అనేందుకు ఎలాంటి కారణం లేదు. ఏ కారణం వల్ల కూడా నా నిర్ణయం మారదు. వాస్తవం ఏమిటంటే భాజపా నేతల కాళ్ల కింద భూమి కదులుతోంది. ఫలితాలు వెలువడిన తర్వాత యువత, రైతుల ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎస్పీ-ఆర్‌.ఎల్‌.డి కూటమి ప్రభుత్వం ఉంటుందన్నది నిజం. నేను విడిపోను అని భాజపాకు కూడా తెలుసు. కాని ఓటర్లను ప్రలోభ పెట్టాలని, మా సోదర భావాన్ని దెబ్బతీయాలని భాజపా నేతలు యత్నిస్తున్నారు. అది తప్ప వారికి మరే ఉద్దేశం లేదు."

- జయంత్‌ చౌదరి, ఆర్‌.ఎల్‌.డి అధ్యక్షుడు

ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ,ఆర్‌.ఎల్‌.డి కూటమిపై భాజపా చేస్తున్న మానసిక యుద్ధం మరెన్ని మలుపులు తీసుకుంటుందో అని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Up election 2022: యూపీలో 'కుర్మీ' వర్గం మెప్పు పొందేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.