ETV Bharat / bharat

పార్టీల పోటాపోటీ వ్యూహాలు- 'బుందేల్‌ఖండ్‌' జై కొట్టేదెవరికి

author img

By

Published : Feb 20, 2022, 9:16 AM IST

UP Elections 2022
యూపీ ఎన్నికలు

19 స్థానాలున్న బుందేల్​ఖండ్​లో దళితులదే నిర్ణయాత్మక పాత్ర. 26 శాతం జనాభా వారిదే. అయితే.. అభివృద్ధి నినాదంతో ముందుకువెళుతున్న భాజపా, యాదవేతర ఓబీసీ, దళితుల మద్దతు కూడగట్టుకుంటున్న ఎస్పీ ఇక్కడ పోటాపోటీగా నిలుస్తున్నాయి. ఈ సారి బుందేల్​ఖండ్ వాసులు ఎవరికి జై కొట్టనున్నారు? ఓ సారి చూద్దాం..!

UP Elections 2022: అభివృద్ధి నినాదం ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ గెలిపిస్తుందా లేదా అన్నది కీలకాంశంగా మారింది. ముఖ్యంగా బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో గత అయిదేళ్లలో ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం రూ.వేల కోట్లతో అభివృద్ధిపనులు చేపట్టింది. బుందేల్‌ఖండ్‌ నీటి ఎద్దడి సమస్యను పరిష్కరిస్తానని 2017 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. రూ.3,240కోట్ల వ్యయంతో మహోబాలో నిర్మించిన నాలుగు నీటి ప్రాజెక్టులను గత ఏడాది నవంబరులో ఆయన ప్రారంభించారు. అదే రోజు ఝాన్సీ జిల్లాలో బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీకి సంబంధించిన డిఫెన్స్‌ కారిడార్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరిలో బుందేల్‌ఖండ్‌ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిన సీఎం ఆదిత్యనాథ్‌ ఈ ప్రాంత నీటి కష్టాలను తీర్చడానికి రూ.20వేల కోట్లతో వివిధ పథకాలను ప్రకటించారు. మరో రూ.30వేల కోట్ల వ్యయంతో అభివృద్ధిపనులు జరుగుతున్నాయి. ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేతో ఝాన్సీని అనుసంధానించే 296 కి.మీ.ల పొడవైన బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి వాటిలో ఒకటి. 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యప్రదేశ్‌లోని కెన్‌ నది మిగులు జలాలను కెన్‌-బెట్వా ప్రాజెక్టు ద్వారా బుందేల్‌ఖండ్‌కు తరలించేందుకు రూ.1,400 కోట్లను ప్రతిపాదించారు.

UP Elections 2022
బుందేల్​ఖండ్​

అసంతృప్తి ఎందుకంటే..

స్థానికంగా నెలకొన్న పరిస్థితులు అభివృద్ధి అంశాన్ని తెర వెనకకు నెట్టేలా ఉన్నాయని భాజపా నాయకత్వం అంచనా వేస్తోంది. వివిధ సామాజిక వర్గాల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులు, ఎద్దుల సమస్య, నిరుద్యోగం, అధిక ధరలు వంటివి ప్రతికూల ప్రభావం చూపవచ్చని కమలదళం గుర్తించింది. వ్యవసాయ ప్రధానమైన బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో వదిలేసిన ఆవుల బెడద రైతులను అధికంగా వేధిస్తోంది. చిత్రకూట్‌, మెహోబా, బాందా జిల్లాల్లో పంటలను వాటి బారి నుంచి కాపాడుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వస్తోంది. 2019 పశుగణన ప్రకారం వదిలేసిన గోవుల సంఖ్య చిత్రకూట్‌ జిల్లాలో 68,813, మహోబా జిల్లాలో 61,765, బాందాలో 47,658గా ఉంది.

ప్రాభవం కోల్పోయిన బీఎస్పీ

వ్యవసాయం ప్రధానమైన బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో కొద్ది మంది వద్ద అత్యధిక భూమి కేంద్రీకృతమై ఉంది. భూములపై ఆధిపత్యం ఉన్న ఠాకూర్లతో దళితులు, ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి సఖ్యత ఉండేది కాదు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న బీఎస్పీ 2012కు ముందు గణనీయమైన విజయాలు నమోదు చేసింది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి మొత్తం 19 స్థానాల్లో పదింటిని సొంతం చేసుకుంది.

UP Elections 2022
బీఎస్పీ
  • అయితే, బీఎస్పీ క్రమంగా ఆదరణ కోల్పోపోయింది. స్థానికంగా ప్రముఖ నేతలైన నసీముద్దీన్‌ సిద్ధిఖీ, బాబు సింగ్‌ కుష్వాహా (ఓబీసీ కుర్మి), పురుషోత్తం ద్వివేది (బ్రాహ్మణ) తదితరులు మాయావతితో పొసగక పార్టీకి దూరమయ్యారు.

ఫలించిన భాజపా వ్యూహం

UP Elections 2022
జనాభా విశ్లేషణ
  • దళితులు, ఓబీసీలు బీఎస్పీకి దూరంకావడం గమనించిన భాజపా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నించింది. ఓబీసీ నేత కేశవ ప్రసాద్‌ మౌర్య (అప్పటి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు)ను తదుపరి ముఖ్యమంత్రిగా చేస్తామని అనధికారికంగా హామీ ఇచ్చింది. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని మొత్తం 19 స్థానాలను ఆ ఎన్నికల్లో సొంతం చేసుకుంది.
  • అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. కేశవ ప్రసాద్‌ మౌర్యకు సీఎం పదవి లభించలేదు. ఆయనను ఉపముఖ్యమంత్రికే పరిమితం చేశారు. మరోవైపున ఠాకూర్‌ సామాజిక వర్గానికి చెందిన ఆదిత్యనాథ్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టడంతో ఓబీసీలు, దళితులు కినుక వహించారు.

ఎస్పీ నుంచి గట్టి పోటీ

ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ నుంచి బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో కమలదళానికి గట్టిపోటీ ఎదురవుతోంది. దళితులు 26శాతంగా ఉన్నప్పటికీ బీఎస్పీకి ఆ వర్గం ఆదరణ లభించదని అంటున్నారు. గత ఏడాది అక్టోబరులో విజయ రథ యాత్రలో భాగంగా మూడు రోజులు ఈ ప్రాంతంలో ఉన్న అఖిలేశ్‌.. యాదవేతర ఓబీసీ, దళిత నేతలను కలుసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తూర్పు, మధ్య యూపీతో పోల్చితే యాదవులు(8%), దళితుల మధ్య బుందేల్‌ఖండ్‌లో సామరస్య వాతావరణం కనిపిస్తోంది. ఠాకూర్లకు వ్యతిరేకంగా దళితులు, ఓబీసీలను కూడగట్టి.. ఎల్లవేళలా మద్దతుగా నిలిచే యాదవులు, ముస్లింల తోడ్పాటుతో ఈ ప్రాంతంలో మంచి ఫలితాలను సాధించగలమన్న విశ్వాసాన్ని సమాజ్‌వాదీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

  • బుందేల్‌ఖండ్‌లో ముస్లిం జనాభా 12శాతం. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉండే ముస్లింలతో పోలిస్తే ఇక్కడి ఆ వర్గ ప్రజలు శాంతియుత జీవనాన్ని కోరుకుంటారు. అందువల్ల హిందుత్వ నినాదం ఇక్కడ అంతగా ప్రభావం చూపదని అంటున్నారు.

కమలదళం ఆశలు వీరిపైనే..

UP Elections 2022
భాజపా

ఉన్నత సామాజిక వర్గాలతో పాటు ఓబీసీల్లోని 12 శాతం కుర్మీలు వెన్నుదన్నుగా ఉంటారని, అదనంగా దళితులను ఆకట్టుకోగలిగితే అత్యధిక స్థానాలను మరోసారి సొంతం చేసుకోవచ్చని భాజపా భావిస్తోంది. దీనిలో భాగంగా జాలౌన్‌ నుంచి ఎంపీగా అయిదు సార్లు ఎన్నికైన దళిత నేత, కేంద్ర మంత్రి భాను ప్రతాప్‌ వర్మను ఎన్నికల ప్రచారంలోకి దింపింది. ప్రియాంక రావత్‌ను బుందేల్‌ఖండ్‌ ప్రాంత భాజపా అధ్యక్షురాలిగా నియమించింది. దళిత మహిళ ఒకరు స్థానికంగా ఈ పదవిని చేపట్టడం ఇదే ప్రథమం. ప్రతాప్‌ వర్మ, ప్రియాంక రావత్‌ ఇద్దరూ తమ ప్రచారంలో ఉచిత రేషన్‌, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్ల నిర్మాణం, ఉజ్వల యోజన కింద గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ తదితర అంశాలను ప్రముఖంగా వివరిస్తున్నారు. ఈ పథకాల అమలుతో ప్రధాని మోదీకి ఈ ప్రాంతంలో మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ ఠాకూర్ల సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వెయ్యాలా వద్దా అనే సందేహం దళితులు, ఓబీసీల్లో కనిపిస్తోంది. ఈ రెండు సామాజిక వర్గాలు ఠాకూర్లకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అది సమాజ్‌వాదీలకు కలిసివస్తుంది. ప్రధాని మోదీపై విశ్వాసంతో ఓటేస్తే అది భాజపాకు సానుకూలమవుతుంది.

  • బుందేల్‌ఖండ్‌... ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉన్న ప్రాంతం. యూపీలో 7 జిల్లాలు,మధ్యప్రదేశ్‌లో 6 జిల్లాలు ఉన్నాయి.
  • యూపీ పరిధిలోని 7 జిల్లాల్లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 19
  • ఈ రోజు (ఫిబ్రవరి 20) పోలింగ్‌ జరిగే 13 సెగ్మెంట్లుఝాన్సీ, లలిత్‌పుర్‌, జాలౌన్‌, హామీర్‌పుర్‌, మహోబా జిల్లాల పరిధిలోను.. ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించే 4 నియోజకవర్గాలు బాందా జిల్లాలోను, 27న పోలింగ్‌ జరిగే 2 స్థానాలు చిత్రకూట్‌ జిల్లాలోను ఉన్నాయి.

ఇదీ చదవండి: పంజాబ్ అసెంబ్లీకి పోలింగ్.. యూపీలో మూడో విడత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.