ETV Bharat / bharat

మీడియాపై కేంద్ర మంత్రి అజయ్​ మిశ్ర ఫైర్- వీడియో వైరల్​

author img

By

Published : Dec 15, 2021, 9:38 PM IST

Ajay Mishra Fires On Media: లఖింపుర్ ఖేరీ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తుపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని దుర్భాషలాడారు. మైక్‌ ఆఫ్‌ చేయు అంటూ ఓ విలేకరిని తోసేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Union minister Ajay Mishra
అజయ్ మిశ్రా

Ajay Mishra Fires On Media: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో రైతులపై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఆయన కుమారుడు ఆశిష్‌ మిశ్ర అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రణాళికతో చేసిన కుట్రే అని సిట్‌ నిన్న వెల్లడించింది. దీనిపై ఆయన్ను ప్రశ్నించగా.. విలేకరులపై చిందులు తొక్కారు. దుర్భాషలాడుతూ వారిని నెట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర బుధవారం లఖింపుర్‌ జిల్లాకు వెళ్లారు. అక్కడ ఓ ఆస్పత్రిని సందర్శించి బయటకు వస్తుండగా విలేకరులు ఆయన్ను చుట్టుముట్టారు. లఖింపుర్‌ ఖేరి ఘటనపై సిట్ నివేదిక గురించి, ఈ ఘటనలో ఆశిష్‌ మిశ్రాపై నమోదైన హత్యాయత్నం అభియోగాల గురించి ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నలతో సహనం కోల్పోయిన అజయ్‌ మిశ్రా.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మీ మెదడు పనిచేయట్లేదా? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగకండి. వీళ్లకు సిగ్గులేదు" అంటూ దుర్భాషలాడారు. మైక్‌ ఆఫ్‌ చేయు అంటూ ఓ విలేకరిని తోసేశారు. తన కుమారుడు అమాయకుడని, కుట్రపూరితంగా అతడిని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. అనంతరం అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Lakhimpur kheri Case: అక్టోబరులో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తున్న అన్నదాతలపై అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందగా, అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ ఘటన.. ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రే అని ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం సంచలన విషయాలు వెల్లడించింది. దీంతో ఈ కేసులో నిందితులపై హత్యాయత్న అభియోగాలు నమోదు చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ఆశిష్‌ సహా 13 మంది నిందితులు అరెస్టయి జైల్లో ఉన్నారు. మంగళవారం అజయ్‌ జైలుకు వెళ్లి తన కుమారుడిని కలిశారు.

ఇదిలా ఉండగా.. సిట్‌ నివేదిక నేపథ్యంలో భాజపాపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇదీ చూడండి: 'లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.