ETV Bharat / bharat

భారీ ఎన్​కౌంటర్​.. గ్యాంగ్​స్టర్​ కుమారుడు హతం.. కోర్టులోనే ఏడ్చేసిన తండ్రి!

author img

By

Published : Apr 13, 2023, 1:19 PM IST

Updated : Apr 13, 2023, 3:06 PM IST

Atiq Ahmed Son Asad Ahmed Encounter : యూపీ పోలీసుల ఎన్​కౌంటర్​లో గ్యాంగ్​స్టర్​, రాజకీయ నేత అతిఖ్​ అహ్మద్​ కుమారుడు హతమయ్యాడు. న్యాయవాది ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతడితోపాటు మరొకడు కూడా చనిపోయాడు.

atiq ahmed son encounter
atiq ahmed son encounter

Atiq Ahmed Son Asad Ahmed Encounter : ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్, రాజకీయ నేత అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్​కౌంటర్​లో హతమయ్యాడు.​ ఝాన్సీలో యూపీ స్పెషల్ టాస్క్​ ఫోర్స్​తో గురువారం జరిగిన కాల్పుల్లో అతడు మరణించాడు. అసద్​తోపాటు గులామ్ అనే మరొక వ్యక్తి కూడా ఎన్​కౌంటర్​లో చనిపోయాడు. ప్రయాగ్​రాజ్​కు చెందిన న్యాయవాది ఉమేశ్​ పాల్​ హత్య కేసులో వీరిద్దరిపై రూ.5లక్షలు చొప్పున రివార్డు ఉంది. మృతుల నుంచి అధునాతన విదేశీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉమేశ్​ పాల్ కిడ్నాప్ కేసులో అతిఖ్​ అహ్మద్​కు ఇప్పటికే జీవిత ఖైదు పడింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నాడు. ఉమేశ్​ పాల్ హత్య కేసుకు సంబంధించి గురువారం అతిఖ్​ను, అతడి సోదరుడు అష్రఫ్​ను ప్రయాగ్​రాజ్​లోని కోర్టుకు తీసుకువచ్చారు. వారు న్యాయస్థానంలో ఉండగానే అసద్​ ఎన్​కౌంటర్​ సమాచారం తెలిసింది. వెంటనే అతిఖ్​ కోర్టులోనే తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది.

atiq ahmed son encounter
అసద్, గులాం ఎన్​కౌంటర్​ జరిగిన ప్రదేశం

అసద్​, గులాం ఎన్​కౌంటర్​పై ఉమేశ్​ పాల్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమారుడికి న్యాయం జరిగిందని ఉమేశ్ తల్లి శాంతి దేవి ప్రయాగ్​రాజ్​లో వ్యాఖ్యానించారు. ఇందుకు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు ధన్యవాదాలు తెలిపారు. ఉమేశ్ భార్య కూడా ఇదే తరహాలో స్పందించారు. మరోవైపు.. అసద్​, గులాం ఎన్​కౌంటర్​ నేపథ్యంలో యూపీ పోలీసులకు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అభినందనలు తెలిపారు. "నిందితులు దాడి చేశాక.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇది నవ భారతం అనే సందేశం.. ఈ ఎన్​కౌంటర్ ద్వారా నేరస్థులకు వెళ్తుంది. యూపీలో యోగి ప్రభుత్వం నడుస్తోంది. నేరస్థులకు రక్షణ కల్పించే సమాజ్​వాదీ పార్టీ ప్రభుత్వం కాదు." అని అన్నారు మౌర్య.

atiq ahmed son encounter
అసద్​ (ఫైల్ ఫొటో)

ఇదీ కేసు..
2005లో బీఎస్​పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకు గురయ్యారు. ఈ కేసులో అతిఖ్​ అహ్మద్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన న్యాయవాది ఉమేశ్ పాల్.. 2006లో కిడ్నాప్​నకు గురయ్యారు. అనంతరం విడుదల అయ్యారు. అతిఖ్​తో పాటు మరికొందరిపై 2007లో ఉమేశ్ పాల్ కేసు పెట్టాడు. విచారణ కొనసాగుతూ ఉండగానే 2023 ఫిబ్రవరి 24న ఉమేశ్​ హత్యకు గురయ్యారు. ప్రయాగ్​రాజ్​లోని ధూమన్​గంజ్ ప్రాంతంలోని ఉమేశ్ ఇంటి వద్ద.. ఆయనతోపాటు ఇద్దరు పోలీసు సెక్యూరిటీ గార్డులను దుండగులు కాల్చి చంపారు. ఉమేశ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 25న పోలీసులు కేసు నమోదు చేశారు. అతిఖ్​ అహ్మద్​, అతడి సోదడురు అష్రఫ్​ అహ్మద్, అతిఖ్​ కుమారుడు అసద్, మక్సూదన్​ కుమారుడు గులాం సహా మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. పరారీలో ఉన్న అసద్​, గులాంపై పోలీసులు రూ.5లక్షలు రివార్డు ప్రకటించారు. డిప్యూటీ ఎస్​పీ నవేందు, విమల్ నేతృత్వంలోని ఉత్తర్​ప్రదేశ్​ స్పెషల్ టాస్క్​ఫోర్స్​ బృందం గాలింపు చర్యలు చేపట్టగా.. గురువారం ఝాన్సీలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో అసద్, గులాం మరణించారు.

atiq ahmed son encounter
గులాం (ఫైల్ ఫొటో)
Last Updated : Apr 13, 2023, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.