ETV Bharat / bharat

గుజరాత్ త్రిముఖ సమరం.. విజేతలను తేల్చే అంశాలివే.. ఓటరు తీర్పు ఎటువైపో?

author img

By

Published : Nov 3, 2022, 10:26 PM IST

gujarath
గుజరాత్​

గుజరాత్​లో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అధికారాన్ని కొనసాగించాలని భాజపా.. కమలదళానికి షాకివ్వాలని కాంగ్రెస్, ఆప్ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో 10 అంశాలు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్​లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో పాగా వేసిన కమలదళం.. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్, భాజపా మధ్య ద్విముఖ పోరు ఉండగా.. తాజాగా ఆప్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. మరి ఈసారి గెలుపెవరిది? ఏ అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయో పరిశీలిస్తే...

1. నరేంద్ర మోదీ:
ప్రధాని పదవి చేపట్టే ముందు గుజరాత్​కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మోదీ. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భాజపా ప్రధాన బలం మోదీ చరిష్మానే. గుజరాత్ విషయంలో ఇది ఇంకొంచెం ఎక్కువగానే పనిచేస్తుంది. గుజరాత్​లో ఆయన కుర్చీని వదిలి ఎనిమిదేళ్లు అవుతున్నా.. సొంత రాష్ట్రంలో పట్టు మాత్రం కోల్పోలేదు. ప్రధాన అనుచరులంతా ఇప్పటికీ ఆయనవెంటే ఉన్నారు. రాబోయే ఈ ఎన్నికలలో మోదీ ప్రభావం అతిపెద్ద నిర్ణయాత్మక శక్తిగా ఉండనుంది అనడంలో సందేహం లేదు.

2. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదల:
బిల్కిస్ బానో అత్యాచార కేసులో దోషులను విడుదల చేయడంపై పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారం మెజారిటీ, మైనారిటీ వర్గాలలో భిన్నమైన ప్రభావం చూపించాయి. ఈ అంశం సైతం అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానుంది.

3. ప్రభుత్వ వ్యతిరేకత:
1998 నుంచి 24 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారం చెలాయిస్తోంది భాజపా. ఇంత సుదీర్ఘ పాలనలో ప్రభుత్వంపై సాధారణంగానే వ్యతిరేకత ఏర్పడుతుంది. కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇనేళ్ల భాజపా పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు అలాగే ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు హరి దేశాయ్ చెబుతున్నారు.

4. మోర్బీ వంతెన ఘటన:
గత నెల 30న మోర్బీలో వంతెన కూలిపోవడం వల్ల 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అధికార యంత్రాంగంలోని లోపాలను ఎత్తిచూపింది. ఈ అంశం సైతం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

5. పేపర్ లీక్‌లు:
ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో తరచూ పేపర్​లు లీక్‌ కావడం, దాంతో నియామక పరీక్షలను వాయిదా వేయడం నిరుద్యోగుల్లో ఆగ్రహానికి దారితీసింది. దీనిపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది యువత ఓట్లపై ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

6. విద్య, వైద్య సదుపాయాల కొరత:
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలను వసతుల కొరత వేధిస్తోంది. అరకొర గదులతో పాఠశాలలు నిర్మించినా.. పలుచోట్ల ఉపాధ్యాయులు ఉండటం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల లేమితో గ్రామీణ ఆరోగ్యం పడకేసింది!

7. రైతు సమస్యలు:
గత రెండేళ్లుగా రాష్ట్రంలో అతివృష్టి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిహారం సైతం ఇవ్వకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

8. అధ్వాన్నమైన రోడ్లు:
గతంలో గుజరాత్ మంచి రోడ్లకు ప్రసిద్ధిగా ఉండేది. అయితే ఐదారేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్లు రోడ్లను నిర్మించడం, పాత రోడ్ల మరమ్మత్తు వంటి పనులు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఫిర్యాదులు సర్వసాధారణంగా మారాయి.

9. అధిక విద్యుత్ రేట్లు:
దేశంలో అత్యధిక విద్యుత్ టారిఫ్‌లు ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ప్రస్తుతం పరిశ్రమలకు యూనిట్‌కు రూ.7.50గా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణలో మాత్రం ఈ ధర యూనిట్‌కు రూ.4గా ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్, ఆప్​లు దూకుడుగా ప్రచారం చేసుకుంటున్నాయి. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న చెబుతున్న ఈ పార్టీల వైపు ప్రజలు చూసే అవకాశం ఉంది.

10. భూసేకరణ:
ప్రభుత్వం వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి భూములు సేకరించింది. దీంతో వారిలో ప్రభుత్వం పట్ల అసంతృప్తి నెలకొంది. అహ్మదాబాద్, ముంబయి మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం చేసిన భూసేకరణను, వడోదర, ముంబై మధ్య ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ కోసం చేసిన భూసేకరణను వారు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

ఈ కీలక అంశాలతో పాటు అనేక విషయాలు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రధాన అంశాలతో పాటు తమకు అనుకూలమైన విషయాలపై ఆయా పార్టీలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు కాకుండా శంకర్‌ సిన్హ్‌ వాఘేలా, కేశుభాయ్‌ పటేల్‌, చిమన్‌ భాయ్‌ పటేల్‌ వంటి నాయకులు స్థాపించిన స్థానిక పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. అయితే, ఆ పార్టీల ప్రభావం నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంది. మైనారిటీలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు ఎంఐఎం సిద్ధమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.