ETV Bharat / bharat

యూపీలో ముస్లింలు ఎటువైపు? యోగి '80-20' వ్యూహం ఫలించేనా?

author img

By

Published : Jan 22, 2022, 5:21 PM IST

Muslim voters support
యూపీలో ముస్లింలు ఎటువైపు?

దేశ రాజకీయాలను శాసించే.. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో ముస్లింలు కీలకం కానున్నారు. వందకుపైగా నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేయగల సత్తా వారికి ఉంది. ఆ స్థాయిలో ప్రభావం చూపే ముస్లిం ఓటర్లు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిపక్షం? గత ఎన్నికల్లో మైనార్టీ ఓట్లలో చీలిక.. హిందువులను సంఘటితం చేయటం ద్వారా అధికారం చేపట్టిన భాజపా.. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తుందా? యూపీ పగ్గాలు తిరిగి చేపట్టాలని పట్టుదలగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ.. ముస్లిం ఓట్లు చీలకుండా ఎలాంటి పావులు కదుపుతోంది? ఒవైసీ ఎక్కువ సీట్లలో పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం? యూపీలో ముస్లిం ఓట్ల కోసం పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలేంటి?

జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. అధికార భాజపా, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. ముస్లిం ఓటు బ్యాంకే కీలకం. ఈ నేపథ్యంలో అధికారం నిలబెట్టుకునేందుకు కమలనాథులు, తిరిగి పగ్గాలు చేపట్టేందుకు అఖిలేశ్​.. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇరుపార్టీలు తమ సంప్రదాయ ఓటుబ్యాంక్‌ను పదిలం చేసుకుంటూ.. వందకుపైగా స్థానాల్లో ప్రాబల్యం చూపే ముస్లిం ఓటర్లపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఆ మేరకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

యూపీలో ముస్లింల ప్రాబల్యం ఇలా..

  • ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం జనాభా 20శాతం
  • 18జిల్లాల్లోని 140కుపైగా నియోజకవర్గాల్లో పార్టీల భవితవ్యాన్ని తేల్చే సామర్థ్యం
  • ముస్లిం జనాభా 20 నుంచి 30శాతం ఉన్న స్థానాలు 70
  • 30శాతానికిపైగా ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గాలు 43
  • 36 చోట్ల అభ్యర్థులను గెలిపించే సంఖ్యలో ముస్లింలు.
  • రాంపూర్, మొరాదాబాద్, ముజఫర్‌నగర్, సహారన్‌పుర్, అమ్రోహ, బిజ్నోర్, మరేలీ, సంబల్, బలరాంపూర్, బహ్రెయిచ్, హాపూర్‌ తదితర జిల్లాల్లో ముస్లిం జనాభా 40శాతం కంటే ఎక్కువే.

ఇంత కీలకమైన ముస్లింలు ఇంతవరకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్నారు. అయితే యూపీలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో.. ఇప్పుడు ఎవరికి మద్దతిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

ముస్లిం ప్రాతినిథ్యం ఇలా..

  • 1991ఎన్నికల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో పెరుగుతున్న ముస్లింల ప్రాతినిథ్యం
  • 1991లో 23మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు.
  • 1993లో 25మంది ముస్లింలు విజయం సాధించారు.
  • 1996లో ఆ సంఖ్య 36కు పెరిగింది.
  • 2002లో 39 మందికి ప్రాతినిధ్యం లభించింది.
  • 2007లో 51 మంది ముస్లింలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
  • 2012లో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య అత్యధికంగా 68కి పెరిగింది.
  • అయితే 2017లో భాజపా ప్రభంజనంతో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 23కు పడిపోయింది.

గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ముస్లింల ప్రాతినిధ్యం పెరిగిన ప్రతిసారి భాజపా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1991లో 221స్థానాలతో భాజపా మొదటిసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు ముస్లిం ఎమ్మెల్యేలు 23మంది గెలుపొందారు.

కమలం బలం తగ్గిన ఎన్నికల్లో ముస్లింల పట్టు పెరిగింది. 2012లో సమాజ్‌వాదీ పార్టీ 224 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, 68 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అప్పుడు భాజపా కేవలం 47 చోట్ల గెలిచింది. 2017లో భాజపా 312 సీట్లు గెలిస్తే.. ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 23కు పరిమితమైంది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొన్న కమలనాథులు.. ఈసారి ముస్లింల ప్రాతినిధ్యం పెరగకుండా ఎత్తులు వేస్తున్నారు.

యోగి '80-20' వ్యూహం..

యూపీ ఎన్నికలు 80శాతం ప్రజలు వర్సెస్‌ 20శాతం ప్రజల మధ్య జరుగుతాయని, భాజపా తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. హిందువుల ఓట్లను సంఘటితం చేసేందుకు కమలం పార్టీ వ్యూహం ఏమిటో.. యోగి వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

ముస్లిం ఓట్లు చీలకుండా ఎస్పీ జాగ్రత్త..

  • గతంలో యాదవ్‌-ముస్లిం ఫార్ములాతో సమాజ్‌వాదీ పార్టీ, దళితులు-బ్రాహ్మణ సోషల్‌ ఇంజినీరింగ్‌తో బీఎస్పీ అధికారం చేపట్టాయి.
  • 2012లో అధికారం చేపట్టిన ఎస్పీ.. ముస్లిం ప్రాబల్యమున్న 140కిపైగా స్థానాల్లో 25.8శాతం ఓట్లతో 28సీట్లు సాధించింది.
  • 2017ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతం 29.6కి పెరిగినా... 17సీట్లే గెలుపొందింది. బీఎస్పీకి 19 శాతం ఓట్లు పోలైనా ఒక్కస్థానం కూడా గెలవలేకపోయింది. ఫలితంగా ఎస్పీ విజయావకాశాలను బీఎస్పీ దెబ్బతీసింది.
  • ముస్లిం ఓటుబ్యాంకులో చీలికతోపాటు హిందువుల ఓట్ల ఏకీకరణతో భాజపా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్‌.. యాదవ-ముస్లిం, జాట్‌-ఓబీసీ ఫార్ములాను అమలు చేస్తున్నారు.

యోగి కేబినెట్‌లో ఓబీసీ వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు అఖిలేశ్​. కాంగ్రెస్‌ నుంచి సలీం ఇక్బాల్‌ షెర్వాణీ, ఇమ్రాన్‌ మసూద్, బీఎస్పీ నుంచి అన్సారీ, కైసర్‌ జహాన్‌కు పార్టీ కండువా కప్పారు. 29మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన అఖిలేశ్​.. అందులో 9మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చారు. జాట్లు, ముస్లింలు ఎక్కువగా ఉన్న పశ్చిమ యూపీలో గట్టి పట్టున్న ఆర్‌ఎల్‌డీతో అఖిలేశ్​ దోస్తీ కట్టారు.

ఈ సారి వందస్థానాల్లో ఒవైసీ పార్టీ పోటీ

2017లో 38 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన ఒవైసీ.. ఒక్క స్థానం కూడా గెలువలేకపోయారు. ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీకి దెబ్బపడింది. పరోక్షంగా భాజపాకు లబ్ధి చేకూరింది. ఈసారి 100స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఓవైసీ ప్రకటించటంతో అప్రమత్తమైన ఎస్పీ అందుకు అనుగుణంగా ఎన్నికల తంత్రాన్ని అమలు చేయటంపై దృష్టి సారించింది. ఈసారి ద్విముఖ పోటీ నెలకొన్న తరుణంలో ముస్లింలు ఏ పార్టీని అందలం ఎక్కిస్తారన్నది త్వరలో తేలనుంది.

ఇదీ చదవండి: యూపీపై ఎంఐఎం గురి- 100 సీట్లలో పోటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.