ఏకంగా సెల్​ టవర్​నే చోరీ చేసిన దొంగలు.. నాలుగు నెలల తర్వాత..

author img

By

Published : Jan 19, 2023, 5:25 PM IST

Mobile Tower Stolen In Bihar

బిహార్​ రాజధాని పట్నాలో మరోసారి ఓ వింత దొంగతనం జరిగింది. ఏకంగా సెల్​ టవర్​నే ఎత్తుకెళ్లారు దొంగలు. నాలుగు నెలల క్రితం ఈ చోరీ జరగ్గా తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది కంపెనీ యాజమాన్యం.

బిహార్‌లో భారీ పరిమాణంలో ఉండే వస్తువుల చోరీకి అడ్డుకట్ట పడటం లేదు. ఐరన్‌ బ్రిడ్జి, రైలు ఇంజన్‌ లాంటి వాటినే దొంగలిస్తున్న కేటుగాళ్లు.. సెల్​ టవర్లనూ వదలడం లేదు. పట్నాలో మొబైల్‌ సెల్​ టవర్ చోరీని చూసి పోలీసులే షాక్​కు గురయ్యారు. ఈ వింత చోరీ సబ్జీబాగ్ ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే..
పట్నాలోని సబ్జీబాగ్​లో ఓ భవనంపై సెల్​ టవర్​ను అమర్చింది జీటీఎల్(గుజరాత్​ టెలీ లింక్​ ప్రైవేట్​ లిమిటెడ్​) కంపెనీ. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం.. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి యజమాని వద్దకు వచ్చి జీటీఎల్ సంస్థ ఉద్యోగులమని పరిచయం చేసుకున్నారు. టవర్​ను రిపేర్​ చేయాలని చెప్పి ఇంటిపైకి వెళ్లారు. నాలుగు గంటలైనా వారు కిందకు రాకపోవడం వల్ల అనుమానం వచ్చిన ఓనర్​ పైకి వెళ్లి చూడగా టవర్​ను విడి భాగాలుగా చేసి ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించాడు. వెంటనే కంపెనీ మేనేజర్​కు సమాచారం అందించాడు యజమాని. అనంతరం కంపెనీ మేనేజర్ దొంగలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

అపహరణకు గురైన సెల్​ టవర్​ను 2006లో ఏర్పాటు చేశామని, ఈ ఘటన నాలుగు నెలల క్రితం జరిగిందని కంపెనీ మేనేజర్​ తెలిపారు. ఈ విషయంపై కంపెనీయే అంతర్గతంగా నాలుగు నెలలు విచారణ జరిపిందని వెల్లడించారు. అయితే, తమకు ఎటువంటి ఆచుకీ లభ్యం కాలేదని చెప్పారు. చివరకు చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించింది కంపెనీ. సెల్​ టవర్​ విలువ రూ.8.32 లక్షలు ఉంటుందని సమాచారం. కాగా, పట్నాలో మొబైల్ టవర్ దొంగతనం జరగడం ఇది రెండో సారి. 2022 నవంబర్​లో రూ.19 లక్షల విలువైన టవర్​ చోరీకి గురయింది. ఇది కూడా జీటీఎల్​ కంపెనీదే కావడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.