ETV Bharat / bharat

చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​.. ఓటింగ్​ శాతం ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 5:00 PM IST

Updated : Nov 30, 2023, 10:59 PM IST

Telangana Assembly Elections Polling 2023 Ended : అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన ఓటింగ్‌.. చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది. 3 కోట్లకు పైగా ఓటర్లు.. తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ పూర్తైంది. ఈ సమయం వరకు క్యూలైన్​లో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. బరిలో ఉన్న 2 వేల 290 మంది అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది.

Telangana Assembly Elections Polling 2023 Ended
Telangana Assembly Elections

చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​.. ఓటింగ్​ శాతం ఎంతంటే?

Telangana Assembly Elections Polling 2023 Ended : చెదురుమదురు ఘటనల మధ్య రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో.. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాత్రి 11 గంటల వరకు 70.12 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఇంకా ఈ పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా.. ఒక ట్రాన్స్​జెండర్ ఉన్నారు.

ఓటెత్తిన రాజకీయ ప్రముఖులు - సీఎం కేసీఆర్​ సహా ఎవరెవరు వేశారో మీరు చూశారా?

Telangana Assembly Elections 2023 : బీఆర్​ఎస్​ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయగా.. 118 చోట్ల కాంగ్రెస్, 111 చోట్ల బీజేపీ పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనసేన 8 స్థానాల్లో బరిలో నిలిచింది. సీపీఎం 19, సీపీఐ ఒకచోట, బీఎస్పీ నుంచి 108 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్‌లో 48 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడల్లో కేవలం ఏడుగురు మాత్రమే బరిలో నిలిచారు.

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు స్థానిక సంస్కృతిని చాటేలా 644 మోడల్ పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు, 119 కేంద్రాలను పూర్తిగా యువ ఉద్యోగులే నిర్వహించారు. ఎన్నికల కోసం 2 లక్షల 433 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగించారు. రాష్ట్రంలో 12,570 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకున్నా.. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసినట్లు అధికారులు తెలిపారు.

అదృష్ట పరీక్షలో ఏడుగురు ఎంపీలు - 104 మంది ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2 వేల 799 కాగా.. పురుషులు కోటీ 62 లక్షల 98 వేల 418 మంది ఉన్నారు. మహిళలు కోటీ 63 వేల 1705 మంది, ట్రాన్స్​జెండర్లు 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 15,406 కాగా.. ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు వారి సంఖ్య 9 లక్షల 99 వేల 667. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని.. 59 వేల 779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగించారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 75 వేల 464 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. 44 వేల 828 కంట్రోల్ యూనిట్లు, 49 వేల 460 వీవీప్యాట్ యంత్రాలను వినియోగించారు. ఈవీఎం యంత్రాలకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరి చేసేందుకు వీలుగా 400కు పైగా ఈసీఐఎల్​ ఇంజినీర్లు తమ సేవలు అందించారు.

సిరా చుక్కతో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేశారంటే?

Last Updated : Nov 30, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.