ETV Bharat / bharat

'అది మా తాత జాగీరు'... ప్రభుత్వ ఆస్తిని అమ్మేసిన మనవడు

author img

By

Published : Jun 16, 2022, 12:19 PM IST

Sub Health Center land sold
Sub Health Center land sold

Bihar health clinic sold: బిహార్​లో ప్రభుత్వ ఆస్తి విక్రయించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి దానంగా లభించిన స్థలాన్ని ఓ వ్యక్తి ఇతరులకు విక్రయించాడు. అది తన కుటుంబ ఆస్తి అని చెబుతున్నాడు.

Bihar govt land sold: బిహార్​లో ప్రజా ఆస్తులకు రక్షణ కరవైంది. పంచాయతీ కార్యాలయాలు, బ్రిడ్జిలు, రైల్ఇంజిన్లు.. ఇలా విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడు. తాజాగా ప్రభుత్వ స్థలాన్ని ఓ వ్యక్తి విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముజఫర్​పుర్​లోని మధురాపుర్​లో ఉన్న ఓ క్లినిక్​తో పాటు దానికి ఆనుకొని ఉన్న స్థలాన్ని కూడా అమ్మేశారు. ఆ స్థలం తన కుటుంబ ఆస్తి అని విక్రయించిన వ్యక్తి చెబుతున్నాడు.

Sub-Health Center land Jagdishpur Panchayat Sold In Muzaffarpur
ప్రభుత్వ క్లినిక్

స్థలం నేపథ్యమిది..
1995 డిసెంబర్ 8న భూస్వామి రాంవిలాస్ సింగ్.. ఖాతా నెం 85లోని 1303, 1298 నెంబర్లతో నమోదైన భూములను బిహార్ ప్రభుత్వానికి దానం ఇచ్చారు. ఈ స్థలాల్లో ప్రభుత్వాలు ఓ కమ్యూనిటీ హాల్, సబ్ హెల్త్ క్లినిక్​లను నిర్మించాయి. అయితే రాంవిలాస్ సింగ్ మనవడు మున్నా సింగ్.. 1303 నెంబర్​లోని 7 సెంట్ల భూమిని 2021 డిసెంబర్ 8న అదే గ్రామానికి చెందిన హరేంద్ర రాయ్​కు విక్రయించేశాడు. తాను కొనుగోలు చేసిన స్థలాన్ని వినియోగదారుడు అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఈ విషయంలో తగాదాలు రాగా.. భూరికార్డులను పరిశీలించారు. దానం చేసిన భూమిని విక్రయించినట్లు రికార్డుల్లో తేలింది. అయితే, తన తాత దానం చేసిన భూమికి అనుబంధంగా ఉన్న స్థలాన్నే తాను విక్రయించానని మున్నా సింగ్ తెలిపారు. అది తమ పేరుమీదే రిజిస్టర్ అయి ఉందని స్పష్టం చేశారు.

"ఇది మా కుటుంబానికి చెందిన భూమి. కమ్యూనిటీ భవనం కోసం ఏడు సెంట్ల భూమిని మా తాత దానం చేశారు. పేపర్ల ప్రకారం వంశపారపర్యంగా వస్తున్న ఆస్తిలో రెండు సెంట్లు మా పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. కానీ, అక్కడి స్థానికులు ఆ భూమంతా ప్రభుత్వానిదేనని అంటున్నారు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఏడు సెంట్ల భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. భూమిని కొలిచిన తర్వాత ఎంతైతే మిగులుతుందో అది మా పూర్వీకుల ఆస్తి అవుతుంది. దీనిపై వివాదాలు అవసరం లేదు. దీనిపై మేం పేపర్లు కూడా చూపించాం. త్వరలోనే దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం."
- మున్నా సింగ్, భూమిని విక్రయించిన వ్యక్తి

Bihar health clinic sold: ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని.. ఎవరైనా తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకుంటామని బిహార్ రెవెన్యూ శాఖ మంత్రి రామ్​సూరత్ రాయ్ తెలిపారు. ల్యాండ్ మ్యుటేషన్లు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతోందని చెప్పారు. మరోవైపు, రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ రికార్డులను పరిశీలించకుండానే భూమిని విక్రయించారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై తమకు ఫిర్యాదు అందిందని.. భూమిని త్వరలో కొలుస్తామని చెప్పారు.

Bihar rail engine sold: ఇటీవల బిహార్​లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ముజఫర్​పుర్ జిల్లాలోని జమరువా గ్రామ పంచాయతీలో హెల్త్​ సెంటర్ భవనాన్ని దుండగులు విక్రయించారు. నాలుగున్నర దశాబ్దాలుగా నడుస్తున్న ఆ క్లీనిక్​ను అమ్మేశారు. మరోవైపు, రైల్వే శాఖలో ఇంజినీర్​గా పనిచేసే ఓ వ్యక్తి.. ఏకంగా రైలు ఇంజిన్నే అమ్మేశాడు. ఓ ఇన్​స్పెక్టర్, హెల్పర్​ సాయంతో గుట్టుచప్పుడు కాకుండా రైలు ఇంజిన్​ను పాతసామాన్లు కొనే ఓ మాఫియాకు అమ్మేశారు. ఈ వార్త పూర్తి కథనం కోసం లింక్​పై క్లిక్ చేయండి.
మరో ఘటనలో.. గ్రామ పెద్ద, కార్యదర్శి కలిసి పంచాయతీ భవనాన్నే అమ్మేశారు. బిహార్ రెవెన్యూ మంత్రి రామ్​సూరత్ రాయ్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగింది. ఈ వార్త కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: 80 అడుగుల మరో వంతెన మాయం.. ఈసారి పక్క జిల్లాలో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.