ETV Bharat / bharat

పసికందును చంపేసిన వీధి కుక్కలు.. ఆస్పత్రిలో అమ్మ పక్కన నిద్రపోతుంటే..

author img

By

Published : Feb 28, 2023, 5:50 PM IST

Updated : Feb 28, 2023, 7:27 PM IST

Street dogs maul infant to death after taking away from hospital ward in Rajasthan
రాజస్థాన్​లో వీది కుక్కల ఆహారంగా ఒక నెల పసికందు

రాజస్థాన్​లో హృదయ విదారకమైన సంఘటన జరిగింది. ఆస్పత్రిలో తల్లి పక్కన నిద్రిస్తున్న ఒక నెల పసికందును వీధి కుక్కలు ఎత్తుకెళ్లి, కరిచి చంపేశాయి.

ఒక నెల వయసున్న పసికందును వీధి కుక్కలు కిరాతకంగా కరిచి చంపేశాయి. రాజస్థాన్​లోని సిరోహి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిందీ ఘటన. ఆస్పత్రి వార్డులో సిబ్బంది ఎవరూ లేని సమయంలో.. తల్లి పక్కన పడుకున్న చంటి పాపను వీధి కుక్కలు ఎత్తుకెళ్లి చంపేశాయి. ఈ ఘటనతో ఆ చిన్నారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

తండ్రి కోసం వచ్చి..
చనిపోయిన పసికందు తండ్రి మహేంద్ర మీనా సిరోహి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సిలికోసిస్ చికిత్స కోసం సోమవారం చేరాడు. మహేంద్రతో పాటు భార్య రేఖ, వారి ముగ్గురు పిల్లలు కూడా ఆస్పత్రికి వచ్చారు. సోమవారం రాత్రి ఆస్పత్రి వార్డులో అందరూ నిద్రపోయారు. చిన్నపాప తల్లి దగ్గర పడుకుంది. ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. వార్డులో సిబ్బంది పక్క వార్డులోకి వెళ్లిన సమయంలో రెండు కుక్కలు ఆస్పత్రి టీబీ వార్డులోకి ప్రవేశించాయి. దానిలో ఒక కుక్క పసిపాపను పట్టుకొని బయటకు వచ్చినట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారా తెలిసింది. రాత్రి 2 గంటల సమయంలో రేఖ నిద్రలేచింది. పక్కన చూస్తే చిన్నారి లేదు. వార్డు బయటకు వచ్చిన రేఖ.. చిన్నారిని వీధి కుక్కలు కరుస్తున్న దృశ్యాలు చూసి నివ్వెరపోయింది. వాటిని తరిమేసింది. కానీ.. ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు.

"పసిపాప తండ్రి మహేంద్ర మీనా సోమవారం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. వీధి కుక్క ఆస్పత్రి వార్డులోకి వచ్చి పాపను ఎత్తుకెళ్లి కరుస్తున్న సమయంలో అక్కడ సిబ్బంది కూడా లేరు. మెడికల్ బోర్డు చిన్నారి మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము." అని స్థానిక పోలీస్ అధికారి సీతారాం తెలిపారు.

"సోమవారం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. చాలా సార్లు కుక్కలు ఆస్పత్రి వార్డులోకి వచ్చాయి. కొన్ని సార్లు నేను వాటిని తరిమేశాను కూడా. నా భార్య రాత్రి 2 గంటల సమయంలో లేచి చూడగా చిన్నారిని కుక్క ఎత్తుకెళ్లి కరిచి చంపేశాయి. నాకు తెలియకుండా నా భార్యతో ఖాళీ పేపరు మీద సంతకం పెట్టించుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షలకు పంపించి, అంత్యక్రియలు నిర్వహించారు. కనీసం చివరి చూపు కూడా చూడనీయకుండా చేశారు" అని చిన్నారి తండ్రి ఆస్పత్రి అధికారులను, పోలీసులను నిందించాడు.

ఈ వ్యవహారంపై ఆస్పత్రి యాజమాన్యం కూడా విచారణ ప్రారంభించింది. "ఆ ఘటన సమయంలో ఆస్పత్రిలోని అటెండర్ నిద్రపోయి ఉన్నాడు. వార్డు సిబ్బంది కూడా వేరే వార్డులో ఉన్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను నేను చూడలేదు. పూర్తిగా దర్యాప్తు పూర్తయిన తర్వాతనే ఈ విషయంపై మాట్లాడతాను." అని సిరోహి జిల్లా ఆస్పత్రి యాక్టింగ్ ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ (పీఎమ్​ఓ) వీరేంద్ర చెప్పారు.

ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ్ పురోహిత్ ఆస్పత్రి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 'ఈ దుర్ఘటనకు ఆస్పత్రి అధికారులే బాధ్యత వహించాలి. ఇది పూర్తిగా ఆస్పత్రి పాలకవర్గం వైఫల్యం. ఆసుపత్రిలో వీధి కుక్కలు సంచరిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.' అని నారాయణ్ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు.

Last Updated :Feb 28, 2023, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.