ETV Bharat / bharat

దిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. విచారణకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి

author img

By

Published : Apr 18, 2022, 4:43 PM IST

Stone pelting in Jahangirpuri: దిల్లీలోని జహంగీర్​పుర్​లో మరోమారు రాళ్లదాడి జరిగింది. హనుమాన్​ జయంతి ఘర్షణలపై విచారణ చేపట్టేందుకు వెళ్లిన పోలీసు బృందంపై అనుమానితుడి కుటుంబ సభ్యులు రాళ్లు రువ్వారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. మరోవైపు.. గుజరాత్​, వడోదర నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం మత ఘర్షణలకు దారి తీసింది.

Stone pelting in Jahangirpuri
పోలీసులపై రాళ్ల దాడి

Stone pelting in Jahangirpuri: హనుమాన్​ జయంతి రోజున దిల్లీలోని జహంగీర్​పురి శోభయాత్రలో జరిగిన ఘర్షణపై విచారణ చేపట్టేందుకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. శోభయాత్ర ఘర్షణలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఇంటికి వెళ్లిన క్రమంలో పోలీసులపై అతడి కుటుంబ సభ్యులు రాళ్లు రువ్వినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే.. ఇది చాలా చిన్న సంఘటన అని, ఓ వ్యక్తిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు.

Stone pelting in Jahangirpuri
జహంగీర్​పుర్​లో పోలీసు బలగాలు

" సీడీ పార్క్​ రోడ్​లోని అనుమానితుని కుటుంబ సభ్యులను విచారించేందుకు అతడి ఇంటికి వాయవ్య జిల్లా పోలీసుల బృందం వెళ్లింది. పోలీసులపై నిందితుడి కుటుంబ సభ్యులు రాళ్ల దాడి చేశారు. చట్టపరమైన చర్యలు చేపట్టాం. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశాం. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. తాజాగా జరిగిన రాళ్లదాడికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇది చాలా చిన్న సంఘటన. "

- ఉషా రంగ్నాని, డీసీపీ(వాయవ్య జిల్లా).

గత శనివారం హనుమాన్​ జయంతి శోభయాత్రలో జరిగిన హింసాత్మక ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నీలిరంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడినట్లు ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా పోలీసు దర్యాప్తు బృందంపై రాళ్లదాడిలో మరోమారు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు అధికారులు. ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు దిల్లీ పోలీస్​ కమిషనర్​ రాకేశ్​ ఆస్థానా. 'ఘటన జరిగిన ప్రాంతాన్ని ఈరోజు నాలుగు ఫోరెన్సిక్​ బందాలు క్షుణ్నంగా పరిశీలించాయి. వివిధ కోణాల్లో ఈ కేసుపై 14 బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. 21 మందిని అరెస్ట్​ చేశాం. మరికొంత మందిని రిమాండ్​కు తరలించాం.' అని పేర్కొన్నారు.

Stone pelting in Jahangirpuri
భారీగా బలగాల మోహరింపు

గుజరాత్​లో మత ఘర్షణలు: ఓ రోడ్డు ప్రమాదం మత ఘర్షణలకు దారి తీసిన సంఘటన గుజరాత్​లోని వడోదరా నగరంలో సోమవారం జరిగింది. రెండు వర్గాలకు సంబంధించిన ద్విచక్రవాహనాలు ఆదివారం రాత్రి రావుపురా ప్రాంతంలో ప్రమాదానికి గురికాగా.. ఆ వెంటనే ఇరువర్గాలకు సంబంధించినవారు అక్కడికి చేరుకుని రాళ్లదాడి చేసుకున్నారు. పలు వాహనాలు సహా రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిలోని విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణల్లో ముగ్గురు గాయపడినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 22 మంది మందిని అరెస్ట్​ చేయగా.. ఆదివారం రాత్రి జరిగిన అల్లర్లకు సంబంధించి 19 మంది, రోడ్డు ప్రమాదానికి సంబంధించి ముగ్గురు ఉన్నారు. భద్రత బలగాలను మోహరించి పరిస్థితిని అదుపు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 'కుట్ర ప్రకారమే శోభా యాత్ర వేళ ఘర్షణలు.. పోలీసులు అలర్ట్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.