ETV Bharat / bharat

హిమాచల్​లో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. కొట్టుకుపోయిన వంతెన, కార్లు!

author img

By

Published : Jul 9, 2023, 6:14 PM IST

Updated : Jul 9, 2023, 8:03 PM IST

Himachal Pradesh Rains : హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదుల్లో ఉద్ధృతి పెరగ్గా.. అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి.. ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పలు ఇళ్లు నేలమట్టం కాగా అనేక చోట్ల రైలు పట్టాలపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. మూడు వేర్వేరు జిల్లాలో కొండచరియలు ఇళ్లపై పడి.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విద్యాసంస్థలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది.

Himachal Pradesh Rains
Himachal Pradesh Rains

హిమాచల్​లో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. కొట్టుకుపోయిన వంతెన, కార్లు!

Himachal Pradesh Rains : రెండు రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకు.. జనజీవనం అస్తవ్యస్థమైంది. అసలే కొండ ప్రాంతం కావడంతో వర్షాలకు వరదలు పోటెత్తాయి. కుల్లులో కొండచరియలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బియాస్‌ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బియాస్‌ నదిలో ప్రవాహం భారీగా పెరగడం వల్ల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

కొట్టుకుపోయిన వంతెన..
మండిలో బియాస్‌ నది ఉద్ధృతికి పండో బజార్‌ ప్రాంతం నీట మునిగింది. బియాస్‌ నదిపై ఔట్‌-బంజార్ ప్రాంతాలను అనుసంధానించే పాతవంతెన ప్రవాహంలో కొట్టుకుపోయింది. మండిలోని పంచ్‌వక్త్ర ఆలయాన్ని.. బియాస్ నది నీరు చుట్టుముట్టింది. సిమ్లా-కల్కా మార్గంలో అన్ని రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.

Heavy loss due to rain in Himachal Pradesh
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది

హిమాచల్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. అటల్ టన్నెల్‌కు కిలోమీటరు దూరంలో టైలింగ్ నాలా వరద కారణంగా.. మనాలీ-లేహ్‌ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఉదయ్‌పుర్‌లోని మద్రంగ్ నాలా, కాలా నాలా వరదలతో పలు రోడ్లను మూసివేశారు. సొలన్ జిల్లా కసౌలి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం నిర్మాణరంగ కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మనాలీ వద్ద తారామిల్ ప్రాంతంలో జాతీయ రహదారి 3లో కొంతభాగం కోతకు గురైంది.

Heavy loss due to rain in Himachal Pradesh
కూలిపోయిన ఇళ్లు

విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు బలి..
Himachal Land Slide : సిమ్లా, సిర్మౌర్‌, లాహౌల్‌ స్పితి, చంబా, సొలన్ జిల్లాలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సిమ్లా జిల్లాలోని కోట్​గడ్​లో ఇంటిపై కొండచరియలు పడి దంపతులు, వారి కుమారుడు సహా ముగ్గురు చనిపోయారు. కుల్లు పట్టణంలోని ఒక నివాసంపై కొండచరియలు పడగా మహిళ మృతి చెందింది. మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. చాంబా జిల్లాలోని కతియాన్ తెహశీల్ వద్ద కొండచరియలు విరిగిపడి.. ఒకరు సజీవసమాధి అయ్యారు. కుల్లు జిల్లాలోని కసోల్ ప్రాంతంలో పలు వాహనాలు బియాస్‌ నది కొట్టుకుపోయాయి.

భారీ వర్షాలు.. రూ.362 కోట్ల నష్టం!
Heavy Rain in Himachal : భారీ వర్షాల కారణంగా సిమ్లా నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగింది. కసౌలి, కల్కా, సిమ్లాలో జాతీయ రహదారి 5పై కొండ చరియలు విరిగిపడ్డాయి. కుమ్హరహట్టి బైపాస్‌పై విరిగిపడిన కొండచరియలు వాహనదారులను భయపెట్టాయి. కొద్ది తేడాతో కొండచరియల నుంచి అటుగా వెళుతున్న వాహనాలు తప్పించుకున్నాయి. జాతీయ రహదారి 5పై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని.. సోలన్ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఈ వర్షాకాల సీజన్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌లో.. ఇప్పటివరకూ 362 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

శుక్రవారం నుంచి హిమాచల్​వ్యాప్తంగా 14 చోట్ల భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడగా.. 13 చోట్ల అకస్మిక వరదలు పోటెత్తినట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ఎమర్జీన్సీ ఆపరేషన్స్ సెంటర్ ప్రకటించింది. 700 రహదారులను మూసివేసినట్లు వివరించింది. హిమాచల్‌లో అన్ని నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నట్లు వెల్లడించింది. హిమాచల్‌లో మొత్తం 12కు పది జిల్లాలకు వాతావరణ విభాగం తాజాగా రెడ్‌ అలర్ట్ జారీచేసింది. లాహౌల్ స్పితిలోని చంద్రతాల్‌లో 200 మంది చిక్కుకుపోగా వారంతా క్షేమంగానే ఉన్నారని, వారికి అవసరమైన మందులు, ఆహారం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్​పీ వివరించారు.

Last Updated :Jul 9, 2023, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.