ETV Bharat / bharat

ఆ హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీల్ని అడ్డుకోలేమన్న సుప్రీంకోర్టు

author img

By

Published : Aug 17, 2022, 6:20 PM IST

supreme court
సుప్రీంకోర్ట్

రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది.

Freebies Supreme court: పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి.. ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది. ఈ ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రయోజనాల కోసం ఓటర్లకు ఉచితాలను పంపిణీ చేయడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా మేం అడ్డుకోలేం. అయితే ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పడం సరికాదు. కొన్ని పార్టీలు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికల్లో గెలవలేకపోతున్నాయి. అంతేగాక, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలు పౌరులు గౌరవంగా జీవించేందుకు దోహదపడుతున్నాయి’’
-చీఫ్‌ జస్టిస్‌ ఎన్.వి. రమణ

special committee on freebies: ‘‘అయితే.. ఏది సరైన హామీ అనేదే ఇక్కడ ప్రశ్న. ఉచిత విద్య, వైద్యం, తాగునీరు అందించడం వంటి వాటిని ఉచితాలుగా పరిగణించాలా? కన్స్యూమర్‌ ఉత్పత్తులు, ఉచిత ఎలక్ట్రానిక్‌ వస్తువులను సంక్షేమ పథకాలుగా అభివర్ణించాలా? ప్రజాధనాన్నిఖర్చు చేయడానికి సరైన మార్గం ఏంటనేదానిపై మనం దృష్టిపెట్టాలి. ఉచితాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరికొందరేమో అవన్నీ సంక్షేమ పథకాలని చెబుతున్నారు. దీంతో ఈ అంశం సంక్లిష్టంగా మారుతోంది. అందుకే ఉచితాలపై చర్చించి సూచనలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనిపై మీ సలహాలు ఇవ్వండి’’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ వ్యాజ్యదారులకు సూచించారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

ashwini kumar petition: ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండడానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మేనిఫెస్టోలను నియంత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని నిర్దేశించాలని, ఇలాంటి ఉచిత వాగ్దానాలకు రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేయాలని అశ్వినీకుమార్‌ కోరారు. ఈ పిటిషన్‌లో వాదనల కోసం తమను కూడా చేర్చుకోవాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌, డీఎంకే కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై గతంలో వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు చేసే ఉచిత వాగ్దానాల అంశాన్ని పరిశీలిస్తామని, ఆ అంశంలో నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలను రద్దు చేయాలన్న విజ్ఞప్తి జోలికి మాత్రం వెళ్లబోమని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి

ఆరోగ్యశ్రీలో చికిత్సల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించిన సీఎం

Siima Awardsలో అఖండ, పుష్ప జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.