'కొవిడ్ పరిహారాన్ని ప్రధానే వద్దన్నారా?'

author img

By

Published : Jun 21, 2021, 6:07 PM IST

Supreme court

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వొద్దని ప్రధాని నేతృత్వంలోని ఎన్​డీఎంఏ నిర్ణయించిందా' అని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ప్రకృతి విపత్తులతో మరణించిన వారికి పరిహారం పొందే హక్కుందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు విపత్తులను ఎదుర్కోవటానికి ఆర్థిక సంఘం​ సిఫార్సులు చేసినట్లు తెలిపింది.

కొవిడ్​ మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. 'బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వొద్దని ప్రధాని నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్​డీఎంఏ) చెప్పిందా' అంటూ ప్రశ్నించింది. ఈ పరిహారాన్ని బాధితుల గుండెల్లో బాధను నివారించడానికి ఒక పరిహార పథకంగా పరిగణించవచ్చని వ్యాఖ్యానించింది.

తలకు మించిన భారం

అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందించలేమని ఇప్పటికే ప్రమాణ పత్రం దాఖలు చేసింది కేంద్రం. పరిహారం చెల్లించడం.. ఆర్థిక స్థోమతకు మించి భారం మాత్రమే కాదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. తమ వద్ద అంత డబ్బు లేదని కేంద్రం.. సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఎన్​డీఎంఏ వద్దని చెప్పిందా?

"మీరు (కేంద్రం) స్పష్టత ఇవ్వడం సరైనదే. ప్రభుత్వం డబ్బు లేదని చెప్పడంలో విస్తృతమైన పరిణామాలు ఉన్నాయి" అని జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఎంఆర్​ షాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. అయితే విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్​ 12 ప్రకారం.. ప్రకృతి విపత్తులతో మరణించిన వారికి పరిహారం పొందే హక్కుందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు విపత్తులను ఎదుర్కోవటానికి ఆర్థిక సంఘం​ సిఫార్సులు చేసినట్లు తెలిపింది. అయితే "పరిహారం ఇవ్వకూడదని ప్రధాని నేతృత్వంలోని ఎన్​డీఎంఏ ఏదైనా నిర్ణయం తీసుకుందా?" అని కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.

ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ, విపత్తు నిర్వహణ ప్రత్యేక విభాగం తీసుకున్న నిర్ణయాల గురించి కోర్టుకు వెల్లడించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. కరోనా విధులు నిర్వహిస్తున్న 22 లక్షల మంది వైద్య సిబ్బందికి బీమా పథకాన్ని వర్తింపజేసినట్లు తెలిపారు.

సరళతరం చేయండి

కరోనా కారణంగా మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రాలను మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కొవిడ్​ బాధితులపై ఆధారపడినవారు అటువంటి ధృవీకరణ పత్రాలను జారీ చేసిన తర్వాత కూడా సవరణలు చేయడాన్ని సరళీకృతం చేయాలని కేంద్రాన్ని సూచించింది. తద్వారా లబ్ధిదారులు.. సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందగలరని పేర్కొంది. సామాన్యుల దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను సరళతరం చేయాని సూచించింది. అలాగే అందరికి సమానంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు చట్టం చేయాలని పేర్కొంది.

కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పును రిజర్వ్​ చేసింది.

ఇదీ చూడండి: సీబీఎస్​ఈ క్లాస్​-12 గ్రేడింగ్​పై సుప్రీం కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.