ETV Bharat / bharat

లక్ష జనాభా పైబడిన పట్టణాల్లో 24 గంటలూ విద్యుత్తు!

author img

By

Published : Apr 23, 2022, 7:35 AM IST

power supply
లక్ష జనాభా పైబడిన పట్టణాల్లో 24 గంటలూ విద్యుత్తు

లక్ష జనభా గల పట్టణాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్తు శాఖ నిర్దేశించింది. అక్కడ కరెంటు పోతే మూడు నిమిషాల్లోని పునరుద్ధరించాలని తెలిపింది. ఈ మేరకు విద్యుత్‌ వినియోగదారుల హక్కుల నియమావళి-2020కి సవరణ చేస్తూ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది

దేశంలో లక్ష, అంతకు మించి జనాభా ఉన్న పట్టణాల్లో డిస్కంలు 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్తు శాఖ నిర్దేశించింది. తాత్కాలిక అవసరాలకు ఎవరైనా కరెంటు కనెక్షన్‌కు దరఖాస్తు చేస్తే 48 గంటల్లోగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు విద్యుత్‌ వినియోగదారుల హక్కుల నియమావళి-2020కి సవరణ చేస్తూ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. కొన్ని కొత్త నిబంధనలను ఇందులో చేర్చింది. వీటిని తక్షణం అమల్లోకి తెస్తూ ప్రతి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) సంబంధిత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఆదేశాలివ్వాలని స్పష్టం చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం..: లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో కాలుష్యం తగ్గించేందుకు డీజిల్‌ జనరేటర్ల వినియోగాన్ని నియంత్రించాలి. ఇది జరగాలంటే పట్టణాల్లో కరెంటు నిరంతర సరఫరాకు డిస్కంలు చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇలాంటి పట్టణాల్లో ఏదైనా ఒక ప్రాంతంలో కరెంటు సరఫరా నిలిపివేయాల్సి వస్తే ఎంత సమయం ఆపాలో రాష్ట్ర ఈఆర్‌సీ నిర్ణయించాలి. అలాగే సరఫరా నిలిపివేతకు సగటు సమయాలను ఈఆర్‌సీ నిర్ణయిస్తే వాటిని డిస్కంలు పాటించాలి.ఏదైనా ఒక ప్రాంతంలో కరెంటు పోతే 3 నిమిషాలలోపు పునరుద్ధరించాలి. అప్పుడే నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతున్నట్టుగా భావించాలి.

కాలుష్యాన్ని తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా డీజిల్‌ జనరేటర్లకు బదులు సౌర, పవన విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధనాన్ని బ్యాటరీ బ్యాకప్‌ సదుపాయంతో వినియోగించేలా చూడాలి. ఈ నెల 20 నుంచి ఐదేళ్లలోగా పట్టణాల్లో డీజిల్‌ జనరేటర్లు వాడే వారంతా సంప్రదాయేతర ఇంధన వినియోగంలోకి మారేలా చూడాలి. ఎక్కడైనా కొత్త నిర్మాణాలు చేపట్టేవారు లేదా ఇతర కారణాలతో తాత్కాలిక అవసరాలకు కరెంటు కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేస్తే 48 గంటలలోగా ఇవ్వాలి. ఒకవేళ ఆ ప్రాంతంలో విద్యుత్‌ లైన్ల వంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరముంటే గరిష్ఠంగా 7 రోజుల్లో కనెక్షన్‌ ఇవ్వాలి. ఇలా ఇచ్చే తాత్కాలిక కనెక్షన్‌కు తప్పనిసరిగా ప్రీపెయిడ్‌ మీటరునే ఏర్పాటుచేయాలి.

3 చోట్ల 'ఉత్పత్తుల జోన్‌': విద్యుత్‌ పరికరాల తయారీ పరిశ్రమల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా 3 చోట్ల ‘ఉత్పత్తుల జోన్‌’ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది. ఈ జోన్‌ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న రాష్ట్రాలవారు దరఖాస్తు చేయాలని, దీనిపై అవగాహనకు ఈ నెల 27న సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. ఈ జోన్‌ ఏర్పాటైతే అక్కడ విద్యుత్‌ పరికరాల తయారీ పరిశ్రమలు వస్తాయని వివరించింది.

ఇదీ చదవండి: పరిష్కారమే పరమావధిగా.. సీజేఐ జస్టిస్​​ రమణ నిర్విరామ కృషి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.