ETV Bharat / bharat

'శివసేన గుర్తు కోసం రూ.2వేల కోట్ల ఒప్పందం.. ఒక్కో ఎంపీకి రూ.100 కోట్లు'

author img

By

Published : Feb 19, 2023, 7:19 PM IST

sanjay-raut-comments-on-election-comition-shiv-sena-party-bow-and-arrow-symbol
విల్లు బాణం గుర్తు కోసం రూ.2000 కోట్ల ఒప్పందం

శివసేన పేరు, గుర్తు కొనుగోలుకు రూ.2,000 కోట్లు ఒప్పందం జరిగిందని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అందుకే ఈసీ.. శిందేకు శివసేన పేరు, గుర్తులను కేటాయించిందని అన్నారు.

శివసేన పేరు, పార్టీ గుర్తును.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటనపై ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ పేరు, గుర్తు 'విల్లు- బాణం' కోసం రూ.2000 కోట్ల ఒప్పందం జరిగిందని ఆరోపించారు. రూ.2,000 కోట్లు అనేది ప్రాథమిక అంచనా అని.. ఇది 100 శాతం నిజమని సంజయ్​ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. భాజపాపై విమర్శలు గుప్పించారు.

ఎన్నికలు సంఘం 'విల్లు-బాణం' గుర్తులను శిందే వర్గానికి కేటాయించడం ఓ ఒప్పందం. ఈ ఒప్పందం విలువ ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారు? నాకు అందిన సమాచారం ప్రకారం.. రూ.2,000 కోట్లు. ఎన్నికల గుర్తు, పేరు కోసం ఇంత మొత్తం లావాదేవీ జరిగింది. ఆరు నెలల వ్యవధిలో ఈ లావాదేవీలు పూర్తి చేశారు. ఈ సమాచారం 100 శాతం నిజం. దేశ చరిత్రలో ఇలా ఎన్నడూ జరలేదు.
-సంజయ్ రౌత్, ఎంపీ

ఈసీ నిర్ణయం అనంతరం సత్యమేవ జయతే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు చేశారు సంజయ్ రౌత్. సత్యాన్ని, న్యాయాన్ని డబ్బుతో కొనేవారి గురించి మాట్లాడబోనని అన్నారు. "'సీఎం పదవి కోసం ఉద్ధవ్‌ ఠాక్రే.. కాంగ్రెస్​, ఎన్సీపీల కాళ్లు పట్టుకుంటున్నారు' అని అమిత్​ షా అన్నారు. మరి ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌ శిందే ఏం చేస్తున్నారు? మహారాష్ట్ర ప్రజలు అమిత్​ షా మాటలను పట్టించుకోరు. మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనేది ప్రజలే నిర్ణయిస్తారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను భాజపా పెద్ద ఎత్తున డబ్బు పెట్టి కొనుగోలు చేస్తోంది. ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, ఎంపీకి రూ.100 కోట్లు, కౌన్సిలర్లకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఇచ్చారు" అని ఆరోపించారు.

అయితే రౌత్ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడ్డారు. అవన్నీ నిరాధార ఆరోపణలని మహారాష్ట్ర మంత్రి, భాజపా నేత సుధీర్ ముంగంటివార్ కొట్టిపారేశారు. సుప్రీంకోర్టు, భారత ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థలను కించపరచడానికే ఆ వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలని అన్నారు. రౌత్​ ట్వీట్​పై స్పందించిన.. శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సదా సర్వాంకర్ ఈ ఆరోపణలను ఖండించారు. 'అలా చెప్పడానికి సంజయ్ రౌత్ ఏమైనా క్యాషియరా?' అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ముంబయి భాజపా చీఫ్ సైతం రౌత్​ వ్యాఖ్యలపై స్పందించారు. రౌత్​వి పిచ్చి మాటలని మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.