ETV Bharat / bharat

'ఉక్రెయిన్​లో పరిస్థితిని గమనిస్తున్నాం.. భారతీయులూ జాగ్రత్త!'

author img

By

Published : Feb 24, 2022, 1:17 PM IST

Updated : Feb 24, 2022, 2:37 PM IST

Russia Ukraine war India response: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై భారత్ స్పందించింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్​లోని భారత పౌరుల సంక్షేమంపై దృష్టిసారించినట్లు తెలిపింది.

Russia Ukraine war India response
Russia Ukraine war India response

Russia Ukraine war India response: ఉక్రెయిన్‌- రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్‌ పేర్కొంది. ఉక్రెయిన్​పై రష్యా దండెత్తిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది. భారత్‌ ఈ అంశంపై తటస్థ వైఖరి అవలంభిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సమస్యకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు వెల్లడించింది.

మరోవైపు, ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రతపై దృష్టి పెట్టామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్​లోని తమ రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అత్యవసర సమాచారం కోసం.. 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని వివరించింది.

ఉక్రెయిన్​లోని భారతీయులకు సూచనలు...

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ దేశంలో తీవ్ర అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని.. ఉక్రెయిన్​లో ప్రజలు తాము ఉన్న స్థలాల్లోనే ఉండాలని సూచించింది. ఇళ్లు, వసతిగృహాలు, శిబిరాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం సూచనలు చేసింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వస్తున్న ప్రజలు వెనక్కి మళ్లాలని పేర్కొంది. రష్యా భాష తెలిసిన రాయబారులను ఉక్రెయిన్​కు పంపినట్లు తెలిపింది. రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు జారీ చేసే అడ్వైజరీలను పాటించాలని సూచించింది.

విమానాల కోసం పడిగాపులు...

కాగా, ఉక్రెయిన్‌ విమానాశ్రయంలో పలువురు భారతీయుల స్వదేశానికి వచ్చేందుకు పడిగాపులు కాస్తున్నారు. విమానాశ్రయంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 'కొన్ని గంటలుగా విమానం కోసం ఎదురుచూస్తున్నాం. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఎవరూ స్పందించట్లేదు' అని వాపోయారు. అయితే, ఉక్రెయిన్​కు వెళ్లాల్సిన ఎయిర్ఇండియా విమానం ఉద్రిక్తతల నేపథ్యంలో.. మార్గమధ్యలో ఉండగానే దిల్లీకి తిరుగుపయనమైంది.

అయితే, భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇతర దారులను అన్వేషిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రెయిన్​లోని భారత పౌరులు, విద్యార్థుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని తేల్చిచెప్పింది.

శాంతి స్థాపనకు యత్నించాలి: ఐరాసలో భారత్

UNSC RUSSIA UKRAINE: రష్యా దాడికి ముందు.. బుధవారం అర్ధరాత్రి ఐరాస భద్రతామండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే, ఈ ప్రాంతం అస్థిరంగా మారుతుందని హెచ్చరించింది.

India on Russia Ukraine

'ఇరు దేశాల మధ్య పరిస్థితులు.. పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ప్రస్తుత పరిస్థితులపై జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే.. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్త వాతావరణం మరింత దిగజారేందుకు దోహదం చేసే అన్ని చర్యలకు దూరంగా ఉండాలి. ఈ సంక్షోభం పరిష్కారానికి స్థిరమైన దౌత్య మార్గాలే తగినవని భారత్ విశ్వసిస్తోంది. ఈలోగా శాంతి భద్రతల పరిరక్షణకు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది' అని భారత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ప్రకటన చేశారు. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి ఆయా దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మనదేశం సూచించింది.

ఇవీ చదవండి:

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. కీవ్​లో పేలుడు

ఉక్రెయిన్ గగనతలం మూసివేత.. ఎయిర్ఇండియా విమానం వెనక్కి

ఉక్రెయిన్​లో బాంబుల మోత.. బెలారస్ నుంచి చొరబడ్డ రష్యా సైన్యం

Last Updated :Feb 24, 2022, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.