ETV Bharat / bharat

ఆ ఫొటో మూడేళ్ల క్రితందేనా?.. తవాంగ్‌పై రిజిజు ట్వీట్‌.. కాంగ్రెస్ ఫుల్​​ ఫైర్!​

author img

By

Published : Dec 18, 2022, 12:34 PM IST

row-over-kiren-rijijus-arunachal-tweet
జవాన్లతో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు

కాంగ్రెస్​ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు భాజపా- కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

చైనా యుద్ధానికి సిద్ధమవుతోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో అధికార భాజపా- కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నాయకులు రాహుల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన ఓ ట్వీట్‌ను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్‌ విమర్శల దాడికి దిగుతోంది.

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా రిజిజు శనివారం ఓ ట్వీట్‌ చేశారు. ఇటీవల భారత్‌- చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిన తవాంగ్‌ ప్రాంతం సురక్షితంగా ఉందని తెలిపారు. కావాల్సిన స్థాయిలో బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. దీనికి ఆయన జవాన్లతో ఉన్న ఓ ఫొటోను జత చేశారు. ఇప్పుడు ఆ ఫొటోయే వివాదంగా మారింది. అది 2019లో కిరణ్‌ రిజిజు సందర్శించినప్పటి ఫొటో అని కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ఆరోపించారు. మూడేళ్ల క్రితం చిత్రాన్నే తిరిగి పోస్ట్‌ చేశారు అని తెలిపారు. దీనిపై పలువురు కాంగ్రెస్‌ నాయకులు స్పందిస్తూ దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.

మరికొందరు కిరణ్‌ రిజిజుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన ఎక్కడా ఇటీవల సందర్శించినట్లు పేర్కొనలేదని ట్విట్టర్‌లో కామెంట్‌ చేస్తున్నారు. గతంలోనే కావాల్సిన స్థాయిలో బలగాల్ని మోహరించి ఉంచామని ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారని సమర్థిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.