ETV Bharat / bharat

'ఆ దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదే'

author img

By

Published : Jun 24, 2021, 10:57 PM IST

Updated : Jun 24, 2021, 11:57 PM IST

జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాల్సిందేనని గుప్కార్​ నేతలు డిమాండ్ చేశారు. కశ్మీర్​ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం దిల్లీలో ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

modi meeting with gupkar leaders, గుప్కార్​ నేతలతో మోదీ సమావేశం
'ఆ దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదే'

జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, అక్కడి ప్రజల్లో విశ్వాసాన్ని నింపేలా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గుప్కార్​ నేతలు కోరారు. ఎన్నిరోజులు పట్టినా ఆర్టికల్​ 370 పునరుద్ధరణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రానికి, కశ్మీర్​కు ఏర్పడిన దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు.

ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370 పునురుద్ధరణ కోసం తమ పార్టీ పోరాడుతుందని నేషనల్​ కాన్ఫరెన్సు అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్​ అబ్దుల్లా స్పష్టం చేశారు. దిల్లీలో ప్రధానమంత్రితో సమావేశం అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"జమ్ముకశ్మీర్​ ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. అందుకోసం కేంద్రం జమ్ముకశ్మీర్​కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునురుద్ధరించేందుకు కృషి చేయాలి."

-ఫరూఖ్​ అబ్దుల్లా, నేషనల్​ కాన్ఫరెన్సు అధ్యక్షుడు.

పునరుద్ధరించాల్సిందే..

రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్​ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యను జమ్మకశ్మీర్ ప్రజలు ఎంత మాత్రం అంగీకరించరని ఈ సమావేశంలో మోదీకి తాను చెప్పానని పీడీపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. నెలలు లేదా సంవత్సరాల సమయం పట్టినా.. ఆర్టికల్​ 370ని పునరుద్ధరించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.

"రాజ్యాంగపరంగా, ప్రజాస్వామ్యాయుతంగా, శాంతియుతంగా జమ్ముకశ్మీర్​ ప్రజలు పోరాడుతారు. నెలలు, సంవత్సరాలు పట్టినా.. ఆర్టికల్​ 370 పునురద్ధరణ జరగాల్సిందే. ఎందుకంటే అది మా గుర్తింపు. దానిని మేం పాకిస్థాన్​ నుంచి తెచ్చుకోలేదు. జవహార్​లాల్​ నెహ్రూ, సర్దార్​ పటేల్​ కృషి ద్వారా ఈ దేశం మాకు కల్పించింది."

-మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి

పాకిస్థాన్​తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు ముఫ్తీ తెలిపారు. అదే సమయంలో వాణిజ్య విషయంలో కూడా ఆ దేశంతో మాట్లాడాలని కోరారు.

అన్ని పార్టీలది అదే వాణి..

ఈ సమావేశంలో 80 శాతం పార్టీలు.. ఆర్టికల్​ 370ను పునరుద్ధరించాల్సిందేనని డిమాండ్​ చేశాయని కాంగ్రెస్​ నేత గులాం నబీ ఆజాద్​ తెలిపారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరించటం,ఎన్నికలు నిర్వహించటం, కశ్మీర్​ పండిట్​లకు పునరావాసం కల్పించటం, నిర్బంధించిన రాజకీయ నేతలను విడుదల చేయటం, భూమి, ఉపాధి కల్పించటం తమ డిమాండ్లని పేర్కొన్నారు.

'మోదీ ఏం మాట్లాడలేదు'

జమ్ముకశ్మీర్​కు జరిగిన అన్యాయంపై తాము న్యాయవ్యవస్థ ద్వారా పోరాడుతామని ఎన్​సీ నేత ఒమర్​ అబ్దుల్లా తెలిపారు. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. ఎన్నికలు, రాష్ట్రా హోదాను పనురుద్ధరిస్తామని ప్రధాని మోదీ, అమిత్​ షా చెప్పారని పేర్కొన్నారు. అయితే.. రాష్ట్ర హోదాను పునురుద్ధరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆజాద్​ చేసిన డిమాండ్​పై మోదీ మాట్లాడలేదని తెలిపారు.

ఇదీ చదవండి : కశ్మీర్​-దిల్లీ దూరానికి ముగింపు పలకాలి: మోదీ

Last Updated :Jun 24, 2021, 11:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.