ETV Bharat / bharat

హైవేపై మంత్రుల విమానం ల్యాండింగ్ సక్సెస్​

author img

By

Published : Sep 9, 2021, 11:20 AM IST

Updated : Sep 9, 2021, 1:10 PM IST

Emergency Landing
మంత్రుల విమానం ల్యాండింగ్

కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​, గడ్కరీ, భారత వైమానిక దళ(ఐఏఎఫ్​) అధిపతి ఆర్​కెఎస్​ భదౌరియా భారీ సాహసం చేశారు. ఐఏఎఫ్​ విమానంలో ప్రయాణిస్తూ.. జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్(plane landing in highway) ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుఖోయ్​, జాగ్వార్ యుద్ధ విమానాలను కూడా మొదటిసారి జాతీయ రహదారిపై ల్యాండ్​ చేశారు.

మంత్రుల విమానం ల్యాండింగ్​

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ఓ పెద్ద సాహసం చేశారు. భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్​) చెందిన సీ-130జే రవాణా విమానంలో ప్రయాణిస్తూ.. రాజస్థాన్​ బాడ్​మేర్​​​లోని జాతీయ రహదారిపై​ ల్యాండ్ అయ్యారు. వీరితో కలిసి ఆ విమానంలో ఐఏఎఫ్​ చీఫ్​ ఆర్​కేఎస్​ భదౌరియా కూడా ప్రయాణించారు.

బాడ్​మేర్​​​లోని జాతీయ రహదారి 925పై వైమానిక దళానికి చెందిన ఫైటర్​ జెట్స్​, ఇతర విమానాలు అత్యవసరంగా దిగడం కోసం 3.5 కిలోమీటర్ల మేర ఎయిర్​స్ట్రిప్​ నిర్మించారు. ఈ ఎయిర్​స్ట్రిప్​ ప్రారంభోత్సవంలో భాగంగానే ఇద్దరు మంత్రులు ఈ సాహసం చేశారు. బాడ్​మేర్​​​ నేషనల్​ హైవే... ఐఏఎఫ్​ ఎయిర్​క్రాఫ్ట్​లు అత్యవసరంగా ల్యాండ్​ అయ్యేందుకు వినియోగించే తొలి జాతీయ రహదారిగా అధికారులు పేర్కొన్నారు.

Emergency Landing
ల్యాండ్​ అవుతున్న మంత్రుల విమానం
Emergency Landing
ఎయిర్​ స్ట్రిప్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నితిన్​ గడ్కరీ
Emergency Landing
కార్యక్రమంలో పాల్గొన్న రాజ్​నాథ్ సింగ్​
Emergency Landing
జాతీయ రహదారిపై ల్యాండ్​ అయిన ఐఏఎఫ్​ విమానం

ఇంకా చాలా ప్రదేశాల్లో..

భారత ఆర్మీ కోసం ఈ అత్యవసర ల్యాండింగ్​ వసతి రహదారులను ఉండే చాలా ప్రదేశాల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్​హెచ్​ఏఐ) ఏర్పాటు చేస్తోందని చెప్పారు రాజ్​నాథ్​.

"ఆర్మీ సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భారత్​లోని చాలా ప్రదేశాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్​ ప్రదేశాలను ఏర్పాటు చేస్తోంది. విపత్తుల వంటి సమయాల్లోనూ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్​ ప్రదేశాలు ఉన్నందున... ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకైన భారత్ సిద్ధంగా ఉంటుంది."

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

ఊహకందని ఇలాంటి ప్రాజెక్టుల ఆలోచన కార్యరూపం దాల్చే క్రమంలో ఎన్నో భయాందోళనలు తలెత్తాయని నితిన్​ గడ్కరీ అన్నారు. కానీ, రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో మూడు కిలోమీటర్ల ఈ ఎయిర్​స్ట్రిప్​ మార్గాన్ని ఎన్​హెచ్ఐఏ విజయవంతంగా పూర్తి చేసిందని పేర్కొన్నారు. "ఈ ఎయిర్​స్ట్రిప్​ను నిర్మించేందుకు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుందని ఐఏఎఫ్​ చీఫ్​ భదౌరియా నాతో అన్నారు. కానీ, 17 రోజుల్లో, మంచి నాణ్యతతో కట్టి చూపిస్తామని నేను ఆయనతో చెప్పాను." అని గడ్కరీ తెలిపారు.

ఇదే తొలిసారి..

మరోవైపు.. బాడ్​మేర్​లో నిర్మించిన ఈ ఎయిర్​స్ట్రిప్​పై ఐఏఎఫ్​కు చెందిన సుఖోయ్​-30 ఎంకేఐ యుద్ధ విమానం, జాగ్వార్​ యుద్ధ విమానాలను కూడా ల్యాండ్​ చేశారు. ఈ యుద్ధ విమానాలు.. జాతీయ రహదారిపై దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఐఏఎఫ్​కు చెందిన ఎంఐ 17వీ5 హెలికాప్టర్ కూడా ఈ ఎయిర్​స్ట్రిప్​పై ల్యాండ్ అయింది. ​

ఎయిర్​ స్ట్రిప్ విశేషాలు...

  • సత్తా-గంధవ్​ మధ్య నిర్మించిన ఈ ఎయిర్​ స్ట్రిప్​ను జాతీయ రహదారి-​ 925ఏపై మూడు కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు.
  • భారత వాయుసేన విమానాలు, ఇతర విమానాలు ల్యాండ్ అయ్యేలా దీన్ని నిర్మించారు.
  • ​భారతమాల పరియోజన కింద రూ.765.52 కోట్లతో నిర్మించిన గంగరీయా-బఖాసర్​​, సత్తా-గంధవ్​ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ ఎయిర్​స్ట్రిప్​ను నిర్మించారు.
  • ఈ ప్రాజెక్టులో భాగంగా మరో మూడు హెలిప్యాడ్లను కుందన్​పుర, సింఘానియా, బాఖాసడ్​ గ్రామాల్లో (100x30 మీటర్లు) నిర్మించారు.
  • ఈ నిర్మాణాలను మూడేళ్ల వ్యవధిలో(2019 జులైలో ప్రారంభించిన దీన్ని, 2021 జనవరిలో) పూర్తి చేశారు.
  • ఐఏఎఫ్​, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్​హెచ్​ఏఐ)సారథ్యంలో జీహెచ్​వీ ఇండియా లిమిటెడ్ వీటిని నిర్మించింది.

అంతకుముందు.. 2017, అక్టోబర్​లో.. లఖ్​నవూ-ఆగ్రా ఎక్స్​ప్రెస్​వేపై ఐఏఎఫ్​కు చెందిన ఫైటర్​ జెట్స్​, ట్రాన్స్​పోర్ట్​ విమానాలు మాక్​ ల్యాండింగ్ నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో అలాంటి రహదారులను ల్యాండింగ్​ కోసం వినియోగించుకోగలమని చూపేందుకు ఈ ప్రయోగం​ చేపట్టారు అధికారులు.

ఇదీ చూడండి: భాజపా నేతపై దాడి.. ఎమ్మెల్యే సస్పెండ్

Last Updated :Sep 9, 2021, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.