ETV Bharat / bharat

Bijoliya Kisan Andolan: ఆ రైతులది 45 ఏళ్ల పోరాటం!

author img

By

Published : Nov 20, 2021, 7:19 AM IST

ఏడాదిపాటు అలుపెరగక పోరాడి... వ్యవసాయ చట్టాలపై విజయం సాధించింది నేటి రైతాంగం! అయితే భారత చరిత్రలో ఇంతకంటే సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమం (Rajasthan Bijoliya kisan andolan) ఒకటుంది. బ్రిటిష్‌ హయాంలో... రాజస్థాన్‌లో ఆ సమరం (Bijoliya kisan andolan) దాదాపు 45 ఏళ్లపాటు సాగింది.

rajasthan bijoliya kisan andolan
rajasthan bijoliya kisan andolan

అంతగా చరిత్రపుటలకెక్కని ఆ సుదీర్ఘ రైతుపోరు రాజస్థాన్‌లోని బిజోలియాలో (Rajasthan Bijoliya kisan andolan) జరిగింది. మొత్తం మూడు దశల్లో.. (1897-1915; 1916-1923; 1923-1941) సాగిన ఈ ఉద్యమానికి సాధు సీతారాందాస్‌, విజయ్‌సింగ్‌ పాథిక్‌, మాణిక్యలాల్‌ వర్మ తదితరులు సారథ్యం వహించారు. రాజస్థాన్‌ మేవాడ్‌ సంస్థానంలోనిదీ బిజోలియా (Rajasthan Farmers protest) ప్రాంతం. అక్కడ 62శాతం భూమి జాగీర్దార్‌ల చేతుల్లోనే ఉండేది. వీరంతా తలచుకుంటే... తన ప్రాణాలకూ ముప్పుందని మేవాడ్‌ రాజు సైతం భయపడేంత బలమైనవారు ఈ జాగీర్దార్‌లు. అలాంటి వారిపై రైతులు బయటి నుంచి ఎలాంటి మద్దతు లేకున్నా తిరుగుబాటు (Bijoliya kisan andolan) చేశారు.

బిజోలియా ఎస్టేట్‌లో మొత్తం 83 గ్రామాలుండేవి. రైతుల జీవితాలన్నీ భూస్వాములు, జాగీర్దార్‌ల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండేవి. వారు చెప్పిందే చట్టం. పండించే పంటలో దాదాపు సగం దాకా శిస్తు కింద జమచేసుకునేవారు. దీనికి అదనంగా 86 రకాల పన్నులు కట్టించుకునేవారు. ఎలాంటి కూలి ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకునేవారు. ప్రతి పండగకూ పబ్బానికీ రైతులు భూస్వామికి పన్ను చెల్లించాల్సి వచ్చేది. జాగీర్దార్‌ ఇంట్లో శుభకార్యమైనా, అశుభకార్యమైనా రైతుల నుంచి డబ్బులు గుంజేవారు. ఈ శిస్తులు కట్టనివారిని వేధించి, బహిరంగంగా శిక్షించేవారు. ఇలా తమ జీవితాలు పూర్తిగా చాకిరీ-పన్నుల మధ్య నలుగుతుండటంతో... రైతులంతా ఓ రోజు కలసికట్టుగా (Bijoliya kisan andolan) మేవాడ్‌ రాజు మహా రాణా ఫతేసింగ్‌ను కలసి విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నారు. జాగిర్దార్‌లకు భయపడి... ఈ రైతులను కలవటానికి ఆయన ఆరునెలల పాటు వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు రైతుల ఒత్తిడి మేరకు... ఓ అధికారితో విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా.. కొన్ని పన్నులను తొలగించాలని జాగీర్దార్‌లకు సూచించారు.

పెళ్లి చేసినా పన్ను...

సరేనన్న జాగీర్దార్‌లు... తాయిలాలు ఇచ్చి కొంతమంది రైతులను తమవైపు తిప్పుకొన్నారు. అన్నదాతల్లో విభజన తీసుకురావటానికి ప్రయత్నించారు. కానీ రైతులు వంచకులను వెలివేసి తాము మాత్రం గట్టిగా నిలిచారు. ఇంతలో జాగీర్దార్‌లు చన్వారీ పేరుతో కొత్త పన్ను విధించారు. ఎవరైనా రైతు తమ బిడ్డకు పెళ్లి చేస్తే రూ.5 పన్నుగా చెల్లించాలి. దీన్ని వ్యతిరేకించిన రైతులు... రెండేళ్లపాటు తమ పిల్లలకు పెళ్లిళ్లే చెయ్యలేదు. 1905లో పోరాటం తీవ్రమైంది. జాగీర్దార్‌ల భూముల్లో పనిచేయొద్దని నిర్ణయించారంతా. దీంతో దిగివచ్చిన భూస్వాములు... చన్వారీ పన్ను రద్దు చేశారు. పంటలో వాటాపైనా పరిమితి విధించారు. కానీ తొలి ప్రపంచయుద్ధం ఆరంభంతో... మరిన్ని పన్నులు వేశారు.

రాజుసై.. బ్రిటిష్‌ నో

1915 దాకా ఈ పోరాటానికి సారథ్యం వహించిన సాధు సీతారాం... వయసు పైబడటంతో...కొత్త నాయకుడి కోసం అన్వేషించారు. ఈ దశలో గదర్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి... బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి తప్పించుకొని మారువేషంలో తిరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విజయ్‌సింగ్‌ పాథిక్‌ (అసలు పేరు భూప్‌సింగ్‌) దొరికారు. ఆయన సారథ్యంలో బిజోలియా ఉద్యమం కొత్తపుంతలు తొక్కింది. పోరాటం కొనసాగిస్తూనే కిసాన్‌ పంచాయతీ బోర్డును... చిన్నచిన్న వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయించి... బిజోలియాలో దాదాపు సమాంతర ప్రభుత్వాన్ని నడిపించారు. తమ కష్టాలపై మేవాడ్‌ మహారాజుకు పదేపదే విజ్ఞప్తులు చేసేవారు. దీంతో పన్నులను రద్దు చేయాలని రాజు నిర్ణయించారు. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. పాథిక్‌ను అరెస్టు చేయాలని ఆదేశించింది. బిజోలియా ప్రాంతంలో పోలీసులను దించింది. తప్పించుకున్న పాథిక్‌ పత్రికల్లో బిజోలియా సమస్య గురించి రాసేవారు.

నేతల జోక్యంతో..

దీంతో తిలక్‌, మాలవీయలాంటి జాతీయోద్యమ నేతలు కల్పించుకున్నారు. ఫలితంగా... 1922లో రైతులు, బ్రిటిష్‌ అధికారులు, మేవాడ్‌ అధికారుల మధ్య సమావేశం ఏర్పాటైంది. అనేక పన్నులను రద్దు చేయటానికి అంగీకరించారు. తర్వాత జాగీర్దార్‌లు మళ్లీ పన్నులు వేసేందుకు ప్రయత్నించినా... మాణిక్యలాల్‌వర్మ సారథ్యంలో పోరాడి రైతులు తమ పట్టు నిలబెట్టుకున్నారు. 1941 దాకా ఈ పోరాటం కొనసాగింది. బిజోలియా విజయం చుట్టుపక్కల సంస్థానాల రైతులకు కూడా స్ఫూర్తినిచ్చింది. అక్కడా ఇదే పద్ధతిలో పన్నుల రద్దు చేయాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: Farm Laws repealed: రైతులోకం సాధించిన చారిత్రక విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.