సీఎంకు షాక్!.. విమానం నుంచి దించేసిన ఘటనపై కేంద్రం నజర్

author img

By

Published : Sep 20, 2022, 5:01 PM IST

punjab cm lufthansa

Punjab CM Germany : మద్యం మత్తులో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్​ను జర్మనీలో విమానం నుంచి దించేశారని వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఈ ఘటనపై దృష్టిసారించినట్లు చెప్పారు.

Punjab CM deplaned in Frankfurt : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎయిర్​పోర్ట్ వివాదంపై కేంద్రం దృష్టిసారించింది. మద్యం మత్తులో ఉన్న మాన్​ను విమానం నుంచి దించేశారని వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఈ ఘటనపై నిజానిజాలు తేల్చడం ముఖ్యమని సింధియా అన్నారు. "ఈ ఘటన విదేశాల్లో జరిగింది. కాబట్టి నిజాలు నిర్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. లుఫ్తాన్సా ఎయిర్​లైన్​ను వివారాలు కోరతాం. సమాచారం ఇవ్వాలా లేదా అన్న విషయం ఎయిర్​లైన్ పరిధిలోనిదే. నాకు అందిన రిక్వెస్ట్ ప్రకారం.. ఈ విషయంపై దృష్టిసారిస్తా" అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సింధియా స్పష్టం చేశారు.

ఏం జరిగిందంటే?
ఇటీవల 8 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లారు పంజాబ్ సీఎం. ఆదివారం భారత్​కు తిరిగొచ్చారు. అయితే.. ఆయన ప్రయాణించిన విమానం రాక ఆలస్యం కాగా.. ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మాన్​.. దిల్లీకి తిరిగి వస్తుండగా విమానం నుంచి దించేశారంటూ శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్​బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. శనివారం మాన్​తోపాటు జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో మాన్ ఉన్నారని ట్వీట్​లో పేర్కొన్నారు.

ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని పౌర విమానయాన శాఖ మంత్రి సింధియాకు లేఖ రాశారు. కాగా, ఈ ఆరోపణలను ఆమ్​ఆద్మీ పార్టీ ఖండించింది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని పేర్కొంది. సీఎంను అగౌరపరిచేందుకు విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడింది. 'పంజాబ్​కు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం నిరంతరం పనిచేస్తున్నారని వారు ఓర్వలేకపోతున్నారు. సీఎం షెడ్యూల్ ప్రకారమే తిరిగి వచ్చారు' అని పార్టీ ప్రధాన ప్రతినిధి మాల్విందర్ సింగ్ కాంగ్ తెలిపారు.

'విమానం మార్చడం వల్లే ఆలస్యం'
ఈ ఘటనపై ట్విట్టర్​లో స్పందించిన లుఫ్తాన్సా ఎయిర్​లైన్.. విమానం ఆలస్యంగా బయల్దేరడంపై వివరణ ఇచ్చింది. దిల్లీకి రావాల్సిన విమానాన్ని మార్చడం వల్లే ప్రయాణం ఆలస్యమైందని తెలిపింది. ఇందుకు సంబంధించి ఇతర ప్రయాణికుల వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ఓ ప్రయాణికుడు మత్తులో ఉండటం వల్లే ఆలస్యమైనట్లు వచ్చిన వార్తలను ఖండించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.