ETV Bharat / bharat

రాష్ట్రపతి ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్.. పక్కా ప్లాన్​తో..

author img

By

Published : Jun 13, 2022, 7:00 AM IST

President Elections 2022
President Elections 2022

President Elections Lalu Prasad Yadav: రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఈసారి రాష్ట్రపతి బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?.. వీటిపైనే దేశమంతా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు లాలూ ప్రసాద్​ యాదవ్. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్​ ఉంది. అదేంటంటే?

President Elections 2022 Lalu Prasad Yadav: మరికొద్ది రోజుల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపైనే దేశమంతా చర్చ జరుగుతోంది. రామ్‌నాథ్‌ కోవింద్‌ తర్వాత తదుపరి రాష్ట్రపతి ఎవరనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. ఇంతకీ రాష్ట్రపతి బరిలో నిలిచేదెవరెవరు? గెలిచేదెవరు? ఈ ప్రశ్నలే ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వెల్లడించారు. ఆగండాగండీ.. ఇందులో ఓ ట్విస్ట్‌ ఉంది. మీరనుకుంటున్నట్లుగా రాష్ట్రీయ జనతాదళ్‌ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్‌ కాదు ఈయన. ఆయన పేరే కలిగిన మరో వ్యక్తి.

ఎవరీ లాలూ?
లాలూ ప్రసాద్‌ యాదవ్‌(42) బిహార్‌లోని సరన్‌ జిల్లాలో మర్‌హౌరా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రహిమ్‌పుర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి. వ్యవసాయం చేస్తూనే సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. ఆయనకు ఏడుగురు పిల్లలు కాగా.. పెద్ద కూతురికి ఇటీవలే పెళ్లి చేశారు. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పేరే కలిగి ఉండి గతంలో పలుసార్లు ఎన్నికల్లో పోటీ చేయడంతో చాలా మంది గందరగోళానికి గురయ్యారు.

తాజాగా ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికోసం జూన్‌ 15న నామినేషన్‌ దాఖలు చేయడానికి ఇప్పటికే దిల్లీకి టికెట్‌ బుక్‌ చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు 2017లో రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తాను నామినేషన్‌ దాఖలు చేశానని.. అయితే, తనని ప్రతిపాదించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో నామినేషన్‌ తిరస్కరణకు గురైందని తెలిపారు. కానీ, ఈసారి మాత్రం తాను పకడ్బందీగా సిద్ధమయ్యానని పేర్కొన్నారు.

ఆ లాలూ అనుకొని పొరబడి!
2014 ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్‌ చీఫ్‌ లాలూ భార్య, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీపై ఈయన పోటీ చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీపై సుమారు 50వేల ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. దీనికి కారణం ఈ లాలూనేనని.. అప్పట్లో అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ పేరు చూసి అందరూ పొరపడ్డారట. ఈ ఎన్నికల్లో ఇతడికి సుమారు 10వేల ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ పోటీ చేయగా ఆరువేల ఓట్లు లభించాయి.

అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే..
"ఇప్పటివరకూ చాలా ఎన్నికల్లో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వచ్చాను. పంచాయతీ ఎన్నికల నుంచి ప్రెసిడెంట్ ఎలక్షన్ల వరకు పోటీ చేశాను. గెలిస్తే ఫర్వాలేదు. ఓడితే మాత్రం అత్యధిక ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కుతాను" అని ఈ లాలూ చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి: అల్లర్ల కారకులపై కన్నెర్ర.. యూపీలో 304 మంది అరెస్టు

EVM: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు వాడరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.