UP elections 2022: 'మిషన్​ ఉత్తర్​ప్రదేశ్​'లో గెలుపెవరిది?

author img

By

Published : Sep 12, 2021, 5:19 PM IST

UP elections

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల సమరానికి పార్టీలు సన్నద్ధమవుతున్నాయి(up assembly election 2022). వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. అగ్రనేతలతో సభలు నిర్వహించి ప్రజల మనసును మరోసారి గెలుచుకోవాలని భాజపా ఆశిస్తుంటే.. అధికార పక్షం అవినీతికి పాల్పడిందంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్​ 'ప్రగతి' యాత్ర చేపట్టనుంది. ఎస్​పీ, బీఎస్​పీ కూడా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. దీంతో ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

దేశంలో ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ జెండా ఎగిరేస్తే.. ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు మార్గం సుగమం అయినట్టే! రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలుండటం ఇందుకు కారణం. రాజకీయంగా ఇంత ముఖ్యమైన రాష్ట్రంలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.(up elections 2022) అసెంబ్లీ సమరానికి ఇప్పటి నుంచే పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో అధికార భాజపా వ్యూహాలు రచిస్తుండగా.. కమలదళాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్​, ఎస్​పీ, బీఎస్​పీ సన్నద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలతో ఏడాది ముందే ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాలు వేడెక్కాయి.

రంగంలోకి భాజపా అగ్రనేతలు...

ఎన్నికలు అనగానే అగ్రనేతలను రంగంలోకి దింపడం కమలదళానికి ఆనవాయతీ. ఈసారీ అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్​ను రూపొందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని.. అనేకమంది కేంద్ర మంత్రులు, భాజపా సీనియర్​ నేతలు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మెగా ర్యాలీలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడి భాజపా నేతలు.(bjp up news)

అసెంబ్లీ సీట్ల పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​ను 6 ప్రాంతాలుగా విభజించింది భాజపా. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా మీడియా ఇన్​చార్జ్​, ప్రతినిధిని ఏర్పాటు చేయనుంది. ప్రతి ప్రాంతంలో ఒకటి చొప్పున.. రాష్ట్రం మొత్తం మీద ప్రధాని మోదీ 30కిపైగా సభలు నిర్వహిస్తారని తెలుస్తోంది. మోదీ పర్యటనల కోసం ప్రత్యేకంగా ఓ బృందాన్నే ఏర్పాటు చేసింది కమలదళం. హోంమంత్రి అమిత్​ షా 20కిపైగా ర్యాలీల్లో పాల్గొంటారని సమాచారం.

UP elections
పీఎం మోదీ

ఇదీ చూడండి:- అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భాజపా 'బూత్​ విజయ్​ అభియాన్​'

మోదీకున్న ఆదరణ, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు ఉన్న ఇమేజ్​ను ఉపయోగించుకుని ఎన్నికల్లోకి వెళ్లేందుకు కమలదళ నేతలు సన్నద్ధమవుతున్నారు.

కాంగ్రెస్​ అస్త్రం.. ప్రియాంక!

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలకు.. కాంగ్రెస్​ ప్రధాన అస్త్రం ప్రియాంక గాంధీ(priyanka gandhi up news). దేశవ్యాప్తంగా డీలాపడ్డ కాంగ్రెస్​.. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో విజయం సాధించి పుజుకోవాలని ఆశిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని క్షేత్రస్థాయిలో రంగంలోకి దింపింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రియాంక.. ఇప్పటి నుంచే బిజీబిజీగా గడుపుతున్నారు. ఆలయాలను సందర్శించి, స్థానిక కార్యకర్తలను కలుస్తున్నారు.

UP elections
కాంగ్రెస్​ నేతలకు ప్రియాంక దిశానిర్దేశం

రాష్ట్రవ్యాప్తంగా 'కాంగ్రెస్​ ప్రగతి యాత్ర'ను చేపట్టాలని నిర్ణయించింది ఆ పార్టీ(congress up news)​. 12వేల కిలోమీటర్లు సాగే యాత్రతో కాంగ్రెస్​ నేతలు.. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాలకు వెళ్లనున్నారు. యోగి హయాంలో.. రాష్ట్రంలో అవినీతి, నేరాలు, మహిళలపై హింస, నిరుద్యోగం, ఆరోగ్య సేవల్లో లోపాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ యాత్రను ఉపయోగించుకోనుంది కాంగ్రెస్​. గ్రామ సభ కమిటీలను నియమించేందుకు కూడా కసరత్తులు జరుగుతున్నాయి.

UP elections
ప్రియాంక గాంధీ

ఇదీ చూడండి:- కాంగ్రెస్​కు షాక్​- ఇద్దరు సీనియర్ నేతల రాజీనామా

ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆదివారం.. రెండు రోజుల రాయ్​బరేలీ పర్యటనను చేపట్టారు ప్రియాంక. కాంగ్రెస్​ అధ్యక్షురాలు, తన తల్లి సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్​బరేలీలోని హనుమాన్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కార్యకర్తలతో సమావేశమయ్యారు.

జన్​మన్​-విజయ్​తో ఎస్​పీ..

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల ప్రచారాల కోసం 'జన్​మన్​-విజయ్​' కార్యక్రమాన్ని చేప్టటింది సమాజ్​వాదీ పార్టీ. రాష్ట్రంలోని ప్రజల చెంతకు చేరి, పార్టీపై వారికి నమ్మకాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం(samajwadi party news). ఇందుకోసం ఎస్​పీలోని యువశక్తిని ఉపయోగించుకోనున్నట్టు పార్టీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​ ప్రకటించారు. అటు యువతను ఆకర్షించేందుకు 'హర్​ బూత్​ పర్​ యూత్​' కార్యక్రమాన్ని కూడా చేపట్టింది ఎస్​పీ.

UP elections
ప్రజలతో అఖిలేశ్​ యాదవ్​

బీఎస్​పీ.. అదే ఫార్ములా!

2022 అసెంబ్లీ ఎన్నికల కోసం మాయావతి నేతృత్వంలోని బీఎస్​పీ తీవ్రస్థాయిలో కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలో 'దళితులు, బ్రాహ్మణుల'పై దాడులకు వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే ఫార్ములాను ఉపయోగించి 2007లో బీఎస్​పీ విజయం సాధించింది.

ప్రచారాల్లో భాగంగా.. దళితులు, బ్రాహ్మణులపై ఎక్కడ దాడులు జరిగితే, అక్కడికి వెళ్లి, బాధితులు, వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు బీఎస్​పీ నేతలు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీనిస్తారు.

UP elections
మాయావతి

ఒవైసీ మాటలతూటాలు..

గతేడాది జరిగిన బిహార్​ ఎన్నికల్లో అంచనాలకు మించిన ప్రదర్శన చేసి దేశ రాజకీయాల్లో కీలక స్థాయికి ఎదిగింది అసదుద్దీన్​ ఒవైసీకి(owaisi news) నేతృత్వంలోని ఏఐఎమ్​ఐఎమ్​. అనంతరం బంగాల్​, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో పోటీ చేసింది. ఇప్పుడు ఉత్తర్​ప్రదేశ్​లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతోంది. పార్టీకి ప్రధాన బలం ఒవైసీ. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి దిగారు. రాష్ట్రంలోని అధికార-విపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సభలు నిర్వహించేందుకు ఒవైసీ ప్రణాళికలు రచిస్తున్నారు.

శివసేన కూడా..

రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు శివసేన ఇటీవలే ప్రకటించింది. 80-100 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపనున్నట్టు వెల్లడించింది. పశ్చిమ యూపీలోని రైతుల మద్దతు తమకుందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేసింది.

2017 ఎన్నికల్లో 312 సీట్లతో విజయఢంకా మోగించింది భాజపా. కాంగ్రెస్​ కేవలం 7 సీట్లకే పరిమితమైంది. ఎస్​పీ 47, బీఎస్​పీకి 19 స్థానాలు మాత్రమే దక్కాయి. 2022 మార్చి 14తో ప్రస్తుత అసెంబ్లీ కాలం పూర్తికానుంది.

ఇదీ చూడండి:- సైకిల్ యాత్రతో అఖిలేశ్​​ 'మిషన్ యూపీ'- టార్గెట్​ 400!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.