Police Gets Justice After 29 Years : చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఓ మాజీ ఎస్ఐని నిర్దోషిగా ప్రకటిస్తూ.. 29 ఏళ్ల తర్వాత కోల్కతా హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం తీర్పు కాస్త ఆలస్యంగా వచ్చినా న్యాయం జరిగినందుకు ఆ మాజీ ఎస్ఐ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ జరిగింది.. సైలేన్ దాస్ (70) అనే వ్యక్తి 1993లో కోల్కతా పోలీస్ శాఖ ఈఎస్డి డివిజన్ ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఓ కేసులో సైలేన్దాస్ ప్రమేయం ఉందని ఉన్నతాధికారులు భావించారు. సైలేన్దాస్పై శాఖా పరమైన విచారణ చేపట్టి.. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సైలేన్దాస్ అంగీకరించలేదు. తనతప్పేమి లేదని స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్- ఎస్ఏటీలో ఫిర్యాదు చేశారు. అయితే సైలేన్దాస్ చేసిన అభ్యర్థనను ఎస్ఏటీ తిరస్కరించింది. దీంతో పట్టువదలని సైలన్దాస్ ట్రైబ్యునల్ తీర్పును కోల్కతా హైకోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియలో కేసు ఎంతకాలానికి పరిష్కారమవుతుందో సైలేన్దాస్కు తెలియదు. ఆయన ఆర్థిక స్థోమత కూడా న్యాయపోరాటానికి సహకరించలేదు. దీంతో తనకు జీవనోపాధి అయిన ఉద్యోగంపై ఆశలు వదులుకున్నారు. అప్పటికే అనారోగ్య కారణాలతో ఆయన మంచం పట్టారు.
అయితే మూడు దశాబ్దాల సుదీర్ఘకాలం తర్వాత కోల్కతా హైకోర్టు ఆయనకు శుభవార్త తెలిపింది. సైలేన్ దాస్ను నిర్దోషిగా ప్రకటించి తీర్పు వెలువరించింది. దాస్ను ఎక్కడున్న కనుక్కోవాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో సైలేన్దాస్కు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించి.. కేసు మొత్తం వ్యవహారాన్ని కోర్టుకు నివేదించారు. పోలీసులు అన్ని ఫైళ్లు తిరగేసి అతికష్టంమీద సైలేన్దాస్ చిరునామా కనుక్కొగలిగారు.
న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు సైలేన్దాస్ ఇంటికి కారు పంపించి పోలీసు కార్యాలయానికి పిలిపించారు. ఆయన కేసు ఫైళ్లు అన్ని పరిశీలించి దాస్ బాధితుడని ప్రకటించారు. తప్పు జరిగిపోయిందని పోలీసులు సైలేన్దాస్ను క్షమాపణలు కోరారు. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు సైలేన్దాస్కు రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందివ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే.. కాస్త ఆలస్యంగానైనా కోర్టు తనకు న్యాయం చేసినందుకు మాజీ పోలీస్ ఆనందం వ్యక్తం చేశారు.