ETV Bharat / bharat

Cyber Gang Arrest in Hyderabad : రూ.712 కోట్ల మోసం.. సైబర్ ముఠా అరెస్ట్.. డబ్బంతా తీవ్రవాదులకు చేరిందా..?

author img

By

Published : Jul 22, 2023, 5:30 PM IST

Updated : Jul 22, 2023, 7:48 PM IST

712 Crores Cyber Fraud in Hyderabad : పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నమ్మించి.. అధిక లాభాలిస్తామంటూ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. డొల్ల కంపెనీలకు సంబంధించి ఖాతాల్లో నగదు జమ చేయించిన తర్వాత.. ఆ మొత్తాన్ని వివిధ మార్గాల్లో దుబాయ్​కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి క్రిప్టో వాలెట్​ల ద్వారా చైనా చేరవేస్తున్నారు. క్రిప్టో రూపంలో వెళ్తున్న ఈ డబ్బు.. ఉగ్రవాదుల ఖాతాల్లోకి సైతం మళ్లినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఎన్ఐఏతో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

Cyber Gang Arrest in Hyderabad
Cyber Gang Arrest in Hyderabad

Cyber Fraud Gang Arrest in Hyderabad : పెద్దఎత్తున సైబర్ మోసాలకు పాల్పడుతున్న 9 మంది ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు చెందిన డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10.5 కోట్ల నగదుతో పాటు 17 సెల్ ఫోన్​లు, 2 ల్యాప్​టాప్​లు, బ్యాంకు పాస్​బుక్​లు, డొల్ల కంపెనీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దేశవ్యాప్తంగా 15 వేల మందికి పైగా మోసం చేసి.. రూ.712 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు తేల్చారు. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన శివకుమార్​ అనే వ్యక్తికి కొన్ని నెలల క్రితం టెలీగ్రామ్​లో సందేశం వచ్చింది. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ.. భారీగా సంపాదించొచ్చని ఆ సందేశం సారాంశం. దీంతో శివకుమార్ ఆ మెసేజ్​లో వచ్చిన వెబ్​సైట్​లో లాగిన్ అయ్యాడు. పూర్తి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత.. శివకుమార్​కు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చారు. మొదట రూ.1000 జమ చేయాలని సూచించారు. ఆ మేరకు రూ.వెయ్యి జమ చేయగానే.. వారం తిరిగేలోపు శివకుమార్ ఖాతాలో అదనంగా రూ.866 జమ అయ్యాయి. శివకుమార్ వెంటనే రూ.1,866 తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చి మోసగాళ్లు శివకుమార్​ను బుట్టలో వేసుకున్నారు. ఈసారి రూ.25 వేలు జమ చేస్తే రూ.20 వేలు అదనంగా వస్తాయని ఆశ చూపారు. వెంటనే శివకుమార్ రూ.25 వేలు జమ చేశాడు. తన ఖాతాలో 15 రోజుల వ్యవధిలో మొత్తం రూ.45 వేలు ఉన్నట్లు చూపించింది. ఆ నగదు మొత్తాన్ని తీసుకోవడానికి శివకుమార్ ప్రయత్నించినప్పటికీ డబ్బులు రాలేదు. దీంతో వెంటనే నిర్వాహకులను సంప్రదించాడు.

Fedex Cyber Fraud in Telangana : మార్కెట్‌లోకి కొత్త తరహా సైబర్‌ మోసం.. అలాంటి ఫోన్‌ కాల్ మీకూ వచ్చిందా..?

ఆ డబ్బును తీసుకోవాలంటే మరికొంత డబ్బును డిపాజిట్ చేయాలని నమ్మబలికారు. ఇలా ఓసారి రూ.లక్ష, మరోసారి రూ.2 లక్షలు, ఇలా విడతల వారీగా మోసగాళ్లు సూచించిన 6 ఖాతాల్లో రూ.28 లక్షలు జమ చేశాడు. చివరికి మోసపోయానని గుర్తించి.. 3 నెలల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. బ్యాంకు ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో సైతం నగదు జమ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి.. ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. మహమ్మద్ మునావర్ పేరు మీదు రిజిస్టర్ అయిన రాధిక మార్కెటింగ్ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలో శివకుమార్ వేసిన నగదు జమ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కానీ రాధిక మార్కెటింగ్ అనే కంపెనీ డొల్ల కంపెనీగా సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు. అమాయకులను నమ్మించి వాళ్లతో నగదు జమ చేయించడానికి సైబర్ నేరగాళ్లు డొల్ల కంపెనీలు సృష్టించి.. వాటి ద్వారా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలింది. హైదరాబాద్​కు చెందిన మహమ్మద్ మునావర్​తో పాటు అరుణ్ దాస్, షా సుమేర్, షమీర్ ఖాన్​లు లక్నో వెళ్లి తప్పుడు పత్రాలు సమర్పించి 33 డొల్ల కంపెనీలు రిజిస్టర్ చేయించుకున్నారు. లక్నోకు చెందిన మనీష్, వికాస్, రాజేష్​ల ఆదేశాల మేరకు నలుగురు కలిసి డొల్ల కంపెనీలు రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత డొల్ల కంపెనీల కోసమని పలు బ్యాంకుల్లో 61 ఖాతాలు తెరిచారు. ఒక్కో ఖాతాను రూ.2 లక్షల చొప్పున మనీష్​కు విక్రయించారు. మనీష్ తనకు పరిచయం ఉన్న గగన్ సాయంతో కంపెనీల పేరు మీద వెబ్​సైట్​లు రూపొందించారు. నయూమ్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించాడు. ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి ఆదేశాల మేరకు మనీష్ ఇవన్నీ చేశాడు. అహ్మదాబాద్​కు చెందిన ప్రకాష్ ప్రజాపతి వెనకాల చైనీయులున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

పెట్టుబడుల పేరుతో దేశవ్యాప్తంగా రూ.712 కోట్ల మోసానికి పాల్పడిన ముఠాకు చెందిన 9 మందిని అరెస్టు చేశాం. ఈ డబ్బులు పలు మార్గాల్లో క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్ నుంచి చైనా వెళ్తున్నాయి. తీవ్రవాదులు ఉపయోగించే క్రిప్టో వెబ్‌సైట్‌కు వెళ్లినట్లు తేలింది. జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేయాల్సి ఉంది. హెజ్ బొల్లా అనే క్రిప్టో వాలెట్ ద్వారా కరెన్సీ చైనా బదిలీ అవుతోంది. తీవ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. తీవ్రవాదులకు ఏమైనా చేరిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఎన్ఐఏ సహాయం తీసుకొని హెజ్ బొల్లా క్రిప్టో వాలెట్ దర్యాప్తు చేస్తాం.-సీవీ ఆనంద్‌, హైదరాబాద్​ సీపీ

Cyber Gang Arrest in Hyderabad : రూ.712 కోట్ల మోసం.. సైబర్ ముఠా అరెస్ట్.. డబ్బంతా తీవ్రవాదులకు చేరిందా..?

చైనాకు చెందిన లీ లూ, నన్ యే, కెవిన్ జున్​లు వెనక ఉండి.. ఈ తతంగం నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పెట్టుబడుల పేరుతో అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించిన డబ్బును నిందితులు దుబాయ్​కి పంపిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. డొల్ల కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును కూల్ టెక్, ఎయిర్ డ్రాయిడ్ అనే అప్లికేషన్ల ద్వారా నేరుగా దుబాయిలో ఉన్న ఖాతాల్లోకి మళ్లించుకొని, అక్కడి నుంచి క్రిప్టో వాలెట్​ల ద్వారా చైనా మళ్లిస్తున్నట్లు తేల్చారు. ముంబయికి చెందిన ఆరిఫ్, ఆనస్, ఖాన్ భాయ్, పీయూష్, శైలేష్​లు దుబాయ్​లో ఉంటూ.. డొల్ల కంపెనీల ఖాతాల్లోని నగదును హవాలా మార్గంలో తరలిస్తున్నారు. దీని కోసం ప్రకాష్ ప్రజాపతి కొంత మొత్తాన్ని తీసుకొని.. అందులోంచి తన సిబ్బందికి కమీషన్ చెల్లిస్తున్నాడు.

చైనా నుంచి ప్రకాష్ ప్రజాపతి డబ్బును తీసుకోవడానికి రుక్సిన్ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్ స్థాపించి, దాని పేరు మీదు ఎలక్ట్రిక్ బైకులు దిగుమతి చేసుకున్నట్లు సృష్టించినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ప్రకాష్ ప్రజాపతి ట్రాన్ కాయిన్ క్రిప్టో వాలెట్ ద్వారా డబ్బులను హెచ్ బొల్లా అనే క్రిప్టో వాలెట్​కు పంపించినట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వాలెట్​ను అంతర్జాతీయంగా ఉగ్రవాదులు సైతం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటే అది మోసంగానే భావించాలని... అమాయకులను మోసం చేసి సైబర్ నేరగాళ్లు వసూలు చేస్తున్న డబ్బులతో సంఘ విద్రోహ కార్యకలాపాలకు కూడా పాల్పడే ప్రమాదం ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సైబర్ మోసాల గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

ఇవీ చూడండి..

Cyber Fraud: మహేశ్‌ కోఆపరేటివ్ బ్యాంకుపై సైబర్‌ దాడి కేసులో ముమ్మర దర్యాప్తు

CYBER FRAUD: కానుకలంటూ నమ్మిస్తారు.. ఖాతాను ఖాళీ చేస్తారు..!

Last Updated :Jul 22, 2023, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.